తెలంగాణ

telangana

Petrol Attack: విశాఖలో యువతిపై ప్రేమోన్మాది దాడి

By

Published : Nov 13, 2021, 10:49 PM IST

Updated : Nov 14, 2021, 6:02 AM IST

attack
attack

22:35 November 13

విశాఖలో యువతిపై ప్రేమోన్మాది దాడి

హర్షవర్ధన్‌రెడ్డి

 విశాఖ నగరంలో ఉన్మాది దాడి కలకలం రేపింది. ఇక్కడి సూర్యాబాగ్‌ ప్రాంతంలోని ఓ హోటల్లో శనివారం సాయంత్రం ఒక యువతీ, యువకుడు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు కలకలం రేపాయి. హోటల్‌ సిబ్బంది, స్థానికులు తలుపులు తెరిచి వారిని రక్షించి కేజీహెచ్‌కు తరలించారు. తెలంగాణలోని భూపాలపల్లికి చెందిన పలకల హర్షవర్ధన్‌రెడ్డి(21), విశాఖ నగరంలోని కరాస ప్రాంతానికి చెందిన యువతి(20) పంజాబ్‌లో కలిసి ఇంజినీరింగ్‌ చదువుకున్నారు. ఈ నేపథ్యంలో హర్షవర్ధన్‌రెడ్డి శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో దిగాడు. తాను వచ్చిన విషయం చెప్పడంతో ఆ యువతి కూడా వచ్చింది. తనను వివాహం చేసుకోవాలని అతను కోరడంతో ఆమె నిరాకరించినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆగ్రహం చెందిన హర్షవర్ధన్‌రెడ్డి ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించడంతో పాటు...తనపై కూడా పెట్రోలు పోసుకున్నాడు. హర్షవర్ధన్‌రెడ్డికి 62శాతం, ఆ యువతికి 61శాతం కాలిన గాయాలయ్యాయి.  క్లూస్‌ టీంతో పోలీసులు సంఘటన స్థలం నుంచి ఆధారాలు సేకరించారు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. వారిద్దరూ మాట్లాడే పరిస్థితుల్లో లేరని, దర్యాప్తులో పురోగతి వచ్చే వరకూ కచ్చితమైన సమాచారం చెప్పలేమని విశాఖ డీసీపీ-1 గౌతమి సాలి పేర్కొన్నారు.

హర్షవర్ధన్‌రెడ్డి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీలో నివాసం ఉంటున్నాడు. తండ్రి రాంరెడ్డి భూపాలపల్లిలో సింగరేణి కార్మికుడు. గతేడాదే బీటెక్‌ పూర్తి చేసుకొని హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా కారణంగా ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఘటనతో రెడ్డికాలనీలో విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రాత్రి విశాఖకు బయలుదేరి వెళ్లినట్లు సమాచారం.  చదువులో ముందుండే హర్షవర్ధన్‌రెడ్డి ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామని కాలనీ వాసులు అంటున్నారు.

ఇదీ చూడండి:Panjagutta girl murder: ఆ చిన్నారిని చంపింది కన్నతల్లే... ప్రియుడితో కలిసి కిరాతకంగా...

Last Updated :Nov 14, 2021, 6:02 AM IST

ABOUT THE AUTHOR

...view details