ETV Bharat / bharat

రాజ్యసభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహించిన సీఎం- హిమాచల్​లో కాంగ్రెస్ సర్కార్ సేఫ్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 7:07 PM IST

Himachal Pradesh Congress CM
Himachal Pradesh Congress CM

Himachal Pradesh Political Crisis : హిమాచల్​ ప్రదేశ్​ కాంగ్రెస్​ రాజ్యసభ అభ్యర్థి ఓటమికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్​ సింగ్ సుఖు బాధ్యత వహించారు. ఈ మేరకు కాంగ్రెస్​ కేంద్ర పరీశీలకుడు డీకే శివకుమార్​ తెలిపారు. ఇక హిమాచల్​లో కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించి బీజేపీ విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది.

Himachal Pradesh Political Crisis : రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ ఓటమికి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు బాధ్యత వహించారని ఆ పార్టీ కేంద్ర పరిశీలకుడు డీకే శివకుమార్ చెప్పారు. సీఎం సుఖుతో పాటు, పార్టీ ఎమ్మెల్యేలు, హిమాచల్‌ప్రదేశ్‌ కాంగ్రెస్ విభాగం చీఫ్ ప్రతిభా సింగ్‌తో మాట్లాడామని, విభేదాలన్ని తొలగిపోయాయని చెప్పారు. పార్టీ అంతర్గత విషయాలను క్రమబద్ధీకరించడానికి సీఎం, డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ సహా ముఖ్య నేతలతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు శివకుమార్‌ ప్రకటించారు.

పరిస్థితి అంతా 'అండర్​ కంట్రోల్'
హిమాల్​చల్​ప్రదేశ్​లో పరిస్థితి అంతా అండర్​ కంట్రోల్​ ఉన్నట్లు కాంగ్రెస్ గురువారం​ తెలిపింది. ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేసి బీజేపీ విఫలమైందని చెప్పింది. అయితే ఇలా చేయడానికి బీజేపీ ధనబలం, ప్రభుత్వ బలం, కండబలం ఉపయోగించినా లాభం లేకపోయిందని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు.

పావులు కదిపిన కాంగ్రెస్
హిమాచల్‌ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నిక రాజేసిన రాజకీయ చిచ్చును ఆర్పేందుకు కాంగ్రెస్‌ వేగంగా పావులు కదిపింది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసిన ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ద్వారా అనర్హత వేటు వేయించింది. శాసనసభలో ఆర్థిక బిల్లు ఆమోదానికి ఓటు వేయాలని అధికార కాంగ్రెస్‌ ఇచ్చిన విప్‌ను ధిక్కరించారంటూ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా అనర్హత వేటు వేశారు. ఎమ్మెల్యేలు రాజిందర్ రాణా, సుధీర్ శర్మ, ఇందర్ దత్ లఖన్‌పాల్, దేవిందర్ కుమార్, రవి ఠాకూర్, చేతన్య శర్మలపై అనర్హత వేటు వేసినట్లు స్పీకర్ తెలిపారు.

ఎమ్మెల్యేల అనర్హతపై బుధవారం తన తీర్పును రిజర్వ్ చేసిన స్పీకర్ పథానియా, పార్టీ గుర్తుపై ఎన్నికైనందున ఈ శాసనసభ్యులు కాంగ్రెస్ విప్‌ను ధిక్కరించి ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారని శిమ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు.

మెజారిటీ ఉంటే ఎందుకు సస్పెండ్ చేశారు? : బీజేపీ
15 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై బీజేపీ స్పందించింది. 'దేవభూమి హిమాచల్​ప్రదేశ్​లో జరిగిన రాజకీయ పరిణామాలను దేశమంతా చూసింది. కాంగ్రెస్​కు మెజారిటీ ఉంటే సభను ఎందుకు వాయిదా వేశారు? బీజేపీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారు?' అని ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్​ అన్నారు.

ఇదీ నేపథ్యం
మంగళవారం హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు అనుకూలంగా ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. అనంతరం ఆ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌ జరిగిన ఓటింగ్‌కు వీరు దూరంగా ఉన్నారు. క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్‌పై అవిశ్వాస తీర్మానం చేపట్టాలని ఆ రాష్ట్ర గవర్నర్ శివ్‌ ప్రతాప్ శుక్లాను కలిసిన బీజేపీ నేతలు, అసెంబ్లీలో బడ్జెట్‌ ఆమోదం పొందకుండా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సభలో నినాదాలు చేసిన 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ పఠానియా సస్పెండ్ చేశారు. అనంతరం మూజువాణి ఓటుతో ఆర్థిక బిల్లును సభ ఆమోదించింది. తర్వాత హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీని స్పీకర్‌ నిరవధికంగా వాయిదా వేశారు. ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తర్వాత హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ బలం 68 నుంచి 62కి తగ్గింది. సభలో మెజారిటీ సంఖ్య కూడా 35 నుంచి 32 తగ్గింది. ప్రస్తుతం 34 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో ఉన్నారు.

బ్యాలెట్ టు ఈవీఎం-75 ఏళ్ల ఎలక్షన్ కమిషన్ ప్రయాణం- ఆసక్తికర విషయాలివే!

ఇంటింటికి ఫ్రీ కరెంట్ పథకం- అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్​- అప్లై చేసుకోండిలా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.