ETV Bharat / bharat

పాముకాటుకు విరుగుడు- ల్యాబ్​లో యాంటీబాడీల అభివృద్ధి- బెంగళూరు శాస్త్రవేత్తల ఘనత!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 2:19 PM IST

Updated : Feb 23, 2024, 3:14 PM IST

Snake Venom Antibodies By IISC Bangalore : బెంగళూరులోని ఇండియన్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ సైన్స్​ శాస్త్రవేత్తలు పాముకాటుకు విరుగుడు కనిపెట్టడంలో సఫలవంతమయ్యారు. పాము కాటు వేసినప్పుడు మానవ శరీరంలోకి విడుదలయ్యే ప్రాణాంతక విష పదార్థాలను నిర్వీర్యం చేయగల మానవ యాంటీబాడీని ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించారు.

Snake Venom Antibodies By IISC Bangalore
Snake Venom Antibodies By IISC Bangalore

Snake Venom Antibodies By IISC Bangalore : పాముకాటుకు విరుగుడు కనిపెట్టడంలో ఇండియన్​ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు. పాము కాటు వేసినప్పుడు మానవ రక్తంలో విడుదలయ్యే ప్రాణాంతకర విష పదార్థాలను నిర్వీర్యం చేయగల యాంటీబాడీని శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించారు. ఈ కీలక పరిశోధనలో అమెరికాకు చెందిన స్కిప్స్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు కూడా భాగస్వామ్యులయ్యారు. ఈ పరిశోధనకు హెచ్‌ఐవీ, కొవిడ్‌-19 వైరస్‌లను ఎదుర్కొనే యాంటీబాడీల అధ్యయనం ప్రాతిపదికగా నిలిచింది.

కింగ్ కోబ్రా సహా విష సర్పాల కాట్లకు చెక్​!
తమ సింథటిక్‌ యాంటీబాడీ తాచుపాము, నాగుపాము (కింగ్‌ కోబ్రా), కట్లపాము, బ్లాక్‌మాంబా లాంటి సర్పాల విషాన్ని ఎదుర్కోగలదని పరిశోధకులు వెల్లడించారు. ప్రస్తుతం గుర్రాలు, కంచర గాడిదలకు పాము విషాన్ని ఎక్కించి విరుగుడు మందులు తయారు చేస్తున్నారు. ఈ పద్ధతి ఆ జంతువులకు హానికరంగా పరిణమిస్తోంది. తాజా పరిశోధన వల్ల ప్రయోగశాలలోనే సింథటిక్‌ యాంటీబాడీలను తయారుచేయడానికి అవకాశం ఏర్పడుతుంది.

భారత్, ఆఫ్రికాలో ప్రతీ ఏటా పాముకాట్ల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 'గుర్రాలు, గాడిదలపై ప్రయోగించి పాముకాటుకు విరుగుడు మందును తయారు చేస్తుండడం వల్ల వాటి జీవితకాలంలో బ్యాక్టరీల, వైరస్​ల వల్ల ప్రభావితమవుతున్నట్లుగా గుర్తించాము' అని ఓ అసోసియేట్ ప్రొఫెసర్ తెలిపారు. పాముకాటు చికిత్సకు యాంటీబాడీలను అభివృద్ధి పరిచేందుకు ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని రూపొందించడం ఇదే తొలిసారి. ఈ కొత్తరకం యాంటీబాడీలను తయారు చేయడం వల్ల అన్ని రకాల పాము కాట్ల నుంచి రక్షించుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని పరిశోధకులు తెలిపారు.

'జంతువులకు ఎలాంటి హానీ జరగదు'
తాము తయారు చేసిన యాంటీబాడీల వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నట్లుగా ఐఐఎస్​సీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది పూర్తిగా మనుషులపై ప్రయోగిస్తారు కాబట్టి సరైన ఫలితాలను గమనించవచ్చు. సంప్రదాయ వైద్యంలో మొదట జంతువులపై మందును ప్రయోగించేవారు. దానివల్ల జంతువులకు హాని జరిగేది. తాము ప్రయోగశాలలో తయారు చేసిన యాంటీబాడీల వల్ల జంతువులపై ఎలాంటి ప్రభావం లేకుండా చేయవచ్చని ఐఐఎస్​సీ పరిశోధకులు చెబుతున్నారు.

Last Updated : Feb 23, 2024, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.