ETV Bharat / bharat

రెండున్నర గంటల వాదనలు- కేజ్రీవాల్‌కు 7 రోజుల ఈడీ కస్టడీ - Kejriwal ED Arrest Live Updates

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 22, 2024, 10:33 AM IST

Updated : Mar 23, 2024, 6:19 AM IST

Kejriwal ED Arrest Live Updates
Kejriwal ED Arrest Live Updates

Kejriwal ED Arrest Live Updates : దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను 7 రోజుల ఈడీ కస్టడీకి రౌస్‌ అవెన్యూ కోర్టు అనుమతించింది. దీంతో ఈ నెల 28 వరకు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారించనుంది.

  • 08.35 PM
  • దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 7 రోజుల ఈడీ కస్టడీ
  • ఈ నెల 28 వరకు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి ఇచ్చిన రౌస్‌ అవెన్యూ కోర్టు
  • రెండున్నర గంటలు కొనసాగిన ఇరువర్గాల వాదనలు
  • దిల్లీ మద్యం కేసులో నిన్న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన ఈడీ
  • 06.31 PM

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​ అరెస్ట్ విషయాన్ని ఎన్నికల సంఘాన్ని ఇండియా కూటమి పార్టీల నేతలు తీసుకెళ్లారు. ఆ సమయంలో వారితోపాటు కేజ్రీవాల్ సతీమణి సునీత కూడా ఉన్నారు. అనంతరం ఆమె ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. "ఇది దిల్లీ ప్రజలకు జరుగుతున్న ద్రోహం. మీ ముఖ్యమంత్రి ఎప్పుడూ మీ వెంటే ఉన్నారు. లోపల ఉన్నా బయట అయినా ఆయన జీవితం దేశానికే అంకితం. ప్రజలకు అన్నీ తెలుసు" అని ట్వీట్ చేశారు.

ఎన్నికల కమిషన్​ను కలిసిన తర్వాత మీడియాతో కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ సింఘ్వీ మాట్లాడారు. "కేజ్రీవాల్ అరెస్ట్​ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం. మీరు(కేంద్రం) ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం వల్ల ఎన్నికలతోపాటు ప్రజాస్వామ్యంపై ప్రభావం పడుతుంది. ఎన్నికల సంఘాన్ని జోక్యం చేసుకోవాలని కోరాం. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో సిట్టింగ్‌ సీఎం అరెస్ట్‌ కావడం ఇదే తొలిసారి. అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ ఖాతాలు స్తంభించపోయాయి. ప్రతిపక్ష నేతలపై ఏజెన్సీల దుర్వినియోగానికి ఆధారాలు ఇచ్చాం. డీజీపీ, సెక్రటరీలను మార్చిన ఎన్నికల సంఘం, ఏజెన్సీలను ఎందుకు నియంత్రించడం లేదు?" అని సింఘ్వీ ప్రశ్నించారు.

  • కేజ్రీవాల్‌ 10 రోజుల ఈడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
  • కాసేపట్లో కస్టడీ పిటిషన్‌పై తీర్పు ఇస్తామన్న రౌస్‌ అవెన్యూ కోర్టు
  • కేజ్రీవాల్‌ని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరిన ఈడీ
  • సుమారు రెండున్నర గంటల వాదనల అనంతరం ఉత్తర్వులు వాయిదా
  • కాసేపట్లో వెలువరించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా
  • 05.08 PM
  • కేజ్రీవాల్ రిమాండ్‌ను యాంత్రికంగా చూడవద్దన్న అభిషేక్ సింఘ్వీ
  • కేజ్రీవాల్ అరెస్టులో ప్రజాస్వామ్య సూత్రాలు ముడిపడి ఉన్నాయన్న సింఘ్వీ
  • కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపిస్తున్న మరో న్యాయవాది విక్రమ్
  • కేసులో ఒక ప్రాసిక్యూషన్, 5 అనుబంధ ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు: విక్రమ్‌
  • నిందితులు, అనుమానితుల కేటగిరీలో కేజ్రీవాల్ పేరు ఎప్పుడూ కనిపించలేదు: విక్రమ్
  • గతేడాది అక్టోబరు నుంచి సమన్లు ఇవ్వడం మొదలుపెట్టారు: విక్రమ్
  • నిన్నటివరకు ప్రతి దానికి స్పందించి, తగిన జవాబు ఇచ్చారు: విక్రమ్
  • సమన్లు మెయిల్ చేసి వాటిలో సీఎంగా కాకుండా వ్యక్తిగత హోదాలో అన్నారు: విక్రమ్
  • కేసులో కేజ్రీవాల్ సహకరిస్తున్నారో లేదో కోర్టు నిర్ణయిస్తుందన్న విక్రమ్
  • కేజ్రీవాల్ తరఫున మరికొన్ని వాదనలు వినిపించేందుకు సిద్ధమైన రమేష్ గుప్తా
  • ఒకరి తరఫున ముగ్గురు న్యాయవాదులు ఎలా వాదిస్తారన్న ఈడీ న్యాయవాది
  • ఇప్పుడు విచారణకు రిమాండ్ కోరుతున్నామని ఈడీ చెపుతోంది: రమేష్ గుప్తా
  • అంటే వారివద్ద కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలూ లేవు: రమేష్ గుప్తాృ
  • ఆధారాలు లేకున్నా కేజ్రీవాల్‌ నేరం చేశారని నిర్ధారించారు: రమేష్ గుప్తా
  • 04.38 PM
  • కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే సమన్లకు స్పందించలేదన్న ఈడీ
  • కేజ్రీవాల్‌ ఇంట్లో సోదాలు సమయంలో కూడా సరైన సమాచారం ఇవ్వలేదు: ఈడీ
  • కేజ్రీవాల్‌ను పూర్తిస్థాయిలో విచారించి సమాచారం రాబట్టాల్సి ఉంది: ఈడీ
  • కేజ్రీవాల్‌ ఏమాత్రం దర్యాప్తునకు సహకరించడం లేదు: ఈడీ
  • 03.52 PM
  • దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ముగిసిన ఈడీ వాదనలు
  • కేజ్రీవాల్ తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు
  • కస్టోడియల్ ఇంటరాగేషన్ ఎందుకని ప్రశ్నించిన సింఘ్వీ
  • ముఖ్యమంత్రి, మంత్రులను అరెస్ట్ చేశారు: న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ
  • కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఈడీ వద్ద ఆధారాలు ఉంటే కస్టడీకి ఎందుకు?: సింఘ్వీ
  • అప్రూవర్లుగా మారిన వారిని నమ్మాల్సిన అవసరం లేదు: అభిషేక్ సింఘ్వీ
  • కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్న సింఘ్వి
  • 03.24 PM
  • మద్యం విక్రేతలందరూ కొంతమేరకు నగదు చెల్లించారు: ఈడీ న్యాయవాది
  • నేర ఆదాయంలో రూ.45 కోట్లు హవాలా ద్వారా గోవాకు బదిలీ చేశారు: ఈడీ
  • గోవాకు 4 మార్గాల్లో డబ్బు తరలించారు: ఈడీ న్యాయవాది
  • డబ్బు చేతులు మారిందనే ఆరోపణను గోవాలోని ఆప్ అభ్యర్థి చెప్పారు: ఈడీ
  • ఈ విషయం చెప్పిన వ్యక్తికి కూడా నగదు చెల్లించారు: ఈడీ న్యాయవాది
  • ఆ నగదు మొత్తం దిల్లీ మద్యం విధానం కిక్‌బ్యాక్‌ల నుంచి వచ్చిందే: ఈడీ
  • 03.17 PM
  • శరత్‌చంద్రారెడ్డి ఇచ్చిన ప్రకటనను ప్రస్తావించిన ఈడీ న్యాయవాది
  • కిక్‌బ్యాక్‌లకు బదులుగా సౌత్‌గ్రూప్ మద్యం వ్యాపారంపై పట్టు సాధించింది: ఈడీ
  • కుట్ర ద్వారా వచ్చిన ఆదాయం వినియోగంలో కేజ్రీవాల్ పాత్ర కీలకం: ఈడీ
  • ఈ నేర ఆదాయం రూ.100 కోట్ల లంచం మాత్రమే కాదు: ఈడీ న్యాయవాది
  • లంచం చెల్లించేవారి ద్వారా వచ్చే లాభాలు కూడా ఉన్నాయి: ఈడీ న్యాయవాది
  • అవన్నీ కలిపితే రూ.600 కోట్లకు పైమాటే: ఈడీ న్యాయవాది
  • సౌత్‌గ్రూప్‌ నుంచి వచ్చిన 45 కోట్లను గోవా ఎన్నికల కోసం వినియోగం : ఈడీ న్యాయవాది
  • హోల్‌సేల్‌ వ్యాపారులకు 12 శాతం వచ్చేలా పాలసీ రూపకల్పన : ఈడీ న్యాయవాది
  • రిటైల్‌ వ్యాపారులకు 185 శాతం వచ్చేలా పాలసీ రూపకల్పన : ఈడీ న్యాయవాది
  • 03.02 PM

లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కింగ్‌పిన్ అని కీలక కుట్రదారు అని వాదనల సందర్భంగా ఈడీ, కోర్టుకు తెలిపింది. ఈ కేసులో గురువారం రాత్రి 9 గంటలకు కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ, శుక్రవారం రౌజ్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరచింది. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌- ఇతర మంత్రులు, ఆప్‌ నేతలతో పాటు కేజ్రీవాల్‌ కూడా సూత్రదారేనని పేర్కొంది. ఈడీ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు, అరెస్టుకు దారి తీసిన కారణాలను కోర్టుకు వివరించారు. కేజ్రీవాల్ కనుసనల్లోనే మద్యం విధానం రూపకల్పన జరిగిందని, ఈ కేసులో మరో నిందితుడైన దిల్లీ మాజీ మంత్రి సిసోడియాతో ఆయన నిత్యం సంప్రదింపుల్లో ఉండేవారని ఈడీ తెలిపింది. సౌత్‌గ్రూప్‌నకు, నిందితులకు మధ్య కేజ్రీవాల్‌ మధ్యవర్తిగా ఉన్నారని వివరించింది. సౌత్‌గ్రూప్‌ నుంచి కొన్ని కోట్ల రూపాయలను కేజ్రీవాల్‌కు అందాయని వివరించింది. పంజాబ్‌ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్‌ 100 కోట్లను సౌత్‌గ్రూప్‌ సభ్యుల నుంచి డిమాండ్‌ చేశారంది.

  • 02.54 PM
  • దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ ప్రారంభం
  • ఈడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు
  • అరెస్టుకు దారి తీసిన కారణాలు చట్టంలో నిబంధనలు కోర్టుకు వివరిస్తున్న ఏఎస్‌జీ
  • దిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి: ఈడీ
  • కేజ్రీవాల్ కనుసనల్లోనే మద్యం విధానం రూపకల్పన జరిగింది: ఈడీ
  • సిసోదియాతో కేజ్రీవాల్‌ నిత్యం సంప్రదింపుల్లో ఉన్నారు: ఈడీ
  • 02.40 PM
  • దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ ప్రారంభం
  • ఈడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు
  • అరెస్టుకు దారి తీసిన కారణాలు చట్టంలో నిబంధనలు కోర్టుకు వివరిస్తున్న ఏఎస్‌జీ
  • 2.00 PM
    దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరైస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​ను రౌస్​ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు ఈడీ అధికారులు. స్పెషల్​ జడ్జి కావేరి బవేజా ఎదుట కేజ్రీవాల్​ను ప్రవేశపెట్టారు.
  • 1:36 PM

కేజ్రీవాల్ అరెస్టుపై 'ఇండియా' పోరాటం
అరవింద్ కేజ్రీవాల్​ అరెస్టుకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇండియా కూటమి సిద్ధమైది. ఈ మేరకు విపక్ష నేతలు ఎన్నికల సంఘాన్ని కలవనున్నట్లు బంగాల్ సీఏం, తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. లోక్​సభ ఎన్నికల ముంగిట ఎలక్షన్​ కోడ్​ అమలులో ఉండగా ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తామని వెల్లడించారు.

కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. ఆప్‌ శ్రేణులతోపాటు ఇండియా కూటమిలోని పార్టీలు నిరసన కార‌్యక్రమాలు చేపట్టాయి. తమిళనాడులో డీఎంకే శ్రేణులు చెన్నైఈడీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్‌ సహా సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను ఖండించిన డీఎంకే నేత దయానిధి మారన్‌, మోదీ సర్కార్‌ ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. కేరళలోనూ సీపీఎంతోపాటు కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనలు చేశాయి. కన్నూరులో సీపీఎం శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించి ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశాయి. ఎర్నాకుళంలో ఆప్‌ శ్రేణులు బీజేపీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టాయి

  • 12:36 PM

సుప్రీం పిటిషన్​ వెనక్కి
ఈడీ అరెస్టుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్​ను కేజ్రీవాల్​ వెనక్కు తీసుకున్నారు. రౌస్ అవెన్యూ కోర్టులో రిమాండ్ పిటిషన్‌పై విచారణ దృష్ట్యా వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తన వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కేజ్రీవాల్​ తరఫున న్యాయవాది మను సింఘ్వి, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనానికి తెలిపారు.

  • 12:20 PM

కాసేపట్లో కోర్టు ముందుకు కేజ్రీవాల్‌

  • కాసేపట్లో పీఎంఎల్‌ఏ కోర్టు ముందుకు దిల్లీ సీఎం కేజ్రీవాల్‌
  • కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరచనున్న ఈడీ అధికారులు
  • కేజ్రీవాల్‌ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరే అవకాశం
  • ఉదయం ఈడీ కార్యాలయంలోనే కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు
  • దిల్లీ మద్యం కేసులో నిన్న రాత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన ఈడీ
  • 12:00 PM

భద్రతపై ఆందోళన

  • కేజ్రీవాల్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆప్‌ నాయకులు
  • ఈడీ కస్టడీలోని కేజ్రీవాల్‌కు కేంద్రం రక్షణ కల్పిస్తుందా? అని ప్రశ్నించిన ఆప్‌ నేతలు
  • ఎన్నికల ముందు విపక్ష నేతలపై దాడులు మొదలయ్యాయన్న ఆప్‌ నేతలు
  • కేజ్రీవాల్ ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు దాడులు చేస్తున్నారన్న ఆప్‌
  • తమ పార్టీని అణచివేసేందుకు భాజపా ప్రయత్నిస్తోందన్న ఆప్‌ నేతలు
  • 11:40 AM

పోలీసుల అదుపులో ఆతిశీ, సౌరభ్​ భరద్వాజ్
కేజ్రీవాల్​ అరెస్టుకు వ్యతిరేకంగా దిల్లీలో పెద్దఎత్తున ఆందోళనల్లో పాల్గొన్న మంత్రులు ఆతిశీ, సౌరభ భరద్వాజ్​తో పాటు పలువురు ఆప్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఆప్‌ఎమ్మెల్యే రాఖీ బిర్లాను పోలీసులు అరెస్టు చేశారు. ఐటీఓ ప్రాంతంలో 144 సెక్షన్​ను అమలు చేశారు. మరోవైపు ఆప్​ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.

  • 11:00 AM

అరెస్ట్​ వ్యతిరేకంగా కేజ్రీ పిటిషన్​- స్వీకరించిన సుప్రీం
ఈడీ అరెస్ట్​కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీం కోర్టు విచారణకు అనుమతించింది. ఈ మేరకు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్​ సింఘ్వి అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంది. జస్టిస్​ సంజీన్ ఖన్నా నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల ప్రత్యేక ధర్మాసం ఈ కేసును విచారించనుంది. అంతకుముందు ఈ కేసును అర్జెంటుగా విచారణకు స్వీకరించాల్సిందిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు సింఘ్వి ప్రస్తావించారు. దీంతో జస్టిస్ ఖన్నా ధర్మాసనం వత్త ఈ విషయం ప్రస్తావించాల్సిందిగా సీజేఐ ఆదేశించారు.

Kejriwal ED Arrest Live Updates : మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్య నిపుణుల బృందం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయానికి చేరుకుంది. అనంతరం కేజ్రీవాల్‌కు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కేజ్రీవాల్‌ అరెస్టు దృష్ట్యా ఐటీవో వద్ద భారీ ఎత్తున భద్రతాబలగాలు మోహరించాయి. రహదారులపై ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశాయి. పోలీసుల సూచనల ప్రకారం ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఐటీవో మెట్రో స్టేషన్‌ను మూసివేయనున్నట్లు దిల్లీ మెట్రో ప్రకటించింది. మరోవైపు కేజ్రీవాల్‌ అక్రమ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని ఆమ్‌ఆద్మీపార్టీ పిలుపునిచ్చింది.

దిల్లీ సీఎం అక్రమ అరెస్టుకు నిరసనగా ఆందోళనలు నిర్వహించాలన్న ఆప్‌ పిలుపు మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. కృష్ణ మీనన్‌ మార్గ్‌, మోతీలాల్‌ నెహ్రూ మార్గ్‌, జన్‌పథ్‌, అబ్దుల్‌ కలాం రోడ్డు తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉంటాయని సూచనలు చేశారు. ఆయా మార్గాల్లో ప్రయాణాలు మానుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు పలువురు ఆప్‌ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. MLA రాఖీ బిర్లాను అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్‌ను ఈడీ హెడ్‌క్వార్టర్స్‌లోని ఒక లాకప్‌లో రాత్రంతా ఉంచారని అధికార వర్గాలు తెలిపాయి. రాత్రి ఆయన సరిగా నిద్రపోలేదని తెలిపాయి. బ్రేక్‌ఫాస్ట్‌ చేశాక మందులు వేసుకున్నారని పేర్కొన్నాయి.

మద్యం కుంభకోణం కేసులో 16 మందిని అరెస్టు చేసి విచారిస్తున్న ఈడీ విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్‌కు 9సార్లు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టును కేజ్రీవాల్‌ ఆశ్రయించగా ఆయన అభ్యర్థనను గురువారం హైకోర్టు తోసిపుచ్చింది. విచారణను ఏప్రిల్‌ 22కు వాయిదా వేసింది. ఈ క్రమంలో ఈడీ అధికారుల బృందం సెర్చ్‌ వారెంట్‌తో కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లింది. సోదాలు చేసి, కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆయన్ను అరెస్టు చేశారు. అయితే కేజ్రీవాల్‌ అరెస్టైనా ఆయనే సీఎంగా కొనసాగుతారని, దిల్లీ మంత్రి ఆతిశీ ప్రకటించారు. ఈడీ చర్యపై కేజ్రీవాల్‌ న్యాయవాదులు వేసిన పిటిషన్‌ను ఇవాళ సుప్రీంకోర్టు విచారించనుంది.

Last Updated :Mar 23, 2024, 6:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.