ETV Bharat / bharat

ఒకప్పుడు సీఎం- ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పన్నీర్ సెల్వం- బీజేపీ ఫుల్ సపోర్ట్! - O Panneerselvam Politics

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 25, 2024, 6:02 PM IST

O Panneerselvam Contest As Independent Candidate : దక్షిణ భారతంపై ఫోకస్​ పెట్టిన బీజేపీ తమిళనాడులో వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నాడీఎంకే బహిష్కృత సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం(ఓపీఎస్)కు మద్దతు ప్రకటించింది. ఆయన పోటీ చేస్తున్న రామనాథపురం లోక్‌సభ స్థానం నుంచి అభ్యర్థిని నిలపబోమని వెల్లడించింది. ఒకప్పుడు సీఎం స్థాయికి ఎదిగి చక్రం తిప్పిన ఓపీఎస్ ఇప్పుడు ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.

O Panneerselvam Contest As Independent Candidate
O Panneerselvam Politics

O Panneerselvam Contest As Independent Candidate : 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దక్షిణ భారతంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. తమిళనాడులో ఎలాగైనా ఈసారి అత్యుత్తమ ఫలితాలను సాధించాలనే పట్టుదలతో ఉన్న మోదీసేన అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని వాడుకుంటోంది. ఈ క్రమంలోనే అన్నాడీఎంకే బహిష్కృత సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం(ఓపీఎస్)ను తమ వైపునకు తిప్పుకొని అన్నా డీఎంకేపైకి అస్త్రంగా ప్రయోగిస్తోంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి పన్నీర్ సెల్వం పోటీ చేస్తున్న రామనాథపురం లోక్‌సభ నియోజకవర్గంపైనే ఉంది. ఏప్రిల్ 19న పోలింగ్ జరగనున్న ఈ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న పన్నీర్ సెల్వంకు బీజేపీ మద్దతు ప్రకటించింది. అక్కడి నుంచి అభ్యర్థిని నిలపబోమని వెల్లడించింది.

రామనాథపురం స్థానంలో ఎవరి బలం ఎంత?
రామనాథపురం పార్లమెంట్ స్థానం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా 59 ఏళ్ల పి.జయపెరుమాళ్ పోటీ చేస్తున్నారు. రైతు అయిన జయపెరుమాళ్ కారియాపట్టి తాలూకాకు చెందినవారు. డీఎంకే రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సభ్యునిగా పనిచేసిన ఆయన 2011లోనే అన్నాడీఎంకేలో చేరారు. ఇక అధికార డీఎంకే కూటమి తరఫున ముస్లిం లీగ్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ నవాస్ కాని పోటీలో ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నవాస్ కాని 4.69 లక్షల ఓట్లతో విజయభేరి మోగించారు. అప్పట్లో అన్నాడీఎంకే మద్దతుతో పోటీచేసిన బీజేపీ అభ్యర్థి నయనార్ నాగేంద్రన్‌కు 3.42 లక్షల ఓట్లు పడ్డాయి.

అయితే ఈసారి అన్నాడీఎంకే, బీజేపీ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీతో పాటు అన్నాడీఎంకేలోని చీలిక వర్గం మద్దతుతో తాను సులువుగా రామనాథపురం పార్లమెంట్ స్థానం నుంచి గెలుస్తాననే ధీమాతో పన్నీర్ సెల్వం ఉన్నారు. గత ఎన్నికల్లో ముస్లిం లీగ్ అభ్యర్థి కేవలం లక్ష ఓట్ల మెజారిటీని సాధించారని దానిని సులువుగా తాను అధిగమిస్తానని సెల్వం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండు ఆకుల చిహ్నాన్ని వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ పన్నీర్ సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు సోమవారం జూన్​10కి వాయిదా వేసింది. అంటే ఈ ఎన్నికల్లో ఆయనకు ఆ చిహ్నం వాడుకునే ఛాన్స్ లేనట్టే!

ఇదీ ఓపీఎస్ బ్యాక్​గ్రౌండ్​!
ఒకప్పుడు అన్నాడీఎంకేలో బలమైన నేతగా పన్నీర్ సెల్వంకు పేరు ఉండేది. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఆయన్ను చెప్పేవారు. జయలలిత చనిపోయిన తర్వాత అన్నాడీఎంకే పార్టీ ముక్కలు కాకుండా పన్నీర్ సెల్వం, పళనిస్వామి కలసికట్టుగా పనిచేశారు. కానీ ఆ తర్వాతి కాలంలో వీరి మధ్య అంతరం పెరిగిపోయింది.

పళనిస్వామి అదును చూసి పన్నీర్ సెల్వంకు దెబ్బ కొట్టారు. ఏకంగా అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించారు. జయలలిత సన్నిహితురాలైన శశికళ చేతికి పార్టీని వెళ్లకుండా కాపాడుకున్న ఇద్దరు నేతల్లో ఇప్పుడు పళనిస్వామి అగ్రనేతగా ఎదిగారు. ఈ నేపథ్యంలో ఒంటరిగా మారిన పన్నీర్ సెల్వం ఎదుట ఈ లోక్‌సభ ఎన్నికలు పెద్ద సవాల్‌గా నిలిచాయి. ఒకప్పుడు సీఎం స్థాయికి చేరి ఓ వెలుగు వెలిగిన ఓపీఎస్ ఇప్పుడు ఒక్క స్థానం నుంచి గెలవడానికి చెమటోడ్చాల్సి వస్తోంది. అది కూడా ఒక స్వతంత్ర అభ్యర్థిగా.

తమిళిసై వైపే అందరి చూపు- దక్షిణ చెన్నైలో తెలంగాణ మాజీ గవర్నర్ గెలుస్తారా? - tamilnadu election 2024

గుజరాత్​లో బీజేపీతో ఆప్, కాంగ్రెస్ ఢీ- మోదీ సొంత రాష్ట్రం మరోసారి క్లీన్​ స్వీప్​ కానుందా? - gujarat lok sabha elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.