తెలంగాణ

telangana

భాజపా, తెరాస ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నాయని రేవంత్​రెడ్డి ఫైర్

By

Published : Aug 20, 2022, 3:47 PM IST

Updated : Aug 20, 2022, 6:59 PM IST

Revanth Reddy

Revanth Reddy on Munugodu Bypoll మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రజలను కోరారు. రాజీనామా చేస్తే నిధులొస్తాయంటున్న భాజపా... వారి ఎంపీలను ఎందుకు రాజీనామా చేయించట్లేదని ప్రశ్నించారు. రాజీవ్​ గాంధీ జయంతి సందర్భంగా నారాయణపూర్​ మండలంలో చేపట్టిన ర్యాలీలో పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించి ఉత్సవాలు ప్రారంభించారు.

భాజపా, తెరాస ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నాయని రేవంత్​రెడ్డి ఫైర్

Revanth reddy on Munugode By poll సీఎం కేసీఆర్​ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలను చంపే ప్రయత్నం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేశారన్నారు. ఇప్పుడు అదే విధానాన్ని భాజపా కూడా అవలంభిస్తోందని ధ్వజమెత్తారు. రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని నల్గొండ జిల్లా పొర్లగడ్డ తండాలో కాంగ్రెస్‌ జెండా ఆవిష్కరణ, రాజీవ్​గాంధీ చిత్ర పటానికి నివాళులు అర్పించిన అనంతరం రేవంత్‌ రెడ్డి చౌటుప్పల్‌లో మాట్లాడారు.

ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని రేవంత్​రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పోడు భూముల సమస్య పరిష్కారం కాలేదని, రుణమాఫీ జరగలేదని ఆరోపించారు. రాజీవ్​గాంధీ జయంతిని మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించి.. రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నట్లు రేవంత్‌ తెలిపారు. మునుగోడుకు ఒక చరిత్ర ఉందని, సాయుధ రైతాంగ పోరాటానికి ఇక్కడి నాయకులే నేతృత్వం వహించారని రేవంత్​ గుర్తు చేశారు. నల్గొండను పట్టిపీడిస్తోన్న ఫ్లోరైడ్ సమస్య రాష్ట్ర విభజనతో పరిష్కారం అవుతుందని నమ్మామని, కాని ఇప్పటికీ పరిష్కారం కాలేదని ఆరోపించారు.

భాజపాలో చేరినప్పుడే పండగ.. తర్వాత..: పక్క పార్టీ నేతలను కొనేందుకే భాజపా ప్రత్యేకంగా చేరికల కమిటీని వేసుకుందని, కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని పార్టీ పిరాయింపులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. భాజపాలో చేరినప్పుడే పండగ.. తర్వాత తలుపులు మూసుకొని ఏడవాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ మునుగోడు నియోజకవర్గంలో అమలు చేయాలని, నియోజకవర్గ భూనిర్వాసితులకు మల్లన్నసాగర్‌లా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

దండం పెట్టి ఓట్లు అడుగుతాం..:కాంగ్రెస్‌కు ఓటు వేయడం ద్వారా భాజపా, తెరాస తోడు దొంగలకు బుద్ధి చెప్పాలని నియోజకవర్గ ప్రజలను రేవంత్​ కోరారు. కాంగ్రెస్‌ పార్టీ డబ్బులు పంచదని, కొనుగోలు అంతకంటే చేయదన్న ఆయన.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు 1000 మంది కాంగ్రెస్‌ నాయకుల ద్వారా లక్ష మందికి దండం పెట్టి ఓట్లు అడుగుతామన్నారు. మునుగోడులో ఎగిరితే కాంగ్రెస్ జెండా, లేదంటే కమ్యూనిస్టు జెండా ఎగిరిందని.. ఇతర పార్టీల జెండా ఎగిరే అవకాశమే లేదని స్పష్టం చేశారు.

'రాజీనామాల ద్వారానే నిధులు వస్తాయని భాజపా చెప్తోంది. అలాంటప్పుడు భాజపా ఎంపీలను రాజీనామా చేయించి నిధులు తీసుకురండి. రాజీనామాతో ఏ గ్రామాలకు నిధులు వచ్చాయో చెప్పండి. అమ్ముడుపోయిన వాళ్లంతా సిద్ధాంతాలు చెప్పడం దారుణం. భాజపా, తెరాస ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు. ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్‌ను గెలిపించండి. యువత చైతన్యంతో కొనుగోలు రాజకీయాలను పాతరేయాలి. ప్రతీ గ్రామంలో ఇంటి ఇంటికి కాంగ్రెస్ స్టిక్కర్లు అంటించాలి. మునుగోడులో మద్దతు ఇవ్వాలని కోదండరాంను కలిశా. ఈ నియోజకవర్గంలోని రైతులకు రూ.300 కోట్ల రుణమాఫీ జరగాలి. పెండింగ్‌లో ఉన్న పోడుభూముల సమస్య పరిష్కరించండి. పాలమూరు-రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి.'-రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇవీ చదవండి:

Last Updated :Aug 20, 2022, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details