తెలంగాణ

telangana

ట్విటర్ వార్, కేటీఆర్ Vs మన్‌సుఖ్ మాండవీయ

By

Published : Aug 30, 2022, 7:13 AM IST

KTR and Mansukh Mandaviya Twitter War
KTR and Mansukh Mandaviya Twitter War ()

KTR and Mansukh Mandaviya Twitter War తెరాస భాజపా మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందేమి లేదని ముఖ్యమంత్రి సహా రాష్ట్ర మంత్రులు వివిధ వేదికలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తెలంగాణ ప్రగతికి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తోందని చెబుతోంది. ఈ క్రమంలో ట్విటర్‌ వేదికగా వైద్య కళాశాల కేటాయింపు అంశం మంత్రి కేటీఆర్ - కేంద్రమంత్రి మన్సుక్‌ మాండవీయకు మాటల సంవాదం నడిచింది.

KTR and Mansukh Mandaviya Twitter War : తెరాస సర్కార్‌- భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మధ్య నిధులు, ప్రాజెక్టుల కేటాయింపుపై వాడీవేడి చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే... ప్రభుత్వం వైద్య కళాశాలల మంజూరు అంశంపై కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయ, రాష్ట్ర మంత్రి కేటీఆర్ మధ్య ట్విటర్ యుద్ధం కొనసాగింది. తెలంగాణకు ఒక్క వైద్య కళాశాల మంజూరు చేయలేదన్న కేటీఆర్ ట్వీట్‌కు కేంద్రమంత్రి మాండవీయ స్పందించారు.

KTR and Mandaviya Tweet War : తెలంగాణ ప్రభుత్వం నుంచి వైద్య కళాశాలల ఏర్పాటుకు ఒక్క ప్రతిపాదన కూడా రాలేదన్న మాండవీయ.. స్వల్పకాలంలోనే ప్రధాని మోదీ అత్యధిక సంఖ్యలో వైద్యకళాశాలలు మంజూరు చేశారని తెలిపారు. ఎలాంటి వివక్ష లేకుండా ప్రతిపాదనలు పంపిన రాష్ట్రాలకు వైద్య కళాశాలలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ట్వీట్​పై స్పందించిన కేటీఆర్.. వైద్య కళాశాలల కోసం 2015 నుంచి 2019 వరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులకు ప్రతిపాదనలు పంపినట్లు గత లేఖలను ట్వీట్​తో జతపరిచారు. తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు అడిగినప్పటికీ కేంద్రం ఒక్క వైద్య కళాశాల కూడా ఇవ్వలేదన్న ఆయన... బీబీనగర్ ఎయిమ్స్‌లో ఉన్న 544 ఖాళీలను కూడా కేంద్రం భర్తీ చేయలేదని ఆరోపించారు. బీబీనగర్ ఎయిమ్స్‌ను కూడా యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిందని, తెలంగాణకు కేంద్రం ఒక్క విద్యాసంస్థ కూడా ఇవ్వలేదని వాస్తవమని కేటీఆర్ ట్వీట్ చేశారు.

కేటీఆర్ ట్వీట్​పై స్పందించిన కేంద్ర మంత్రి మాండవీయ.. గత కేంద్ర మంత్రులు రాసిన లేఖలు, పార్లమెంట్‌లో ఇచ్చిన సమాధానంలోని అంశాలను జాగ్రత్తగా చదవాలని సూచించారు. పథకం విధివిధానాలకు లోబడి డీపీఆర్‌తో కూడిన ప్రతిపాదనలు పంపాలని సూచించినట్లు పేర్కొన్నారు. కేవలం ఓ సాధారణ లేఖ రాయడం వేరు, పథకం నిబంధనల ప్రకారం ప్రతిపాదనలు పంపడం వేరని వివరించారు. కేంద్ర మంత్రి స్పందనపై ప్రతిస్పందించిన మంత్రి కేటీఆర్.. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మీ కేబినెట్ సహచరుడు 9 వైద్య కళాశాలలు మంజూరు చేసినట్లు గతంలో పేర్కొన్నారని గుర్తు చేశారు.

తెలంగాణకు కొత్త వైద్య కళాశాలలు మంజూరు చేసినట్లు గవర్నర్ కూడా గతంలో చెప్పినట్లు పేర్కొన్నారు. తెలంగాణ అసలు దరఖాస్తు చేయలేదని ఇప్పుడు మీరు చెబుతున్నారని కేంద్ర మంత్రి మాండవీయను అడిగారు. ఉత్తరప్రదేశ్ 14 వైద్య కళాశాలలు అడిగితే 27 ఇచ్చినట్లు కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో ఇచ్చిన సమాధానం ఉందని అన్నారు. ఈ కపటత్వం, ద్వంద్వ విధానాలు ఎందుకని కేటీఆర్‌ ప్రశ్నించారు.

మన్సూక్‌ మాండవీయ ట్వీట్‌పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం స్పందించారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు నిర్లక్ష్యపూరితంగా సమాధానం చెప్పడం సరికాదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలే తెలంగాణ సంక్షేమం పట్ల భాజపా వైఖరిని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details