తెలంగాణ

telangana

FRUIT MARKET: ప్రశాంతంగా గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ యార్డు తరలింపు

By

Published : Oct 16, 2021, 8:21 AM IST

FRUIT MARKET

మొత్తానికి కల నెరవేరింది. ఎట్టకేలకు ఎన్నో అపోహలు, ఆందోళనల నడుమ కొబ్బరికాయ కొట్టారు. హైదరాబాద్ గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ యార్డు తరలింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. విజయ దశమి పురస్కరించుకుని.. రంగారెడ్డి జిల్లా బాటసింగారం లాజిస్టిక్స్ పార్కు (Batasingaram Logistics Park)లో కొత్తగా తాత్కాలిక పండ్ల మార్కెట్‌ కొలువు తీరింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో.. పండ్ల వేలం, క్రయ, విక్రయాలు, ఇతర కార్యకలాపాలు లాంఛనంగా మొదలయ్యాయి.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలోని... లాజిస్టిక్స్ పార్కు (Batasingaram Logistics Park)లో పండ్ల మార్కెట్ కొలువు తీరింది. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను తరలించి... హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పక్కన తాత్కాలిక పండ్ల మార్కెట్‌ (Batasingaram Logistics Park) ఏర్పాటైంది. సుధీర్ఘ తర్జనభర్జనల అనంతరం.. మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసిన తాత్కాలిక పండ్ల మార్కెట్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. పైనాపిల్, ద్రాక్ష, ఆపిల్, సంత్ర పండ్ల వేలం, క్రయ, విక్రయాలకు మంత్రి శ్రీకారం చుట్టారు. కొహెడలో పూర్తి ఏర్పాట్లు చేసేలోగా.. బాటసింగారం (Batasingaram Logistics Park)లో ఇంకా ఏమైనా లోపాలు ఉంటే అవన్నీ సవరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సబితా... కమీషన్ ఏజెంట్లకు భరోసా ఇచ్చారు. ఎప్పటిలోగా కోహెడలో మార్కెట్ (Fruit Market in Koheda) యార్డు సిద్ధంచేస్తారన్న అంశంపై.. సందేహాలు ఉన్నాయని కమీషన్ ఏజెంట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌

తాత్కాలికంగా..

కొహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అతిపెద్ద మార్కెట్ (Fruit Market in Koheda) నిర్మాణం కోసం కేటాయించిన భూమిని.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. 178.9 ఎకరాల విస్తీర్ణంలో మార్కెటింగ్ శాఖ రూపొందించిన లేఅవుట్‌ను పరిశీలించారు. త్వరలో వర్తకులకు కేటాయించనున్న స్థలాల అంశంపై చర్చించారు. ఇంకా అనుమానాలు, అపోహలతో ఉన్న కమీషన్ ఏజెంట్ల సంఘాల ప్రతినిధులు, వ్యాపారులతో మాట్లాడారు. కమీషన్ ఏజెంట్లు ప్రస్తావించిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. పలువురు వర్తకులు.. కోహెడలోనే తాత్కాలిక మార్కెట్ (Fruit Market in Koheda) ఏర్పాటు చేయాలని కోరారు.

ఏప్రిల్ నాటికి

కోహెడ (Fruit Market in Koheda) లో ఏప్రిల్ నాటికి మామిడి పండ్ల క్రయ, విక్రయాలు సాఫీగా జరిగేందుకు వీలుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడ్డిఅన్నారం మార్కెట్ స్థలంలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి పునాదిరాయి వేసే సమయంలో కోహెడలో పండ్ల నిర్మాణం, నిధుల కేటాయింపు, శంకుస్థాపన తేదీ వంటి అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్పష్టత ఇవ్వనున్న దృష్ట్యా.. ఈ లోగా సంమయనం పాటించాలని మార్కెటింగ్ శాఖ స్పష్టం చేస్తోంది. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ అంశంపై.. ఈ నెల 18న హైకోర్టులో విచారణ జరగనున్నందున తరలింపు ఆపేయమని తీర్పు వస్తుందన్న ఆశాభావంతో కొందరు కమీషన్ ఏజెంట్లు ఉన్నారు. కనీసం ఇప్పటికైనా కమీషన్ ఏజెంట్లు.. బాటసింగారం లాజిస్టిక్స్ పార్కుకు వచ్చి సహకరించినట్లైతే కోహెడలో వీలైనంత త్వరలో శాశ్వత ప్రాతిపదికన ఆధునాతన యార్డు నిర్మించుకోవచ్చుని.. ఏఎంసీ ఛైర్మన్ కందాళ ముత్యంరెడ్డి తెలిపారు.

దసరా పర్వదినం వేళ.. తొలిరోజు 20 మంది కమీషన్ ఏజెంట్లు వచ్చి వేలం, క్రయ, విక్రయాలకు శ్రీకారం చుట్టారు. ఇక సోమవారం నుంచి మార్కెట్ కార్యకలాపాలు, లావాదేవీలు ప్రారంభించేందుకు ముందుకు వస్తుండటం.. శుభ పరిణామంగా చెప్పుకోవచ్చని మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:బాటసింగారం లాజిస్టిక్స్ పార్కులో పండ్ల మార్కెట్ ప్రారంభం

live: బాటసింగారం లాజిస్టిక్స్ పార్కులో పండ్ల మార్కెట్ ప్రారంభోత్సవం

ABOUT THE AUTHOR

...view details