తెలంగాణ

telangana

Natural Farming : ఒకేచోట 130 రకాల వరి వంగడాలు సాగు.. ఎక్కడో తెలుసా?

By

Published : Oct 31, 2021, 6:54 AM IST

Nature farming

ఏడో ఎనిమిదో కాదు.. ఏకంగా 130 రకాల వరి వంగడాలను ఒకేచోట సాగుచేస్తూ వినూత్న పంథాలో విజయవంతంగా సాగుతున్నారు ఓ ముగ్గురు అన్నదమ్ములు. ప్రకృతి వ్యవసాయంతో(Natural Farming) భూ, వన, జలసంపదలు కలుషితం కాకుండా చూడాలన్నది తమ ఉద్దేశం అంటూ ముందుకెళ్తున్నారు. జీవన విధానంలో మార్పు తెచ్చి ఆరోగ్యకరమైన సమాజం నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామంటున్నారు. ఇంతకీ వీరు ఎక్కడ పండిస్తున్నారో చెప్పలేదు కదూ.. ఇదిగో ఇది చదవండి మీకే తెలుస్తుంది.

ఏడో ఎనిమిదో కాదు.. ఏకంగా 130 రకాల వరి వంగడాలను ఒకేచోట సాగుచేస్తూ వినూత్న పంథాలో విజయవంతంగా సాగుతున్నారు ముగ్గురు అన్నదమ్ములు.. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగికి చెందిన వీరంతా ప్రకృతి వ్యవసాయం(Natural Farming)తో లాభాల పంట పండిస్తున్నారు. నార్సింగికి చెందిన జిన్న బేతయ్య, నింగమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు బాలు, రాజు, కృష్ణ. వీరిది వ్యవసాయ కుటుంబం. పెద్దబ్బాయి బాలు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ప్రకృతి సాగుతో ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి బాటలు వేయాలన్న ఆలోచన ఆయనది. దాన్ని తమ్ముళ్లతో పంచుకోగా వారూ సై అన్నారు. చిన్నవాడు కృష్ణ 2015లో కరీంనగర్‌లో ప్రకృతి వ్యవసాయ నిపుణులు డా.సుభాష్‌ పాలేకర్‌ చెంత గోఆధారిత ప్రకృతి సాగుపై మెలకువలు నేర్చుకున్నారు. ఆ క్రమంలో అదే ఏడాది తమకున్న 17 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. 14 ఎకరాలలో వరి, 3 ఎకరాల్లో కంది పండిస్తున్నారు.

గ్రామభారతి సహకారంతో..

స్వయం సమృధ్ధి కలిగిన గ్రామాల కోసం గ్రామభారతి స్వచ్ఛంద సేవాసంస్థ సహకారం తీసుకుంటున్నామని వారు తెలిపారు. సంప్రదాయ విత్తన సంరక్షణ, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. భూ, వన, జలసంపదలు కలుషితం కాకుండా చూడాలన్నది మా ఉద్దేశమని పేర్కొన్నారు. జీవన విధానంలో మార్పు తెచ్చి ఆరోగ్యకరమైన సమాజం నిర్మించేందుకు మా వంతుగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

దేశీయ వరి రకాలే..

ఈ అన్నదమ్ములు తమ వ్యవసాయ క్షేత్రంలో 130 దేశీయ వరి రకాలను సాగుచేస్తున్నారు. మాప్లై సాంబా, మైసూరు మల్లీగా, నవారా, కాలబట్టి, కృష్ణబ్రీహీ, కర్పుకౌని, చెకోవా, రక్తసాలీ కేరళ, కుజీపఠాలియా, సిధ్ధ సన్నాలతో పాటు తమిళనాడు, కేరళ, తెలుగురాష్ట్రాలకు చెందినవి ఇందులో అనేకం ఉన్నాయి. ఎరుపు, నలుపు, ఆకుపచ్చ, గోధుమ రంగుల్లో ఇవి ఉంటాయి.

12 ఆవులను పెంచుతూ వాటి పేడ, మూత్రాన్ని పంటలకు ఉపయోగించే జీవామృతం, ఘన జీవామృతం తయారీలో వినియోగిస్తున్నారు. తెగుళ్ల నివారణకు ఆగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం, దశపరిణి కషాయం, నీమాస్త్రం వంటివి వినియోగిస్తున్నారు. వరి వంగడాన్ని బట్టి ఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. పెట్టుబడి ఖర్చులు పోగా రూ.50వేల నుంచి రూ.80వేల వరకు ఆదాయం లభిస్తోంది. విత్తనోత్పత్తి సొంతంగానే చేసుకుంటున్నారు. ఆసక్తి కలవారికి వాట్సప్‌ ద్వారా బియ్యం నమూనాలు పంపిస్తూ ప్రస్తుతం జంటనగరాల్లోనే అధికంగా విక్రయిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details