తెలంగాణ

telangana

Micro Ganesh Idol: సెంటీమీటర్ కన్నా చిన్నగా ఉన్న బుల్లి గణేశులు

By

Published : Aug 30, 2022, 9:04 PM IST

Updated : Aug 31, 2022, 12:02 PM IST

ganesh idols
ముక్తేశ్వర్ ()

Micro Ganesh Idol: ఒకవైపు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుంచె పట్టి బొమ్మలు వేస్తున్నాడు. కంప్యూటర్ కీబోర్డు, మౌస్​లతో పనిచేస్తూనే అద్భుత చిత్రాలను గీస్తున్నాడు. తన చిత్రలేఖనంతో పలువురి ప్రశంసలు పొందుతున్నాడు. రాములోరి చిత్తరువులను, మూలమూర్తులను గీస్తూ ఔరా అనిపిస్తున్నాడు. సెంటీమీటర్ కన్నా తక్కువ కొలతతో అతి చిన్న మట్టి విగ్రహాన్ని తయారు చేసి.. అందరినీ ఆకట్టుకుంటున్న భద్రాచలానికి చెందిన యువ సాప్ట్ వేర్ ఉద్యోగిపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం..

Micro Ganesh Idol: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ కేంద్రానికి చెందిన దారా ముక్తేశ్వర్ బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం బెంగళూరులోని 'క్యాప్ జెమినీ' మల్టీ నేషనల్ కంపెనీలో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. చిన్నతనం నుంచే చదువుతో పాటు చిత్రలేఖనంపై ఆసక్తి పెంచుకున్నాడు. ఎవరి వద్ద శిక్షణ తీసుకోకుండానే స్వయంగా పేపర్​లోని చిత్రాలను గీసేవాడు. తల్లిదండ్రులు దారా బాలాజీ, నళినీకుమార్ ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగిన వారు కావడంతో ప్రత్యేకంగా ఆధ్మాత్మిక చిత్రాలపై ఆసక్తి కనబరిచేవాడు. రామయ్య ఉత్సవ మూర్తులను గీయడంలో తనదైన శైలిని రూపొందించుకున్నాడు. కొవిడ్ మహమ్మారి విజృంభించే సమయంలో లాక్​డౌన్​ వల్ల ఉద్యోగ విధులను ఇంటి వద్ద నుంచే పూర్తి చేయాల్సి రావడం.. తగిన ఖాళీ సమయం దొరకడంతో తనలోని కళాకారుడికి మరింత పదును పెట్టాడు ముక్తేశ్వర్.

శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో స్వామి వారికి జరిగే ప్రతి ఉత్సవంలోని మూర్తులను, ఆభరణాలను, తదితర వస్తువులను అచ్చుగుద్దినట్లుగా రూపొందించటం.. ప్రత్యేక అలంకరణలు ఎలా అయితే రామాలయం అర్చకులు ముస్తాబు చేస్తారో అదే విధంగా చిన్న విగ్రహాలకు ముస్తాబు చేయడం ఈ యువకుడి ప్రత్యేకత. రామాలయంలో ప్రతి సోమవారం మూలమూర్తులకు ముత్తంగి అలంకరణ చేస్తారు. రామయ్య మూలమూర్తులను చిత్రీకరించి వాటిపై ముత్యాలు పొదిగి ఉన్న ముత్తంగి అలంకరణను ఎలాంటి తేడా రాకుండా అలాగే రూపొందించాడు. 2020 భద్రాచలంలో జరిగిన ముక్కోటి ఏకాదశి సందర్భంగా రామయ్యను వివిధ అవతారాల్లో అలంకరించిన విధంగా.. ఇంట్లోని ఉత్సవ మూర్తులకు అలాగే అలంకరణలు చేసి అందరినీ ఆకట్టుకుంటున్నాడు ముక్తేశ్వర్.

చిన్నతనం నుంచే చదువుతో పాటు చిత్రలేఖనం, బొమ్మల తయారిపై ఆసక్తి పెంచుకున్నాడు. ఎవరి వద్ద శిక్షణ తీసుకోకుండానే స్వయంగా పేపర్​లోని చిత్రాలను గీస్తూ, మట్టితో బొమ్మలు చేస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ వినాయక చవితికి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తన వంతుగా మట్టితో చేసిన వినాయక విగ్రహలను తయారు చేస్తున్నాడు. దీనిలో విశేషం ఏమిటంటే మట్టి వినాయక విగ్రహలను అందరూ తయారు చేస్తారు.. కానీ ముక్తేశ్వర్ ఒక సెంటీమీటర్ కన్నా చిన్నగా 0.8 cm ఉన్న బుల్లి గణేశుని విగ్రహలను తయారు చేసి అందరినీ ఆలరిస్తున్నాడు. ఫ్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇతర హానికరమైన పదార్థాలతో తయారు చేస్తున్న ఈ రోజుల్లో మట్టితో అతి చిన్న పరిమాణం ఉన్న విగ్రహాలను రూపొందిస్తూ తన కళానైపుణ్యంతో అందరినీ కట్టిపడేస్తున్నాడు. సులువుగా మట్టితో వినాయకుడి విగ్రహాలు ఎలా తయారు చేయాలనే దానిపై పిల్లలకు అవగాహన కార్యక్రమాలూ నిర్వహిస్తున్నాడు.

ఐటీ ఉద్యోగం చేస్తూనే కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ భళా అనిపిస్తున్న యువకుడు

ఇవీ చదవండి:

Last Updated :Aug 31, 2022, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details