తెలంగాణ

telangana

tragic incident in medak: అప్పు ఇప్పించాడు.. ఒత్తిడి భరించలేక యువకుడి బలవన్మరణం

By

Published : Sep 22, 2021, 12:22 PM IST

tragic incident in medak

తాను అప్పు తీసుకుని వేరే వారికి ఇవ్వగా వారు తిరిగి రాకపోవడంతో ఒత్తిడి భరించలేక ఓ యువకుడు లేఖ రాసి బలవన్మరణానికి (man suicide) పాల్పడిన విషాదకర ఘటన మెదక్‌ జిల్లా (tragic incident in medak) తూప్రాన్‌ మండలం వెంకటాయపల్లిలో చోటు చేసుకుంది.

మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం స్థానిక ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. వెంకటాయపల్లికి చెందిన లంబ మల్లయ్య, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు సత్యనారాయణ (27)కు మనోహరాబాద్‌ మండలం తుపాకులపల్లికి చెందిన భాగ్యతో రెండేళ్ల క్రితం వివాహం అవగా వారికి ఏడాది వయసున్న కుమార్తె అనన్య ఉంది. వ్యవసాయంతో పాటు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో అతని వద్ద గ్రామానికి చెందిన నాగరాజు, రమేశ్‌లు అప్పుగా కొంత నగదు తీసుకున్నారు. మరికొంతమందికి మధ్యవర్తిగా ఉండి అప్పు ఇప్పించాడు. నాగరాజు, రమేశ్‌లు తీసుకున్న నగదు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదే విషయంపై నాగరాజును గట్టిగా నిలదీయగా ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరించాడు. అందుకు తోడు మధ్యవర్తిగా ఉండి అప్పు తీసుకున్న వారు సైతం తిరిగి చెల్లించలేదు. దీంతో ఓ వైపు నగదు ఇచ్చిన వారు, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరిగింది. భార్య భాగ్యతో పాటు అత్తింటి వారు సైతం ఇబ్బంది పెట్టడంతో మనస్తాపం చెందిన సత్యనారాయణ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ వివరించారు. ఒక్కగానొక్క కొడుకు మృతితో మాకెవ్వరు దిక్కంటూ తల్లిదండ్రులు రోదించడం అందరినీ కలచివేసింది.

అమ్మానాన్న చల్లగా బతకండి..

తన చావుకు కారణాలను విశ్లేషిస్తూ సత్యనారాయణ రెండు పేజీల లేఖ రాయగా దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో ఇలా.. ‘అమ్మానాన్న.. ఐ లవ్‌ యూ.. అండ్‌ ఐ మిస్‌ యూ.. నా చావుకు కుమ్మరి నాగరాజు ప్రధాన కారణం. ఎలాంటి కాగితం లేకుండా ఇతరుల వద్ద తీసుకొని రూ.5 లక్షలు అప్పుగా ఇచ్చా. ఇప్పుడు అడిగితేే ఇవ్వను ఏం చేస్తావో చేసుకో అంటున్నాడు. నేను తెచ్చి ఇచ్చిన వాళ్లు ఆగట్లేదు. దీనికి చావు ఒక్కటే మార్గం కాదు. అయినా తప్పట్లేదు. ఊర్లో ఉంటున్న రమేశ్‌ రూ.30 వేలు, సత్యనారాయణ రూ.70 వేలు ఇవ్వాలి. నా భార్య, బంధువులు మరి కొంతమంది కూడా నా చావుకు ఒక కారణం. నాకు పుట్టిన కుమార్తె అనన్యకు రెండు గుంటలు రాసి ఇవ్వండి. అమ్మానాన్న, అక్కలు క్షమించండి.. ఐ లవ్‌ యూ అమ్మానాన్న.. మీరు చల్లగా బతకండి అంటూ లేఖలో ప్రస్తావించారు.

వ్యాపారి ఇంటి ముందు ఆందోళన

అప్పు ఇచ్చిన తూప్రాన్‌కు చెందిన వ్యాపారి ఒత్తిడి తేవడమే ఆత్మహత్యకు కారణమని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహించారు. వెంకటాయపల్లి నుంచి వాహనంలో మృతదేహాన్ని తూప్రాన్‌కు తీసుకొచ్చి సదరు వ్యాపారి దుకాణం ముందు ఉంచి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.

ఇదీ చూడండి:Theft in jewellery shop : జ్యువెల్లరీ షాపులో దొంగతనం.. 5 కిలోల వెండి ఆభరణాలు మాయం

ABOUT THE AUTHOR

...view details