తెలంగాణ

telangana

ఫేస్​బుక్​ డేటా అక్ర‌మంగా బ‌దిలీ.. మెటా కంపెనీకి రూ. 10వేల కోట్లు ఫైన్‌!

By

Published : May 22, 2023, 5:49 PM IST

Updated : May 22, 2023, 6:51 PM IST

meta fined by eu

Meta Fined By EU : ఫేస్‌బుక్ డేటాను అమెరికాకు ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన కేసులో మెటా కంపెనీకి 130 కోట్ల డాల‌ర్ల జ‌రిమానా పడింది. యురోపియ‌న్ డేటా ప్రొటెక్ష‌న్ బోర్డు ఆ ఫైన్ వేసింది. అసలేం జరిగిందంటే?

Meta Fined By EU : ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా కంపెనీకి రికార్డు స్థాయిలో జ‌రిమానా ప‌డింది. యురోపియ‌న్ యూనియ‌న్ యూజ‌ర్లకు చెందిన ఫేస్‌బుక్ డేటాను.. అమెరికాలోని స‌ర్వ‌ర్ల‌కు అక్ర‌మంగా బ‌దిలీ జరిగిందని ఆరోపిస్తూ ఐరోపా సమాఖ్య మెటా కంపెనీకి ఫైన్ విధించింది. ఈ కేసులో 130 కోట్ల డాల‌ర్లు చెల్లించాల‌ని ఆదేశించింది. ఐరిష్‌ డేటా ప్రొటెక్షన్‌ కమిషన్‌ సోమ‌వారం ఆ జ‌రిమానాకు చెందిన ప్ర‌క‌టన విడుద‌ల చేసింది. ఈయూ యూజర్ల డేటాను నిబంధనలకు విరుద్ధంగా అమెరికాకు బదిలీ చేసినట్లు ఆరోపించింది. దీన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.

మెటా కంపెనికీ ఐరోపా సమాఖ్య తరఫున పనిచేసే 'ఐరిష్‌ డేటా ప్రొటెక్షన్‌ కమిషన్‌' ఈ జరిమానాను విధించింది. ఈ వ్యవహారంపై డీపీసీ 2020 నుంచి దర్యాప్తు చేస్తోంది. డేటా విషయంలో యూజర్ల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛకు ఉన్న ముప్పును పరిష్కరించడంలో మెటా విఫలమైందని డీపీసీ ఆరోపించింది. ఈ విషయంలో 'కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ యురోపియన్‌ యూనియన్‌' పూర్వ ఆదేశాలను బేఖాతరు చేసిందని తెలిపింది.

ఈయూ నిర్ణయం.. మెటా తీవ్ర అసంతృప్తి
Facebook Meta :అయితే ఈయూ నిర్ణయంపై ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో తమను ఈయూ ఒంటరిని చేసిందని ఆరోపించింది. ఈయూ తీర్పు సహేతుకంగా లేదని తెలిపింది. ఇది ఇతర కంపెనీలకు తప్పుడు సందేశమిస్తోందని పేర్కొంది. దీనిపై న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తామని తెలిపింది. ఈ వ్యవహారంపై మెటా గతంలో ఓసారి కూడా4 తీవ్రంగా స్పందించింది. ఎలాంటి కఠిన నిర్ణయాలు వెలువడినా.. ఈయూలో సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది. కానీ తాజా ఈయూ నిర్ణయం తర్వాత సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండ‌ద‌ని ఆ కంపెనీ వెల్ల‌డించింది.

డేటా ప్రైవసీ విషయంలో ఐదేళ్ల క్రితం 'ఐరిష్‌ డేటా ప్రొటెక్షన్‌ కమిషన్‌' కఠినమైన నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. వాటిని ఉల్లంఘించినందుకుగాను 2021లో అమెజాన్‌పై 746 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది. డేటా గోప్యత నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత ఐరిష్‌ డేటా ప్రొటెక్షన్‌ కమిషన్‌ భారీ పెనాల్టీ ఇదే కావడం గమనార్హం.

ట్విట్టర్​కు పోటీగా..
మెటా ఇటీవలే ట్విట్టర్​ పోటీగా కొత్త యాప్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ బ్రాండ్‌పై కొత్త యాప్‌ను తీసుకొచ్చేందుకు మెటా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో కలిసి మెటా టెస్టింగ్‌ నిర్వహిస్తోందని తెలిసింది. సంబంధిత స్క్రీన్‌షాట్లు సైతం బయటకొచ్చాయి. ఈ యాప్‌నకు ఇంతవరకు పేరు పెట్టనప్పటికీ.. పీ92, బార్సిలోనా పేర్లతో ఇంటర్నల్‌గా పిలుచుకుంటున్నారు. ఇది సపరేట్‌ యాప్‌గానే ఉండబోతోందని, అయితే ఇన్‌స్టా యూజర్లు తమ అకౌంట్‌తో కనెక్ట్‌ అయ్యేందుకు వీలు కల్పించనున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Last Updated :May 22, 2023, 6:51 PM IST

ABOUT THE AUTHOR

...view details