తెలంగాణ

telangana

నిఖిల్‌కు మంచు విష్ణు భరోసా.. నేనున్నా అంటూ ట్వీట్..

By

Published : Aug 2, 2022, 6:00 PM IST

karthikeya 2 manchu vishnu tweet

Karthikeya 2 Manchu Vishnu: హీరో నిఖిల్​కు మా అధ్యక్షుడు, ప్రముఖ నటుడు మంచు విష్ణు ధైర్యం చెప్పారు. 'కార్తికేయ 2' చిత్రం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. 'కార్తికేయ 2' చిత్రానికి థియేటర్లు ఇచ్చేది లేదంటూ కొందరు మాట్లాడారని నిఖిల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నేపథ్యంలో.. మంచు విష్ణు ట్వీట్ చేశారు.

Manchu Vishnu Nikhil tweet: 'నీకు నేనున్నా' అంటూ నిఖిల్‌ సిద్ధార్థ్‌కు భరోసానిచ్చారు నటుడు, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు. 'ధైర్యంగా ఉండండి. మంచి కంటెంట్‌ ఎప్పుడూ విజయం సాధిస్తుందం'టూ 'కార్తికేయ 2' టీమ్‌కు విష్ణు అండగా నిలిచారు. ఆ చిత్రం కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. ఆ మేరకు విష్ణు చేసిన ట్వీట్‌కు నిఖిల్‌ బదులిచ్చారు. "విష్ణు అన్నా నీ మాటలు నాకు, కార్తికేయ 2 చిత్ర బృందానికి ఎంతో విలువైనవి" అని ఆనందం వ్యక్తం చేశారు. సినిమా ప్రచారంలో భాగంగా నిఖిల్‌ ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో 'కార్తికేయ 2' విడుదల వాయిదాపై ఎమోషనల్‌గా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే విష్ణు ట్వీట్‌ చేశారని తెలుస్తోంది.

విష్ణు ట్వీట్.. నిఖిల్ రిప్లై

ఇంతకీ నిఖిల్‌ ఏమన్నారంటే..?
"ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చిన హీరోల చిత్రాలు అటో ఇటో వెళ్తుంటాయి అంటారు కదా. అది మా సినిమా విడుదల విషయంలోనూ జరిగింది. ఎట్టకేలకు 'కార్తికేయ 2'ను ఆగస్టు 12న విడుదల చేద్దామనుకోగా ఆ రోజునా కొందరు వద్దన్నారు. 'అక్టోబరులోనో, నవంబరులోనో రిలీజ్‌ చేస్కోండి. ఇప్పుడప్పుడే మీ సినిమా విడుదల కాదు, మీకు థియేటర్లు ఇవ్వం' అని మాట్లాడారు. మానసికంగా నేనెంతో దృఢంగా ఉంటా. అయినా ఆ సమయంలో ఏడ్చా. మా నిర్మాతలు విశ్వ ప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ పట్టుబట్టి ఆగస్టు 12ని ఖరారు చేశారు. సినిమాల విడుదలలో క్లాష్‌ ఉంటే ఓపెనింగ్స్‌ తగ్గుతాయనే దాంట్లో వాస్తవం ఉంది. కానీ, ఎప్పుడైనా ఏదో ఓ సినిమాతో మా చిత్రం పోటీ పడాల్సిందే కదా" అని నిఖిల్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

కార్తికేయకు సీక్వెల్‌గా..
గతంలో తెరకెక్కి, మంచి విజయం అందుకున్న 'కార్తికేయ'కి కొనసాగింపు చిత్రమే 'కార్తికేయ 2'. పార్ట్‌ 1కు దర్శకత్వం వహించిన చందూ మొండేటినే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ద్వారకా నగర రహస్యాన్ని ఛేదించే కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. అనుపమ ఖేర్‌, శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాల భైరవ సంగీతం అందించారు. పలుమార్లు వాయిదా ఈ సినిమా ఈ నెల 12న విడుదలకు సిద్ధమైంది.

ABOUT THE AUTHOR

...view details