BJP Youngest Candidate : గుజరాత్లోని వడోదర లోక్సభ స్థానానికి అభ్యర్థి ఎంపికలో అనూహ్య పరిణామం జరిగింది. ఈసారి బీజేపీ టికెట్ ఆ పార్టీ యువ నాయకుడు హేమాంగ్ జోషికి దక్కింది. సిట్టింగ్ ఎంపీ రంజన్ భట్ను కాదని హేమాంగ్ జోషికి కాషాయ పార్టీ అవకాశం ఇచ్చింది. దీంతో గుజరాత్లో అతిపిన్న వయసులో బీజేపీ లోక్సభ టికెట్ను దక్కించుకున్న నేతగా హేమాంగ్ జోషి (33) రికార్డును సృష్టించారు. హోలీ పండుగ వేళ ఆయన ఒక సంగీత కార్యక్రమంలో ఉండగా అకస్మాత్తుగా ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి. అందరూ కంగ్రాట్స్ చెప్పడం మొదలుపెట్టారు. వడోదర లోక్సభ టికెట్ దక్కిందని తెలిసి అప్పట్లో హేమాంగ్ జోషి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. తాజాగా ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవివరాలను స్వయంగా హేమాంగ్ జోషి వెల్లడించారు.
'అందరికీ 5 లక్షల టార్గెట్, నాకు 10 లక్షలు'
"గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ ఈసారి రాష్ట్రంలోని అందరు లోక్సభ అభ్యర్థులకు 5 లక్షల మెజారిటీని టార్గెట్గా పెట్టారు. నాకు మాత్రం 10 లక్షల ఓట్ల మెజారిటీని లక్ష్యంగా పెట్టారు. నేను తప్పకుండా ఆ లక్ష్యాన్ని సాధిస్తాను. నాపై ఉన్న ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తాను. ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయబోయేది నరేంద్ర మోదూ ప్రధాని అభ్యర్థిత్వానికే తప్ప నాలాంటి అభ్యర్థులకు కాదు" అని హేమాంగ్ జోషి చెప్పుకొచ్చారు.
ప్రచారం అవసరం లేదు!
"మే 7న మూడో దశ ఎన్నికల్లో భాగంగా గుజరాత్లోని అన్ని స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. ప్రధాని మోదీ చెబుతున్న విధంగా మేం యువత, పేదలు, మహిళలు, రైతులపై దృష్టి పెడతాం. తప్పకుండా వారంతా మాతో కలిసి వస్తారు. వడోదర లోక్సభ స్థానం పరిధిలో బీజేపీ బలంగా ఉంది. మేం ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. మా పార్టీతో ఉన్న అనుబంధాన్ని ప్రజలకు గుర్తు చేస్తే సరిపోతుంది. స్థానికంగా ఉన్న అన్ని సామాజిక వర్గాలు, కుల సంఘాలు బీజేపీతో అనుసంధానమై ఉన్నాయి" అని హేమాంగ్ జోషి తెలిపారు.
-
હર હર મોદી, હર ઘર મોદી, સર્વત્ર મોદી
— Dr. Hemang Joshi (Modi Ka Parivar) (@drhemangjoshi) April 19, 2024
આગામી લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજરોજ સાવલીના પ્રવાસ દરમિયાન સાવલી વિધાનસભામાં આયોજિત "જનસભા" માં સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ અને ધારાસભ્ય શ્રી કેતનભાઇ ઇનામદાર સાથે ઉપસ્થિત રહી ઊર્જામય સંવાદ કર્યો. લોકસભા ચુંટણીમાં સમગ્ર દેશમાં પ્રચંડ… pic.twitter.com/uC7O3DjyPQ
35 శాతం మంది యువ ఓటర్లే లక్ష్యం
"వడోదర ప్రాంతం గుజరాత్కు విద్యా రాజధాని లాంటిది. ఇక్కడ చాలా వర్సిటీలు ఉన్నాయి. ప్రఖ్యాత ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయి. వాటిలోని యువతే నా లక్ష్యం. వికసిత భారత్ సాధన కోసం ప్రధాని మోదీకి ఉన్న విజన్ గురించి వారికి వివరిస్తాను. పార్లమెంటు స్థానంలోని 35 శాతం మంది యువ ఓటర్లే సిసలైన తీర్పు ఇస్తారు" అని హేమాంగ్ జోషి అన్నారు.
కలలో కూడా ఊహించలేదు!
"నేను విద్యార్థి సంఘం నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చాను. ఏబీవీపీలో యాక్టివ్గా పనిచేసేవాణ్ని. నాలాంటి సామాన్యుడికి లోక్సభ టికెట్ ఇవ్వడం గొప్ప విషయం. నాకు ఈ అవకాశం దక్కుతుందని కలలో కూడా ఊహించలేదు. ప్రధాని మోదీ 2014కు ముందు వడోదర నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహించారు. నేను ఈసారి గెలవడానికి ఆయన పేరు చాలు. ప్రస్తుతం నేను ఐఐఎం అహ్మదాబాద్లో లీడర్షిప్ అంశంపై పీహెచ్డీ చేస్తున్నాను. నా భార్య మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు" అని హేమాంగ్ జోషి తెలిపారు.
1998 నుంచి తిరుగులేని బీజేపీ
1998 నుంచి వడోదర లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్నడూ ఓడిపోలేదు. 1991 నుంచి 2019 వరకు ఈ నియోజకవర్గ ప్రజలు ముగ్గురు మహిళా ఎంపీలను ఎన్నుకున్నారు. సిట్టింగ్ ఎంపీ రంజన్ భట్ వరుసగా మూడోసారి వడోదర లోక్సభ సీటు నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే స్థానికంగా పార్టీలో నెలకొన్న వర్గ విభేదాల నేపథ్యంలో ఈసారి ఆమెకు టికెట్ ఇచ్చేందుకు బీజేపీ అగ్రనేతలు మొగ్గుచూపలేదు. దీంతో వివాదరహితుడిగా పేరున్న హేమాంగ్ జోషికి అవకాశం దక్కింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పద్రా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి జస్పాల్సింగ్ పధియార్ బరిలోకి దిగారు.
'కాంగ్రెస్ యువరాజుకు వయనాడ్లోనూ కష్టమే- కొత్త స్థానం చూసుకోవాలి' - Lok Sabha Election 2024