తెలంగాణ

telangana

RGUKT: విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ.. 16 విశ్వవిద్యాలయాలతో ఒప్పందం

By

Published : Jan 12, 2023, 3:05 PM IST

rgukt

RGUKT IN BASARA: చదువులక్షేత్రమైన బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులకు మెరుగైన సేవలు అందించే దిశగా ముందుడుగు పడింది. అన్నిరంగాల్లో విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇప్పటికే టీహబ్‌తోపాటు వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తున్న ఆర్జీయూకేటీ నేడు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, వరంగల్‌నిట్‌తో ఒప్పందం చేసుకోనుంది.

ఆర్జీయూకేటీ విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు అందిస్తున్న వీసీ

Awareness Of Technical Education For RGUKT Students: మారుతున్న సమాజ పరిణామాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలనే సంకల్పంతో బాసరలోని ట్రిపుల్‌ఐటీ ముందుకెళ్తుంది. ఇటీవలే ఆర్జీయూకేటీని సందర్శించిన మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఆర్జీయూకేటీలోనే టీహబ్‌ ఏర్పాటుకు భరోసా కల్పించిన కేటీఆర్‌.. వివిధ విశ్వవిద్యాలయాలు, ప్రముఖ కంపెనీలతో ఒప్పందం జరిగేలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

అందులో భాగంగా ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ చేపట్టారు. ఇటీవలే వివిధ విశ్వవిద్యాలయాలతో పాటు హైదరాబాద్‌లోని పర్యావరణ పరిరక్షణ శిక్షణా పరిశోధన సంస్థ, టీహబ్‌ సహా 16 విశ్వవిద్యాలయాలు, ప్రముఖ సంస్థలతో ఆర్జీయూకేటీ ఒప్పందం చేసుకుంది. హెచ్‌సీయూ, వరంగల్ ఎన్‌ఐటీతో ఎంవోయూ పూర్తైతే బాహ్య ప్రపంచంలో జరిగే నూతన ఆవిష్కరణల్లో ఆర్జీయూకేటీ విద్యార్థులతో పాటు అధ్యాపకులకు సముచితమైన స్థానం లభించే అవకాశం ఉంది.

ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదివి.. మండల, జిల్లాస్థాయిల్లో ప్రతిభ కనపర్చిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో 2008లో ఆర్జీయూకేటీని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అడపా, దడపా విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు రూపకల్పన చేసినా.. మిగిలిన విశ్వవిద్యాలయాలు, సంస్థలతో ఎలాంటి ఒప్పందాలు లేకపోవడంతో అక్కడి విద్యార్థుల ఖ్యాతి బయటకు రాలేదు. ఇన్‌ఛార్జి వైస్‌ ఛాన్సలర్లు స్థానికంగా ఉండకుండా హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకి పరిమితం కావడం విద్యార్థులకు శాపంగా మారింది. ప్రస్తుతం తమకు మంచిరోజులు వచ్చాయంటూ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్జీయూకేటీలో మౌలిక వసతుల కల్పన ఒక ఎత్తైతే.. సాంకేతికపరంగా విద్యార్థుల్లో జిజ్ఞాస పెంచడం, ఉపాధి చూపడం మరోఎత్తు అనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. అమెరికా వంటి దేశాల్లో స్థిరపడిన భారతీయ యువకులతో ఆన్‌లైన్‌లో అవసరమైన తర్ఫీదు ఇవ్వడం ద్వారా విద్యార్థులకు భరోసా కల్పించే ప్రయత్నాలు చేపట్టినట్లు సిబ్బంది చెబుతున్నారు. నెలాఖరులోగా ఎమ్‌ఓయూ ప్రక్రియ పూర్తైతే విశ్వవిద్యాలయాల్లో నూతన ఆవిష్కరణల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేయాలనే ప్రయత్నం ఆర్జీయూకేటీ అధికారుల ప్రణాళికగా కనిపిస్తోంది.

"రానున్న రోజుల్లో మా విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌లకు పంపించి.. బయట జరుగుతున్న విషయాలపై అవగాహన అన్నది కల్పిస్తాం. అలాగే తరగతి గదుల్లో కొత్త పాఠ్యాంశాలకు కొన్ని కంపెనీలతో అవగాహన ఒప్పందం చేసుకున్నాము. బహుళజాతి సంస్థ అమ్మాయిలకు ట్రైనింగ్‌ అనేది హైదరాబాద్‌లో ఇస్తామని పేర్కొంది. విద్యార్థులకు మంచిగా ఉపయోగపడుతుంది." - ప్రొఫెసర్‌ వెంకటరమణ, ఇన్‌ఛార్జీ వీసీ

"ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డేటా స్టక్చర్‌ అనేవి ట్రేండ్‌లో ఉన్నాయి. విద్యార్థులకు వీటిపై అవగాహన కల్పించి, భవిష్యత్తును మెరుగుపరిచేందుకు ఉపయోగపడతాయి. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారిని తీసుకువచ్చి ఈ కోర్సులను డిజైన్‌ చేయడం జరిగింది." - ప్రొఫెసర్‌ సతీష్‌కుమార్‌, డైరెక్టర్‌

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details