Pawan Kalyan In Kodada: జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని ఆ పార్టీ అధినేత పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడలో పవన్ పర్యటించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పార్టీ కార్యకర్త కడియం శ్రీనివాస్ కుటుంబాన్ని జనసేనాని పరామర్శించారు. కడియం శ్రీనివాస్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్న పవన్కల్యాణ్కు అభిమానులు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు.
ఈ కార్యక్రమంలో పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ తాళ్లూరి, ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు మేకల సతీశ్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారం రాజలింగం, విద్యార్థి విభాగం నాయకుడు సంపత్ నాయక్, యువజన విభాగం నాయకుడు లక్ష్మణ్ గౌడ్, పార్టీ నాయకుడు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంతకముందు.. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారానికి చెందిన సైదులు కుటుంబాన్ని పవన్ కల్యాణ్ పరామర్శించారు. జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చిన జనసేనాని... సైదులు భార్యకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇటీవలే సైదులు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. చౌటుప్పల్ నుంచి లక్కారం వరకు పవన్ కల్యాణ్ ర్యాలీగా వెళ్లారు. జనసేనాని రాకతో అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ పర్యటన దృష్ట్యా... జనసేనానికి పట్టణంలో కార్యకర్తలు... పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.