తెలంగాణ

telangana

మరో పరువు హత్య.. నడిరోడ్డుపై ఇనుప రాడ్లు, కత్తులతో దాడి.. ఇద్దరు అరెస్ట్​

By

Published : May 5, 2022, 7:46 AM IST

Updated : May 5, 2022, 10:28 AM IST

honor killing in saroor nagar

Honor Killing in Saroor Nagar: హైదరాబాద్‌ నడిబొడ్డున దారుణం జరిగింది. పెద్దలను కాదని ప్రేమించి మతాంతర వివాహం చేసుకుందని.. యువతి కుటుంబసభ్యులు ఆమె భర్తపై మారణాయుధాలతో దాడి చేసి కిరాతకంగా హతమార్చారు. నడిరోడ్డుపై ఇనుపరాడ్లు, కత్తులతో దాడి చేసి చంపేశారు. సరూర్‌నగర్‌లో జరిగిన ఈ హత్య నగరంలో సంచలనం సృష్టించింది. సరూర్‌నగర్‌ పోలీస్‌ఠాణా పరిధిలోని జీహెచ్‌ఎంసీ కార్యాలయం రహదారిపై బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. హత్యకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

మరో పరువు హత్య.. నడిరోడ్డుపై ఇనుప రాడ్లు, కత్తులతో దాడి.. ఇద్దరు అరెస్ట్​

Honor Killing in Saroor Nagar: రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన బిల్లాపురం నాగరాజు, మర్పల్లి సమీపంలోని ఘనాపూర్‌ గ్రామంలో నివసించే సయ్యద్‌ ఆశ్రిన్‌ సుల్తానా.. ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి ఆశ్రిన్‌ కుటుంబ సభ్యులు అతడిని హెచ్చరించారు. ఆశ్రిన్‌ను పెళ్లిచేసుకుందామని నిర్ణయించుకున్న నాగరాజు.. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కార్ల కంపెనీలో కొద్దినెలల కిందట సేల్స్‌మన్‌గా చేరాడు. కొత్త సంవత్సరం రోజు ఆశ్రిన్‌ను రహస్యంగా కలుసుకున్న నాగరాజు కొద్దిరోజుల్లో పెళ్లి చేసుకుందామని చెప్పాడు. అంగీకరించిన ఆశ్రిన్​.. జనవరి చివరి వారంలో పారిపోయి హైదరాబాద్‌కు వచ్చింది. లాల్‌దర్వాజలోని ఆర్యసమాజ్‌లో జనవరి 31న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

వివాహం అనంతరం ఎవరూ తమను గుర్తించకుండా నాగరాజు వేరే ఉద్యోగంలోకి మారిపోయాడు. వీరు హైదరాబాద్‌లో ఉంటున్నట్లు ఆశ్రిన్‌ కుటుంబ సభ్యులు పసిగట్టడంతో కొత్తజంట రెండు నెలల కిందట విశాఖపట్నం వెళ్లి అక్కడే ఉన్నారు. ఎవరూ తమను వెంటాడటం లేదని భావించి.. అయిదు రోజుల కిందట మళ్లీ నగరానికి వచ్చారు. సరూర్‌నగర్‌లోని పంజా అనిల్‌కుమార్‌ కాలనీలో నివసిస్తున్నారు. వీరి కదలికలను గుర్తించిన ఆశ్రిన్‌ కుటుంబ సభ్యులు మాటువేశారు. బుధవారం రాత్రి నాగరాజు, ఆశ్రిన్‌లు కాలనీలోంచి బయటకు రాగానే ఆశ్రిన్‌ సోదరుడు, అతడి స్నేహితుడు బైక్‌పై వారిని వెంబడించి దాడికి పాల్పడ్డారు. నాగరాజుపై ఇనుపరాడ్లు, కత్తులతో దాడి చేసి హత్య చేశారు.

"నాగరాజు, నేను ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నాం. నా కోసం తను మతం కూడా మార్చుకుంటానని చెప్పాడు. కానీ మా ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. అందుకే బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నాం. కానీ ఇలా పగ పెంచుకుని నా భర్తను చంపుతారని ఊహించలేదు. చంపొద్దని కాళ్ల మీద పడి వేడుకున్నా కనికరించలేదు. పెద్ద పెద్ద ఇనుప రాడ్లతో నాగరాజుపై దాడి చేశారు. వాళ్ల బలం ముందు నేను ఓడిపోయా." -ఆశ్రిన్​ సుల్తానా, బాధితురాలు

తన సోదరుడే భర్తను కిందపడేసి ఇనుపరాడ్డుతో తలపై విచక్షణారహితంగా కొట్టి చంపేయడంతో ఆ యువతి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. రక్తపు మడుగులో భర్తను చూసి పెద్దగా రోదిస్తూ కేకలు వేసింది. దాడి జరుగుతున్న సమయంలో అశ్రిన్‌ తన భర్తను చంపవద్దంటూ కాళ్ల మీద పడి వేడుకున్నా కనికరించలేదని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. అప్రమత్తమైన స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. హత్యకు పాల్పడిన ఆశ్రిన్​ సోదరుడు, బావను పోలీసులు అరెస్టు చేశారు. నాగరాజు బంధువులు ఆశ్రిన్‌ను వెంట తీసుకెళ్లారు. హత్యపై సాక్ష్యాధారాలు సేకరించామని ఏసీపీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

"ప్రేమ వివాహం ఇష్టంలేని అమ్మాయి సోదరుడు, బంధువు.. వీరిద్దరూ సరూర్​నగర్​లో ఉంటున్నట్లు తెలుసుకుని మాటు వేసి దాడికి పాల్పడ్డారు. సమాచారం అందిన వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టాం. బాధితురాలు సోదరుడు, బావను పోలీసులు అరెస్టు చేశారు." -శ్రీధర్​ రెడ్డి, ఎల్బీనగర్​ డీసీపీ

మతాంతర వివాహం ఇష్టంలేకనే అశ్రిన్‌ సుల్తానా అన్న హత్య చేశాడని నాగరాజు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారున్ని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో నాగరాజు మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా ఆస్పత్రి వద్ద నాగరాజు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

"అమ్మాయి తరఫు కుటుంబీకుల నుంచి మాకు బెదిరింపులు ఏవీ రాలేదు. ఆశ్రిన్​ సోదరుడికి ఈ పెళ్లి ఇష్టం లేదు. అందుకే రక్షణ కోసం వికారాబాద్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాం. వారి సమక్షంలోనే పంచాయితీ తెగ్గొట్టాలని చూశాం. మీ పెద్దలకు ఇష్టం లేని పెళ్లి వద్దు.. మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లు అని అమ్మాయికి చెప్పాం. కానీ ఆమె వినలేదు. నాగరాజుతోనే వచ్చింది. అందుకే ఆమె అన్నకు ఇంకా కోపం పెరిగింది. మాటు వేసి నా కుమారుడిని చంపారు. దంపతులిద్దరూ బైక్​పై వెళ్తుండగా నలుగురు అడ్డుకుని ఆశ్రిన్​ను పక్కకు లాగి.. నాగరాజును కిరాతకంగా గడ్డపార, కత్తులతో దాడి చేసి చంపేశారు. పోలీసులు మాకు న్యాయం చేయాలి." -నాగరాజు తల్లిదండ్రులు

ఇవీ చదవండి:సరూర్‌నగర్‌లో హత్య కలకలం.. గడ్డపారతో పొడిచి పరార్​

మామూళ్లతో అబ్కారీ శాఖ ఆదాయం మామూలుగా లేదుగా..

క్లాస్​ రూంలోనే విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. వారి ముందే మూత్ర విసర్జన!

Last Updated :May 5, 2022, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details