తెలంగాణ

telangana

Dharani Portal Modules: ధరణి పోర్టల్ మాడ్యూళ్ల కోసం రైతుల ఎదురుచూపులు

By

Published : Jan 15, 2022, 5:21 AM IST

Dharani
Dharani ()

Dharani Portal Modules: ధరణి పోర్టల్లో మాడ్యూళ్ల ఏర్పాటుకు అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. రైతుబంధు, బీమా పథకాలు వర్తించాలంటే ధరణి పోర్టల్లో భూ సమాచారం ఉండాలి.

Dharani Portal Modules: భూ యాజమాన్య హక్కులు అందని రైతులు ధరణి పోర్టల్లో మాడ్యూళ్ల ఏర్పాటుకు ఎదురుచూస్తున్నారు. రైతుబంధు, బీమా పథకాలు వర్తించాలంటే ధరణి పోర్టల్లో భూ సమాచారం ఉండాలి. ఇప్పటికీ సమస్యలు అపరిష్కృతంగా ఉన్న రైతులకు సంబంధించి కొత్త మాడ్యూళ్ల్లు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. దాదాపు మూడున్నర లక్షల మంది వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. 11 లక్షల ఎకరాల సమాచారం పోర్టల్లో నిక్షిప్తం కావాల్సి ఉందని అంచనా. ధరణి సమస్యలపై మంత్రి వర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం కొత్త మాడ్యూళ్లు అందుబాటులోకి రావాల్సి ఉంది.

విస్తీర్ణాలలో కోతల సమస్య...

పరిష్కరించాల్సిన సమస్యల్లో ప్రధానంగా భూ విస్తీర్ణాలలో కోతలు పడినవి ఉన్నాయి. ఉన్న భూమి కంటే తక్కువ భూమిని ధరణిలో ఎక్కించారు. రైతుకు ఉన్న భూమిలో కొంత విస్తీర్ణం కోతకు గురికాగా.. పాసుపుస్తకంలోనూ తక్కువ విస్తీర్ణమే నమోదు చేశారు. దీంతో రైతుబంధు కూడా తక్కువ మొత్తం వస్తోంది. కొన్ని జిల్లాల్లో ఆర్‌ఎస్‌ఆర్‌ సమస్యలున్నవి ఉండగా, కొన్ని చోట్ల సర్వే నంబర్లలో ప్రభుత్వ భూములు ఉండటంతో నిషేధిత జాబితాలోకి కొంత భూమి వెళ్లి రైతులకు తక్కువగా నమోదైన సంఘటనలు ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలంటే కొన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయి భూ సర్వే చేయక తప్పని పరిస్థితి ఉంది. ఇలాంటి వారు ఇప్పటికే ధరణి పోర్టల్లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌ ల్యాండ్‌ మ్యాటర్స్‌ ఐచ్ఛికంలో దరఖాస్తుచేసినా సరైన పరిష్కారం లభించడం లేదని చెబుతున్నారు.

ఎసైన్డ్‌దారుల అవస్థలు...

సాగుచేసుకుంటూనే ఉన్నా ఆ భూములకు హక్కులు దక్కని వారిలో ఎసైన్డ్‌ లబ్ధిదారులు ఎక్కువ మంది ఉన్నారు. ఇనాం భూములకు కొన్ని జిల్లాల్లో ఓఆర్‌సీ (ఆధీన ధ్రువీకరణ పత్రం) జారీ చేశారు. పాసుపుస్తకాలు మాత్రం ఇవ్వడం లేదు. శివాయిజమేదారీ, లావుణి పట్టాదారులకు కూడా హక్కులు కల్పించి రైతుబంధు అందజేస్తే లబ్ధిచేకూరుతుంది. మంత్రి వర్గ ఉప సంఘం సూచనలతో ఐచ్ఛికాలు, మాడ్యూళ్ల ఏర్పాటుపై రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తున్నా జాప్యం చోటుచేసుకుంటోంది. ఇటీవల నిషేధిత జాబితాలో సుమోటో కేసుల పరిష్కారం అనంతరం దాదాపు 2.80 లక్షల ఎకరాలకు సంబంధించి కొన్ని భూముల సమస్యలు మాత్రం పరిష్కరించారు. అన్ని సమస్యలకు పరిష్కారం లభించాలంటే పోర్టల్లో తగిన సాంకేతిక ఏర్పాట్లు పూర్తి కావాల్సి ఉందని కొందరు అధికారులు పేర్కొంటున్నారు.

ఇదీ చూడండి:'ప్రభుత్వ విజయ కిరీటంలో వ్యవసాయ శాఖ పాత్ర వజ్రంలాంటిది'

ABOUT THE AUTHOR

...view details