ETV Bharat / bharat

'ఆ 14 స్థానాల్లో మేమే'- గట్టి షాకిచ్చిన కేజ్రీవాల్- ఇండియా కూటమి కుదేల్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 5:29 PM IST

India Alliance AAP : విపక్ష కూటమి ఇండియా కుదేలైనట్లు కనిపిస్తోంది! పంజాబ్, చండీగఢ్‌లోని మొత్తం 14 లోక్‌సభ స్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్​ ప్రకటించింది. మరో 10 రోజుల్లో అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని చెప్పారు ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్​.

India Alliance AAP
India Alliance AAP

India Alliance AAP : దేశంలో అధికారంలో ఉన్న ఎన్​డీఏ కూటమిని గద్దె దింపేందుకు ఏర్పడ్డ విపక్షాల ఇండియా కూటమికి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే లోక్​సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగుతామని బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించగా, తాజాగా ఆమ్​ ఆద్మీ పార్టీ మరో షాక్​ ఇచ్చింది. పంజాబ్, చండీగఢ్‌లోని కూటమితో తమకు ఎలాంటి పొత్తు ఉండదని ప్రకటించింది.

పంజాబ్, చండీగఢ్‌లోని మొత్తం 14 లోక్‌సభ స్థానాలకు తాము పార్టీ ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు ఆప్ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​. వచ్చే 10-15 రోజుల్లో మొత్తం 14 స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. పంజాబ్‌లోని అమ్లోహ్‌లో ఘర్ ఘర్ రేషన్ పథకాన్ని ప్రారంభించిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. మొత్తం 14 స్థానాల్లో అఖండ మెజారిటీతో ఆప్​ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

"మరోసారి మీ ఆశీస్సులు కోరుతున్నాను. మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్‌లో 13 సీట్లు, చండీగఢ్‌లో ఒకటి. మొత్తంగా 14 సీట్లు ఉన్నాయి. వచ్చే 10-15 రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తుంది. మీరు రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాకు మద్దతిచ్చినట్లే, సార్వత్రిక పోరులో 14 స్థానాల్లో ఆప్​ను గెలిపించండి. తమ పార్టీ గుర్తు చీపురుకు ఓటు వేయండి" అని కేజ్రీవాల్​ ప్రజలను కోరారు.

'దోచుకున్నది పంచుకోలేకే ఇలా!'
మరోవైపు, కేజ్రీవాల్​ ప్రకటనపై పంజాబ్​ బీజేపీ నేత మంజీందర్ సింగ్ స్పందించారు. "ఏజెన్సీలపై ఒత్తిడి తెచ్చి అవినీతి ద్వారా కూడబెట్టిన సొమ్మును కాపాడుకోవడమే ఇండియా కూటమి ఏకైక ఉద్దేశం. ఆ కూటమికి ఎలాంటి సిద్ధాంతాలు, ఆలోచనలు లేవు. కాంగ్రెస్ పార్టీతో అధికారం పంచుకోవడాన్ని అరవింద్ కేజ్రీవాల్​ ఎప్పటికీ కోరుకోరు. పంజాబ్‌లో ఒంటరిగానే పోటీ చేస్తారు. తాను దోచుకున్నది కాంగ్రెస్​తో పంచుకోరు" అని ఆరోపించారు.

అసోంలో అభ్యర్థుల ప్రకటన
ఇటీవలే అసోంలో మొత్తం 14 లోక్‌సభ నియోజకవర్గాలకుగాను మూడు స్థానాలకు అభ్యర్థులను ఆప్ ప్రకటించింది. దిబ్రుగఢ్‌ నుంచి మనోజ్‌ దానోవర్‌, గువాహటి, తేజ్‌పుర్‌ స్థానాల నుంచి భాబెన్‌ చౌదరి, రిషిరాజ్‌ కౌంటిన్యలు పోటీ చేస్తారని వెల్లడించింది. ఈ మూడు కూడా కాంగ్రెస్‌కు మంచి పట్టున్న స్థానాలే కావడం గమనార్హం. సీట్ల పంపకాలను వీలైనంత తొందరగా తేల్చాలని ఇప్పటికే కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని పలుమార్లు కోరామని, ఎంతకూ స్పందన రాకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో అభ్యర్థులను ప్రకటించామని ఆప్‌ జాతీయ కార్యదర్శి సందీప్‌ పాఠక్‌ మీడియాకు వెల్లడించారు.

'నన్ను జైలుకు పంపినా అభివృద్ధి ఆగదు- బీజేపీకి ఆప్​ తలవంచదు'

'కాంగ్రెస్​తో పొత్తు పెట్టుకోం'- ఒకే రోజు షాక్​ ఇచ్చిన ఆప్​, టీఎంసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.