Devotee Married Lord Krishna In Gwalior : మధ్యప్రదేశ్లో ఒక విచిత్ర వివాహం జరిగింది. చిన్నప్పటి నుంచి ఆరాధించిన దైవాన్నే పెళ్లిచేసుకుంది ఓ యువతి. బాల్యం నుంచి కృష్ణుడిపై ప్రేమను పెంచుకున్న శివాని పరిహార్ అనే యువతి ఆయన్నే వివాహం చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే బుధవారం బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది.
శివాని పరిహార్, గ్వాలియర్లోని న్యూ బ్రజ్ విహార్ కాలనీలో నివసిస్తోంది. ఈమెకు చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడంటే అమితమైన భక్తి, ప్రేమ. పెరుగుతున్న కొద్దీ ఆయననే ఆరాధిస్తూ ప్రేమను పెంచుకుంది. చివరకు కృష్ణుణ్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం తల్లిదండ్రులను ఒప్పించి బుధవారం శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని (లడ్డూ గోపాల్జీ) పెళ్లి చేసుకుంది శివాని పరిహార్. వీరి వివాహం తర్వాత బంధువులంతా ఆచార వ్యవహారాల ప్రకారం వధువుకు అప్పగింతల కార్యక్రమం కూడా జరిపారు.
వధువు శ్రీకృష్ణుడు కూడా బృందావన్ నుంచి బ్యాండు మేళాలతో ఊరేగింపుగా వచ్చారు. శ్రీకృష్ణుడే వరుడు కావడం వల్ల స్థానికులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం వధూవరులకు సమీపంలోని మందిరంలో వేద మంత్రాల సాక్షిగా వివాహం జరిగింది. ఈ వివాహానికి శివాని కుటుంబ సభ్యులతో పాటు వారి బంధువులు కూడా హాజరయ్యారు. పెళ్లి తర్వాత శివానికి వివాహ ప్రమాణ పత్రం కూడా వచ్చింది. అనంతరం శివాని తన భర్త శ్రీ కృష్ణుడితో పాటు బృందావనానికి వెళ్లిపోయింది. ఆమె ఇప్పుడు తన తదుపరి జీవితాన్ని బృందావనంలోని రాధా ధ్యాన్ ఆశ్రమంలో శ్రీ కృష్ణుని సేవలో గడపనుంది.
'నా ఆనందాన్ని చెప్పడానికి మాటలు రావడం లేదు. కానీ దీంతో నా చిన్ననాటి కల నెరవేరింది. నా వివాహం చాలా చక్కగా జరిగింది' అని శివాని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయంపై స్పందించిన శివాని తల్లి మీరా పరిహార్, మొదట్లో తన కుమార్తె ఈ విషయం చెప్పగానే కాస్త శంసయించామని తెలిపింది. 'శివాని ఈ విషయంలో చాలా పట్టుదలతో ఉండటం వల్ల ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు ఇంతకంటే ఏం కావాలి? ఇప్పుడు శివాని గురించి నేను ఆందోళన చెందక్కర్లేదు. ఆమె గురించి చింతించేవాడు పైన కూర్చున్నాడు (శ్రీకృష్ణుడు)' అని మీరా పరిహార్ వివరించింది.