ETV Bharat / bharat

'ఛలో దిల్లీ'కి రైతుల పిలుపు- సర్కారు అలర్ట్- 7జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 10:54 PM IST

Internet Restrictions In Haryana : హరియాణాలోని 7 జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్​, సేవలను నిలిపివేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఈ ఆదేశాలను అమలులో ఉండనున్నాయ. హరియాణా, పంజాబ్​ రైతులు ఫిబ్రవరి 13న 'ఛలో దిల్లీ' కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Etv Bharat
Internet Restrictions In Haryana

Internet Restrictions In Haryana : రైతులు ఫిబ్రవరి 13న 'ఛలో దిల్లీ' కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో 7 జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్, బల్క్​ ఎస్​ఎమ్​ఎస్​ సేవలను హరియాణా ప్రభుత్వం నిలిపివేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం అంబాలా, కురుక్షేత్ర, కైథాల్, జింద్, హిసార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల్లో ఫిబ్రవరి 11న ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 13న రాత్రి 11.59 గంటల వరకు ఇంటర్నెట్​ను నిలిపివేయనున్నారు. ఈ మేరకు ఆదేశాలను పాటించాల్సిందిగా హరియాణా ఇంటర్నెట్​ సర్వీస్ ప్రొవైడర్లకు తెలియజేశారు. అయితే వ్యక్తిగత ఎస్​ఎమ్​ఎస్, మొబైల్​ రీఛార్జ్​, బ్యాంకింగ్ ఎస్​ఎమ్​ఎస్, వాయిస్ కాల్స్, బ్రాడ్​బ్యాండ్, కార్పొరేట్- డొమెస్టిక్ లీజ్​ లైన్స్​కు మినహాయింపు ఇచ్చారు.

రైతులు పిలుపునిచ్చిన కార్యక్రమం వల్ల ఏడు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఏజీడీపీ, సీఐడీ హరియాణా తన దృష్టికి తీసుకువచ్చినట్లు హరియాణా జాయింట్ సెక్రటరీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొబైల్ ఫోన్స్​, సోషల్ మీడియా ద్వారా పుకార్ల వ్యాప్తిని నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్​కేఎమ్​), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎమ్​ఎమ్​) వంటి 200కు పైగా రైతు సంఘాలు ఫిబ్రవరి 13న 'ఛల్లో దిల్లీ'కి పిలుపునిచ్చాయి. గత కొంత కాలంగా కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని, రైతులకు పింఛను, పంటబీమా, 2020 ఆందోళనల్లో రైతులపై పెట్టిన కేసులు కొట్టివేయాలని డిమాండ్‌ చేస్తూ హరియాణా, పంజాబ్ రైతులు నిరసన చేస్తున్నారు.

కాగా, మంగళవారం (ఫిబ్రవరి 8) దిల్లీకి ట్రాక్టర్‌ మార్చ్‌ నిర్వహించాలని రైతులు నిర్ణయించారు. దీంతో అప్రమత్తమైన హరియాణా, పంజాబ్‌ పోలీసులు, మునుపటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. గత ఆందోళనల్లో క్రియాశీలంగా పని చేసినవారిని అదుపులోకి తీసుకున్నారు. ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి రాజధానిలోకి రైతులు ప్రవేశించకుండా అడ్డుకున్నారు. అంతర్‌ రాష్ట్ర సరిహద్దుల్లో ఇసుకబస్తాలతో గోడలు, సిమెంట్‌ బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఆందోళనలో పాల్గొనేందుకు దిల్లీ వెళ్లాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

'సార్వత్రిక ఎన్నికలకు ముందే CAA అమలు, ఆర్టికల్​ 370 రద్దుతో 370 సీట్లు పక్కా'

'ఆర్యన్ ఖాన్​ డ్రగ్స్​ కేసులో లంచం'- NCB మాజీ డైరెక్టర్​పై ఈడీ మనీలాండరింగ్​ కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.