తెలంగాణ

telangana

వర్షాలు పడకపోయినా.. పక్కనే తుమ్మిళ్ల ఎత్తిపోతలుందని పంటలేసినం.. కానీ

By

Published : Aug 8, 2021, 8:43 PM IST

tummilla lift irrigation farmers
tummilla lift irrigation farmers ()

నదిలో పుష్కలంగా నీళ్లున్నాయి. ఆ జలాలను కాల్వలకు విడుదల చేయకపోవడం వల్ల వరద వృథాగా దిగువకు వెళ్తోంది. మరోవైపు కొద్దిరోజులుగా వానలు లేకపోవడం వల్ల పంటలకు నీరందడం లేదు. భూగర్భ జలాలు సైతం ఆశించిన స్థాయిలో లేక.. పంటల్ని కాపాడేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా ఎప్పుడు నీటి విడుదల చేస్తారా.. అని రైతన్నలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

నదిలో నీళ్లున్నప్పుడే ఎత్తిపోసుకుంటే ఆయకట్టు కింద పంటలు పండించే రైతులకు ఉపయోగం ఉండేది. కానీ జోగులాంబ గద్వాల జిల్లాలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం విషయంలో అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపంగా మారుతోంది. తుంగభద్ర నదిలో కావాల్సినంత వరద నీరున్నా.. అధికారులు మాత్రం ఇప్పటికీ నీళ్లు విడుదల చేయలేదు. ఫలితంగా తుమ్మిళ్ల కింద పంటలు సాగు చేసుకుంటున్న రైతులకు సకాలంలో నీరందడం లేదు.

ఇప్పటికే ఒకటి, రెండు అందాల్సి ఉన్నా...

పత్తి, మిరప, ఉల్లి తదితర పంటలకు ఇప్పటికే ఒకటి రెండు తడులు అందాల్సి ఉంది. వేసిన పంటలను కాపాడుకుందామన్నా.. వర్షాలు సరిగా లేవు. భూగర్భ జలమట్టాలు సైతం ఆశించినంతగా లేవు. రాజోలి బండ డైవర్షన్ స్కీం కింద చివరి ఆయకట్టు వరకూ నీళ్లందడం లేదన్న ఉద్దేశంతోనే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారు. దీని ద్వారా నీళ్లు ఎత్తి పోస్తే 23వ డిస్టిబ్యూటరీ అలంపూర్ నియోజకవర్గంలో 55 వేల ఎకరాల విస్తీర్ణంలో సాగునీరు అందించవచ్చు. వానాకాలం పంటలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా.. సాగునీటి జాడ లేదు. మరోవైపు తుంగభద్రకు వచ్చిన వరద నీరు వృథాగా దిగువకు వెళ్లిపోతోంది. ఫలితంగా అందుబాటులో నీరున్నా.. అవసరానికి అందక.. పంటల్ని కాపాడుకొనేందుకు రైతన్నలు నానా అవస్థలు పడుతున్నారు.

ఉల్లి, మిరప ఎదకొచ్చింది. వర్షం పడతలేదు. కాల్వ నుంచి నీరు వదలడం లేదు. ప్రాజెక్టులు నిండి.. వందల టీఎంసీల నీరు వృథాగా పోతోంది. నది పక్కనే ఉన్న మాకు నీరందడం లేదు. పక్కనే ఎత్తిపోతల పథకం ఉంది కదా అని రైతులందరూ పంటలు వేశారు. అధికారులు స్పందించి నీరు విడుదల చేయాలి.

- గోపాల్​రెడ్డి, రైతు

గోపాల్​రెడ్డి

పది ఎకరాల్లో పత్తి వేశాను. ఇటు తుంగభద్ర, అటు కృష్ణా నిండుగా పారుతున్నా.. మాకు నీరు రావడం లేదు. రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. అయినా అధికారులు తుమ్మిళ్ల లిఫ్ట్​ ఆన్​ చేయడం లేదు. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితులు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు వర్షం రాకపోతే.. రైతులు ఆత్మహత్య చేసుకొనే పరిస్థితి ఉంది.

- పూర్ణచందర్​రావు, రైతు

పూర్ణచందర్​రావు

ఇంకో తడి అందిస్తేనే..

రాజోలి బండ డైవర్షన్ స్కీం నుంచి 15 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో అక్కడ నుంచి ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేదు. తుమ్మిళ్ల నుంచి ఇప్పటికీ నీటి ఎత్తిపోత మొదలు కాలేదు. పత్తి వేసి 35 రోజులు దాటింది. గతంలో కురిసిన వర్షానికి మొలకలొచ్చాయి. ఇప్పుడు ఒక తడి నీరందిస్తేనే పంట పెరిగే అవకాశం ఉంది. మిలిగిన పంటల పరిస్థితి సైతం ఇలానే ఉంది. తుమ్మిళ్ల ద్వారా కాల్వలకు నీళ్లు విడుదల చేస్తేనే రైతులకు ఊరట. ఈ దిశగా అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

ఆరెకరాల పత్తి, మిరప వేశాను. నలబై యాబై రోజులవుతోంది. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. తుంగభద్రలో నీరున్నా.. అధికారులు సరిగ్గా స్పందించడం లేదు. ఎక్కడ చూసినా నీళ్లున్నాయంటున్నారు.. కానీ మా పొలాలు మాత్రం ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా నీరందించాలి.

- రైతు

రైతు

యాబై రోజులైంది వర్షాలు లేవు. తుమ్మిళ్ల నుంచి నీరు విడుదల చేస్తారనుకున్నా.. అధికారులు వదలడం లేదు. ఈ పదిరోజుల్లో వర్షాలు పడకపోతే.. ఈ పంట తీసేసి.. మరో పంట వేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ, అధికారులు సరిగా స్పందించడం లేదు.

- కరుణాకర్​రెడ్డి, రైతు

12వ తేదీ తర్వాత నీరు విడిచిపెడతాం..

వర్షాలు కురిసినందున ప్రస్తుతానికి డిమాండ్ లేదని, తుంగభద్ర నదిలో కావాల్సిన ప్రవాహం ఉన్నందున తుమ్మిళ్ల నుంచి ఈనెల 12 నుంచి సాగునీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

23వ డిస్టిబ్యూటరీ నుంచి చివరి ఆయకట్టుకు కాల్వల నిర్మాణం సైతం సరిగా లేదు. షట్టర్లు, తూములు ఎక్కడికక్కడ దెబ్బతిన్నాయి. మరమ్మతులకు కోసం ప్రతిపాదనలు పంపినా.. నిధులు లేక పనులు జరగలేదు. గతంలో మాదిరిగా కాల్వలు దెబ్బతినకుండా చివరి ఆయకట్టు వరకూ నీరందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇదీచూడండి:nagarjuna sagar gates open: 5 అడుగుల మేర 4 క్రస్ట్ గేట్ల ఎత్తివేత

ABOUT THE AUTHOR

...view details