Fathers Vs Sons In Odisha Elections : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేడి పతాకస్థాయికి చేరింది. తొలి దశ పోలింగ్కు సమయం సమీపిస్తున్న వేళ ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే, ఈ లోక్సభ ఎన్నికల వేళ ఒడిశాలో తండ్రి-తనయుల మధ్య సమరం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ముగ్గురు ప్రముఖ రాజకీయ నాయకులు తమ కుమారుల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. తండ్రి, కుమారులు వేర్వేరు పార్టీల్లో ఉండి ప్రచారం చేస్తుండడం ఓటర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వారే కాంగ్రెస్ నేతలు సురేశ్ రౌత్రాయ్, చింతామణి ద్యన్ సామంతరాయ్ కుమారులు బిజు జనతా దళ్కు చెందిన బిజోయ్ మోహపాత్ర. కుమారులు తెచ్చిన తల నొప్పితో తండ్రులు సతమతం అవుతున్నారు.
తండ్రికి పార్టీ నుంచి నోటీసు
భువనేశ్వర్ లోక్సభ స్థానం నుంచి అధికార బిజు జనతా దళ్(బీజేడీ) అభ్యర్థిగా ఉన్న తన కుమారుడు మన్మత్ రౌత్రేను గెలిపించాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జటాని ఎమ్మెల్యే సురేష్ రౌత్రే ప్రచారం చేశారు. తన కుమారుడు మన్మత్ రౌత్రే తరపున భువనేశ్వర్లో ప్రచారం చేస్తూ కనిపించారు. దీనిపై ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఓపీసీసీ) తీవ్రంగా స్పందించింది. దీనిపై వెంటనే సమాధానం చెప్పాలని సురేష్ రౌత్రేకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. తన కుమారుడికి ఓటు వేయాలా వద్దా అని ప్రజలు ప్రశ్నిస్తే అవునని మాత్రమే చెబుతున్నానని అని ఈ విషయంపై సురేశ్ స్పందించారు. ఏఐసీసీ, ఓపీసీసీ తనను శిక్షించాలనుకుంటే దానికి సిద్ధంగా ఉన్నానని, అలాగే మరణించే వరకూ కాంగ్రెస్ నేతగానే ఉంటానని రౌత్రే స్పష్టం చేశారు. సురేశ్ రౌత్రే కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు.
రెండు పార్టీలో ఇద్దరు కుమారులు
ఒడిశా అసెంబ్లీ మాజీ స్పీకర్, గంజాం జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత చింతామణి ద్యన్ సమంతరాయ్ పరిస్థితి మరింత కష్టంగా మారింది. ఆయన కుమారులు ఒకరు కాంగ్రెస్, మరొకరు బీజేపీ నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. తన కుమారులే ప్రధాన పోటీదారులు కావడం వల్ల ఎవరికి ఓటు వేయాలని ప్రజలకు చెప్పాలో తెలీక చింతామని సతమతమవుతున్నారు. చిన్న కుమారుడు మనోరంజన్ ద్యన్ సమంతరాయ్ బీజేపీ నుంచి బరిలో దిగగా, పెద్ద కుమారుడు రవీంద్రనాథ్ ద్యన్ సమంతరాయ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున చింతామణి ద్యన్ మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. చిన్న కుమారుడు మనోరంజన్ రెండుసార్లు శాసనసభకు పోటీ చేసి ఓడిపోయి ఇప్పుడు బీజేపీ నుంచి మళ్లీ బరిలో నిలిచారు. పెద్ద కుమారుడు రవీంద్రనాథ్ ఇప్పుడు తొలిసారి కాంగ్రెస్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇది ఇద్దరు అన్నదమ్ముల మధ్య కాకుండా రెండు సిద్ధాంతాల మధ్య పోటీ అని రవీంద్రనాథ్ అన్నారు. కొన్నేళ్లుగా తాను రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నానని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ అవకాశం ఇచ్చిందని మనోరంజన్ తెలిపారు. అయితే అనారోగ్య కారణాల వల్ల తన కుమారుల కోసం ప్రచారం చేయకపోవచ్చని చింతామణి ద్యాన్ తెలిపారు. తాను కాంగ్రెస్వాదినని, బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నానని చింతామణి స్పష్టం చేశారు.
కుమారుడిని గెలిపించాలని ప్రచారం
బీజేపీ నేత నాలుగు సార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన బిజోయ్ మోహపాత్ర కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. పాట్కురా అసెంబ్లీ స్థానం నుంచి ఆయన కుమారుడు అరవింద మహపాత్ర బిజు జనతా దళ్ (బీజేడీ) పార్టీ నుంచి బరిలో దిగారు. బీజేడీని వ్యతిరేకిస్తూ వస్తున్న బిజోయ్, ఇప్పుడు ఆ పార్టీ నుంచే తన కుమారుడు పోటీ చేస్తుండడం వల్ల దిక్కు తోచని స్థితిలో పడ్డారు. అయినా అరవిందను గెలిపించాలంటూ ఇటీవల బిజోయ్ ప్రచారం చేశారు. తన కుమారుడు అరవిందను గెలిపించాలంటూ బిజోయ్ చేస్తున్న ప్రచారంపై బీజేపీ కన్నెర్ర చేసింది. ఆయనపై పార్టీ అధిష్టానం త్వరలో తగిన చర్యలు తీసుకుంటుందని బీజేపీ కేంద్రపారా జిల్లా అధ్యక్షుడు కిషోర్ పాండా తెలిపారు.