తెలంగాణ

telangana

మహిళ పొరపాటు.. డొమెస్టిక్​ బదులు ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ​.. చివరకు..

By

Published : May 7, 2023, 10:11 PM IST

Updated : May 7, 2023, 10:19 PM IST

domestic-passenger-lands-in-international-detination-after-boarding-wrong-flight
Etv Bharatపొరపాటున అంతర్జాతీయ విమానమెక్కిన మహిళ

ఓ మహిళ పొరపాటున డొమెస్టిక్​ ఫ్లైట్​ కాకుండా.. అంతర్జాతీయ విమానం ఎక్కింది. విమానం ఎక్కిన కాసేపటికి తప్పును గుర్తించింది. చివరకు ఏమైంది? తన గమ్యం చేరుకుందా మరి?

అమెరికాకు చెందిన ఫ్రాంటియర్​ ఎయిర్​లైన్స్​ సంస్థ.. పాస్​పోర్ట్​ లేకుండానే ఓ మహిళను అంతర్జాతీయ ప్రయాణం చేయించింది! దేశీయ ప్రయాణం చేయాల్సిన ఆ ప్రయాణికురాలిని.. జమైకా తీసుకెళ్లింది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో సదరు మహిళ కాస్త ఇబ్బంది పడినప్పటికీ.. తరువాత ఆమె సమస్యను ఎయిర్​లైన్​ సంస్థ పరిష్కరించింది.

ఆ ప్రయాణికులరాలి పేరు బెవర్లీ ఎల్లిస్-హెబర్డ్. అమెరికా.. న్యూజెర్సీలోని న్యూగ్లౌసెస్టర్ కౌంటీ నివాసి. ఈమెకు జాక్సన్‌విల్లేలో మరో ఇల్లు ఉన్నందున.. తరచూ ఆమె ఫిలడెల్ఫియా నుంచి అక్కడికి వెళుతూ ఉండేది. అయితే 2022 నవంబర్​ 6న కూడా ఆమె జాక్సన్‌విల్ వెళ్దామని ఎయిర్​పోర్టుకు వచ్చింది. విమానం ఎక్కేముందు వాష్​రూంకు వెళ్లింది. తిరిగి వచ్చేలోపే ఆమె ఎక్కవలసిన విమాన గేట్​ మారింది. దీంతో ఆమె జమైకా ఫ్లైట్​ను ఎక్కింది. అనంతరం కాసేపటి తరువాత ఆమె తన గమ్యస్థానానికి వెళ్లాల్సిన విమానం కాకుండా.. మరో ఫ్లైట్​ ఎక్కినట్లు బెవర్లీ ఎల్లిస్-హెబర్డ్ గుర్తించింది. వెంటనే సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. సదరు మహిళ అనుకోకుండా గేటు మారడం వల్లే ఈ ఘటన జరిగింది.

బెవర్లీ ఎల్లిస్-హెబర్డ్ డొమెస్టిక్ ఫ్లైట్‌లో ప్రయాణించాల్సి ఉన్నందున.. పాస్‌పోర్ట్‌ కుడా తీసుకువెళ్లలేదు. దీంతో ఆమె కాసేపు భయాందోళనకు గురైంది. విమానం ల్యాండింగ్ తర్వాత.. ఫిలడెల్ఫియా విమానంలో ఆమె ఎక్కేవరకు సిబ్బంది వేచి ఉన్నారు. అంతసేపు ఆమె జెట్‌వేలో ఉండటానికి వారు అనుమతించారు. ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఈ ఘటన పట్ల.. బెవర్లీ ఎల్లిస్-హెబర్డ్​ క్షమాపణలు చెప్పారు. ఎయిర్‌లైన్ సంస్థ ఆమె ఒరిజినల్ టిక్కెట్‌ ధరను రీఫండ్ చేసి.. కొంత సొమ్మును పరిహారంగా కూడా ఇచ్చింది.

భారత్​లోకి పాక్​ ఫ్లైట్​.. 120 కిలోమీటర్లు ప్రయాణం.. దారి తప్పి వచ్చిందట!
పాకిస్థాన్​ ఎయిర్​లైన్స్​కు చెందిన ఓ​ విమానం.. ల్యాండింగ్​ సమస్య వల్ల భారత్​ గగనతలంలోకి ప్రవేశించి పది నిమిషాలు పాటు చక్కర్లు కొట్టింది. ఆ సమయంలో పైలట్​.. విమానాన్ని 23 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఓ మీడియా ప్రచురించడం వల్ల వెలుగులోకి వచ్చింది.

మీడియా కథనం ప్రకారం..
మే 4వ తేదీ పాకిస్థాన్​ ఎయిర్​లైన్స్​కు చెందిన బోయింగ్ 777 విమానం(పీకే 248).. మస్కట్​ నుంచి లాహోర్​కు బయలుదేరింది. అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు లాహోర్ విమానాశ్రయంలో ఆ విమానం ల్యాండ్​ కావాల్సి ఉంది. ఆ సమయంలో లాహోర్​లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పైలట్​.. విమానాన్ని ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.

ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోలర్ సూచనలు మేరకు పైలట్​.. గో- అరౌండ్​ విధానాన్ని ప్రారంభించాడు. లాహోర్​ పరిసరాల్లో చక్కర్లు కొట్టాడు. వర్షం భారీగా కురుస్తుండడం, తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ ఉండడం వల్ల దారి తప్పి భారత్​లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో 13 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానాన్ని 23వేల అడుగుల ఎత్తులోకి తీసుకెళ్లాడు. పంజాబ్‌లోని తరణ్ సాహిబ్, రసూల్‌పుర్ నగరం గుండా వివిధ ప్రాంతాల్లో ప్రయాణించిన ఆ విమానం కాసేపటికి తిరిగి పాకిస్థాన్​లోని ముల్తాన్​కు చేరుకుంది. మొత్తం భారత్​ గగనతలంలో దాదాపు పది నిమిషాల పాటు చక్కర్లు కొట్టిన పాక్​ విమానం.. 120 కిలోమీటర్లు మేర ప్రయాణించింది.

Last Updated :May 7, 2023, 10:19 PM IST

ABOUT THE AUTHOR

...view details