ETV Bharat / bharat

కేజ్రీవాల్‌ జైలు నుంచే పాలన సాగిస్తారా? అందుకు రాజ్యాంగం అనుమతిస్తుందా? - Can Kejriwal Rule From Jail

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 23, 2024, 2:59 PM IST

Updated : Mar 23, 2024, 9:24 PM IST

Arvind Kejriwal Vs CM Post
Arvind Kejriwal Vs CM Post

Can Kejriwal Rule From Jail : లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ జైలు నుంచే పాలన సాగిస్తారా? ఇంకా ఈ కేసులో ఆయన దోషిగా తేలనందున అందుకు ఎలాంటి ఆటంకమూ ఉండదా? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కేజ్రీవాల్ ఇంకా మొండిపట్టుదలకు పోతే దిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్ర సర్కారు మొగ్గుచూపే ముప్పు ఉంది.

Can Kejriwal Rule From Jail : లిక్కర్ స్కాం కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేశాక కొన్ని కొత్త ప్రశ్నలు ఉదయించాయి. ఆయన ఈనెల 28 వరకు ఈడీ కస్టడీలో విచారణను ఎదుర్కోనున్నారు. ఆ తర్వాత కస్టడీ గడువును పొడిగిస్తారా ? లేదా ? అనేది తర్వాతి విషయం అయితే ఇప్పటికిప్పుడు సమాధానం దొరకాల్సిన అంశం 'దిల్లీ సీఎం సీటు'తో ముడిపడినది. ఈ కేసులో ఇంకా దోషిగా తేలనందున జైలులో నుంచే సీఎంగా కేజ్రీవాల్ దిల్లీని పాలిస్తారని ఆ రాష్ట్ర మంత్రి ఆతిషి చెబుతున్నారు. ఆమె చెబుతున్న విధంగా సీఎం స్థాయి వ్యక్తి జైలు నుంచి పరిపాలన చేయడం సాధ్యమయ్యే విషయమేనా? అందుకు రాజ్యాంగం అనుమతిస్తుందా? మంత్రివర్గంతో కనీస సమావేశాలు నిర్వహించకుండా జైలు నుంచి పాలన ఎలా ముందుకు సాగుతుంది? అనే అంశాలపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది.

సమావేశాలు, సమీక్షలు జైలు నుంచి అసాధ్యం
ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్టయిన దేశంలోని తొలి నాయకుడిగా ఆప్ చీఫ్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. అయితే ఆ పదవిని జైలులో ఉన్నా వదిలేది లేదు అన్నట్టుగా కేజ్రీవాల్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలు ఆయనకు సీఎం పదవిపై ఉన్న వ్యామోహాన్ని బహిర్గతం చేస్తున్నాయని పలువురు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అగ్రనేత హేమంత్ సోరెన్‌ను కూడా ఇటీవలే మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసింది. అయితే ఆయన అరెస్టు కాగానే పదవిని వదిలేశారు. ఝార్ఖండ్‌లో పాలనా సౌలభ్యం కోసం తన నమ్మకస్తుడికి సీఎం సీటును అప్పగించారు. దిల్లీలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.

జైలులోనే సీఎం దర్బార్ అనే కాన్సెప్ట్ సాధ్యమయ్యే విషయం కాదని రాజ్యాంగ నిపుణుడు, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి తెలిపారు. ''జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం కష్టం. ప్రభుత్వానికి సంబంధించిన చాలా సమావేశాలకు సీఎం నేరుగా అధ్యక్షత వహించాల్సి ఉంటుంది. వివిధ అంశాల ఫైళ్లను తనిఖీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ రోజువారీ పనితీరును సమీక్షించాల్సిన బాధ్యత కూడా సీఎందే. అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే తన పర్యవేక్షణ అధికారాన్ని ఎలా వినియోగించుకుంటారు'' అని ఆయన పేర్కొన్నారు.

రాజ్యాంగంలో అలాంటి రూల్స్ లేవు
ఒకవేళ జైలు నుంచే కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతానని మొండిపట్టుదలకు పోతే ఈ వ్యవహారంలో దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకునే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ''సాధారణంగానైతే సీఎంలు అరెస్టయితే వెంటనే మరొకరిని సీఎంగా చేస్తారు. ఒకవేళ దిల్లీలో అలా జరగకపోతే రాజ్యాంగ విచ్ఛిన్నత జరుగుతుంది. రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు చేసే అవకాశాలు ఉంటాయి.'' అని నిపుణులు చెబుతున్నారు. అయితే సీఎం స్థాయి వ్యక్తులు ఏవైనా కేసుల్లో అరెస్టయ్యాక రాజీనామా చేయాలా ? వద్దా ? ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమిటి ? అనే దానిపై మన రాజ్యాంగంలో నిబంధనలేవీ లేవు. సీఎంగా ఉన్నవారు అరెస్టయ్యాక రాజీనామా చేయాలనే రూల్ కూడా లేదు. నేరానికి పాల్పడినవారు, ఏదైనా కేసులో దోషిగా తేలినవారు సీఎంలుగా కొనసాగేందుకు అర్హులు కారని రాజ్యాంగం చెబుతోంది. ''ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏదైనా కేసులో దోషిగా తేలే వరకు పదవిలో కొనసాగొచ్చు. కానీ అనుభవపూర్వకంగా జైలు నుంచి పాలించడం అంత సులభం కాదు. ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన పత్రాలపై సీఎం అంగీకారం పొందాలంటే ముందుగా కోర్టు నుంచి అనుమతి తీసుకుని జైలుకు వెళ్లి కలవాల్సి ఉంటుంది'' అని రాజ్యాంగ నిపుణుడు ఎస్‌కే శర్మ తెలిపారు.

పాలనాపరమైన నైతికతను కేజ్రీవాల్ పాటించాల్సిందే
ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి ప్రభుత్వంలో, ప్రజల్లో ఉండాలే తప్ప జైలులో కాదని సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది పేర్కొన్నారు. ''సీఎంను అరెస్టు చేశాక పాలన ఎలా అనే దానిపై రాజ్యాంగంలో ప్రస్తావన లేదు. కానీ పాలనాపరమైన నైతికత ఆధారంగా తన స్థానంలో మరొకరిని సీఎం పదవికి నామినేట్ చేయాల్సిన బాధ్యత కేజ్రీవాల్‌పై ఉంటుంది'' అని ఆయన సూచించారు. కేజ్రీవాల్ జైలు నుంచే సీఎంగా కొనసాగుతూ పాలనాపరమైన విధానాల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ భావిస్తే రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సిఫారసు చేసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. దిల్లీలో నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ప్రధాన కార్యదర్శి కలిసి తీసుకుంటారు. అయితే జైలులో నుంచి వీరితో కేజ్రీవాల్ ఎలా అనుసంధానం అవుతారని సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది ప్రశ్నించారు. జైలు నుంచి కేజ్రీవాల్ సీఎంగా వ్యవహరించడం సాధ్యమయ్యే విషయం కాదని పాట్నాలోని చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా స్పష్టం చేశారు.

జైలు మాన్యువల్‌కు అది విరుద్ధం
కేజ్రీవాల్ ఒకవేళ రాజీనామా ప్రకటిస్తే ఆప్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సీఎంగా మారి ప్రభుత్వాన్ని నడపొచ్చని సీనియర్ బ్యూరోక్రాట్, దిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ ఓమేష్ సైగల్ తెలిపారు. జైలు మాన్యువల్ కూడా ఒక వ్యక్తి జైలు లోపలి నుంచి ప్రభుత్వాన్ని నడపడానికి అనుమతించదన్నారు. కేజ్రీవాల్‌ను ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కేసులో అరెస్టు చేశారని, ఇందులో బెయిల్ పొందడం చాలా కష్టమని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు సత్య ప్రకాష్ సింగ్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సీఎం రేసులో ఎవరెవరు ?
ప్రస్తుత పరిస్థితుల్లో దిల్లీ సీఎం రేసులో ఆప్ నేత ఆతిశీ, సౌరభ్, గోపాల్ రాయ్, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్‌ ఉన్నారని తెలుస్తోంది. ఫస్ట్ ప్రయారిటీ సునీతా కేజ్రీవాల్‌‌కు ఇస్తారని సమాచారం. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత తొలిసారిగా శుక్రవారం సాయంత్రం ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ ట్వీట్​ చేశారు. ''మోదీజీ మూడుసార్లు వరుసగా దిల్లీకి సీఎం అయిన వ్యక్తిని మీ అధికార అహంకారంతో అరెస్టు చేయించారు. మీరు అందరినీ అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది దిల్లీ ప్రజలకు ప్రధాని మోదీ చేసిన ద్రోహం. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎల్లప్పుడూ ధైర్యంగా నిలబడతారు. ఆయన ఎక్కడున్నా జీవితం దేశానికే అంకితం. ప్రజలకు అన్నీ తెలుసు''అని పేర్కొన్నారు.

సీనియర్లు VS జూనియర్లు- మంత్రుల వారసులు బరిలోకి- కర్ణాటకలో రసవత్తర రాజకీయం - Lok Sabha Election 2024 Karnataka

కాంగ్రెస్​ కంచుకోటలకు బీటలు! అమేఠీ, రాయ్​బరేలీలో పోటీకి గాంధీల వెనకడుగు? - Congress Not Contest In UP

Last Updated :Mar 23, 2024, 9:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.