ETV Bharat / bharat

5రోజులుగా సరిహద్దుల్లోనే రైతుల బస- పోలీసులపైకి రాళ్లు విసురుతూ దుండగుల విధ్వంసం- ఇంటర్నెట్​పై బ్యాన్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 8:15 AM IST

Farmers Protest Delhi 2024 : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలనే డిమాండ్​తో దిల్లీ బయలుదేరిన రైతులు- పంజాబ్‌, హరియాణా సరిహద్దు నుంచి కదలడం లేదు. కనీస మద్దతు ధరపై ఆర్డినెన్స్ తేవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రైతులు ముసుగులో కొందరు దుండగులు విధ్వంసం సృష్టిస్తున్నారు

Farmers Protest Delhi 2024
Farmers Protest Delhi 2024

Farmers Protest Delhi 2024 : పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్​పీ)కు చట్టబద్ధత సహా డిమాండ్ల సాధన కోసం దిల్లీ బయలుదేరిన రైతులు పంజాబ్‌, హరియాణా సరిహద్దుల నుంచి కదలడం లేదు. ఎలాగైనా దిల్లీ చేరాలనే పట్టుదలతో ఐదు రోజులుగా సరిహద్దుల్లోనే భీష్మించారు. సంయుక్త కిసాన్‌ మోర్చా (రాజకీయేతర), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమైన దిల్లీ చలోను పంజాబ్‌, హరియాణా సరిహద్దుల్లోని శంభు, ఖనౌరీల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అప్పటి నుంచి అడపాదడపా ఘర్షణలు జరుగుతున్నాయి.

Farmers Protest Delhi 2024
ధర్నా చేస్తున్న రైతులు

రైతుల ముసుగులో విధ్వంసం
ఈ క్రమంలోనే కొంతమంది దుండుగులు రైతుల ముసుగులో శంభు సరిహద్దుల్లో విధ్వంసం సృష్టిస్తున్నారని పోలీసులు తెలిపారు. వాటికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. అందులో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఉద్యమం ముసుగులో ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. తాజాగా హరియణా ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ఉన్న నిషేధాన్ని పొడగించింది. హరియాణాలోని 7 జిల్లాల్లో ఫిబ్రవరి 19వ తేదీ అర్థరాత్రి 12 గంటలకు ఇంటర్నెట్ సేవలపై నిషేధం ఉందని తెలిపింది.

Farmers Protest Delhi 2024
సరిహద్దుల్లో రైతుల నిరసనలు

మరోవైపు ఆందోళనల్లో భాగంగా భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ- ఉగ్రహణ్‌) పంజాబ్‌లోని బీజేపీ నేతల ఇళ్ల ఎదుట ధర్నాలను నిర్వహించింది. పార్టీ నేతలైన మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, సునీల్‌ ఝాఖడ్‌, కేవల్‌ సింగ్‌ థిల్లాన్‌ల ఇళ్లను ముట్టడించారు. టోల్‌ప్లాజాల వద్దా ఆందోళనలు జరిగాయి. బీకేయూ (చారుని) నేత గుర్నాంసింగ్‌ చారుని శనివారం ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు అర్జున్‌ ముండా, పీయూష్‌ గోయల్‌, నిత్యానంద్‌ రాయ్‌ ఆదివారం మరోసారి రైతు సంఘాల నేతలతో చర్చలు జరపనున్నారు. ఇలా ప్రభుత్వం, రైతుల మధ్య చర్చలు జరగనుండటం ఇది నాలుగోసారి. ఇప్పటికే ఈ నెల 8న, 12న, 15న మూడు సార్లు చర్చలు జరిగాయి. అవి అసంపూర్ణంగా ముగిశాయి.

Farmers Protest Delhi 2024
సరిహద్దు వద్ద పోలీసులు

ఆర్డినెన్సు తేవాలి!
పంటలకు కనీస మద్దతు ధరపై ఆర్డినెన్సు తీసుకురావాలని రైతు నేతలు శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌, జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రానికి రాజకీయ నిర్ణయాలు తీసుకునే అధికారముందని తెలిపారు. కేంద్రం తలచుకుంటే రాత్రికి రాత్రే ఆర్డినెన్సు తేవొచ్చని అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ల గురించి ఆలోచించడం ఆపేసి రైతులవైపు చూడాలని డిమాండ్ చేశారు. 23 పంటలకు కనీస మద్దతు కల్పించాలంటే రూ.2.5లక్షల కోట్లు కావాలని ఒక నివేదిక చెబుతోందని, మరో నివేదిక రూ.36వేల కోట్లు చాలని అంటోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటే పరిష్కారం సులభమని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగం 50శాతం మందికి ఉపాధి కల్పిస్తోందని, 20శాతం జీడీపీని అందిస్తోందని పేర్కొన్నారు.

4 రాష్ట్రాల్లో రైతుల ధర్నా
రైతుల సమస్యలపై ఈ నెల 21వ తేదీన నాలుగు రాష్ట్రాల్లో ధర్నాలు చేయనున్నట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేశ్‌ టికాయిత్‌ పేర్కొన్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌, హరియాణా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో ధర్నాలు జరుగుతాయని వెల్లడించారు. ఈ నెల చివరి వారంలో దిల్లీకి ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టాలని సిసౌలీ పంచాయత్‌లో నిర్ణయించినట్లు తెలిపారు.

సందేశ్​ఖాలీ మంటలు- విపక్షాలను అడ్డుకున్న పోలీసులు- బంగాల్​లో రాష్ట్రపతి పాలన!

'ఏదైనా ఉంటే మీకే ముందు చెప్తా'- బీజేపీలో చేరికపై కమల్​నాథ్ క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.