తెలంగాణ

telangana

సహోద్యోగితో వివాహేతర సంబంధం.. రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్న భార్య

By

Published : Sep 5, 2022, 10:16 AM IST

ఉద్యోగుల వివాహేతర సంబంధం

Exposed extramarital affair ఒకే ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వారు ఒకే గదిలో ఉండగా రెడ్​ హ్యాండెడ్​గా భార్య పట్టుకుని బంధువులకు, పోలీసులకు సమాచారం అందించింది. దీనితో వారికి బంధువు దేహాశుద్ధి చేశారు.

Exposed extramarital affair: ఒకే శాఖలో పనిచేస్తున్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది. భార్య, బంధువులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోగా భర్తకు దేహశుద్ధి చేసిన సంఘటన వరంగల్‌ మండలం పైడిపల్లిలోని ఆర్‌టీసీ కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. హసన్‌పర్తి ఎస్సై విజయ్‌కుమార్, స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండలోని కుమార్‌పల్లి ప్రాంతానికి చెందిన జీవన్‌ అనే వ్యక్తి వరంగల్‌ కార్పొరేషన్‌లో సూపరింటెండెంట్‌గా పని చేసి నాలుగేళ్ల క్రితం సస్పెన్షన్‌కు గురయ్యాడు. అదే సంస్థలో పని చేస్తున్న ఓ వివాహితతో అతడు తొమ్మిదేళ్లుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు.

అతడికి 2018లో వివాహమైంది. ప్రస్తుతం జీవన్‌ భార్యతో కలిసి హనుమకొండలో నివాసం ఉంటున్నాడు. వివాహం జరిగినప్పటి నుంచి అతడు భార్యతో తరచూ గొడవపడి అసభ్యకరమైన మాటలతో తీవ్రంగా వేధించేవాడు. పుట్టింటి నుంచి సగం ఆస్తిని తీసుకురావాలని, లేకపోతే విడాకులు తీసుకోవాలని హింసించేవాడు. భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య వివాహేతర సంబంధం గురించి తెలుసుకుంది. ఎలాగైనా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆదివారం ఉదయం పైడిపల్లిలోని ఆర్‌టీసీ కాలనీలో ఉంటున్న మహిళ ఇంటికి జీవన్‌ వెళ్లాడు.

అతడి వెనకాలే వెళ్లిన భార్య.. వారు గదిలో ఉండగా తలుపు గడియపెట్టింది. బంధువులు, పోలీసులకు సమాచారం అందించింది. బంధువులు ఇంట్లోకి వెళ్లి జీవన్‌కు దేహశుద్ధి చేశారు. భార్య అతడిని చెప్పుతో కొట్టింది. హసన్‌పర్తి పోలీసులు జీవన్‌ను పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

క్రమశిక్షణ చర్యలేవి:నగరపాలక సంస్థలో పరిపాలన పూర్తిగా అదుపు తప్పింది. అధికారి నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం ఉదయం ఇద్దరు ఉద్యోగుల వివాహేతర సంబంధం వెలుగుచూడటం, టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ శాఖలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర పురపాలక శాఖాధికారులు దీన్ని తీవ్రంగా పరిగణించారు. బల్దియా ఉద్యోగుల్లో క్రమశిక్షణ లోపించడాన్ని తప్పు పడుతున్నారు.

బల్దియా ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు.. క్రమశిక్షణ తప్పుతున్న ఉద్యోగులపై ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వాస్తవంగా పరిశీలిస్తే కొందరు ఉద్యోగుల పనితీరుపై నగర ప్రజలు, సామాజిక కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై శాఖాపరమైన చర్యల్లేవు. కనీసం విచారణ కూడా చేపట్టడం లేదు. పన్నుల విభాగంలో ఆర్‌ఐలు, బిల్‌కలెక్టర్లు, టౌన్‌ప్లానింగ్‌లో బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టరు, చైన్‌మెన్లు, కాశీబుగ్గ, కాజీపేట సర్కిల్‌ కార్యాలయాల్లో మినిస్టీరియల్‌ ఉద్యోగులు పౌరసేవలకు బహిరంగంగానే డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

బల్దియా ప్రధాన కార్యాలయంలో పర్యవేక్షకులు, సీనియర్, జూనియర్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, అటెండర్లు గిల్లి కజ్జాలతో అభాసుపాలవుతున్నారు. రెండు రోజుల క్రితం మహిళా అటెండర్లు ఓ పర్యవేక్షకుడితో గొడవ పడినట్లుగా తెలిసింది. ఉన్నతాధికారులు చూసీచూడనట్లుగా ఉండటంతో ఉద్యోగుల్లో క్రమశిక్షణ లోపిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details