తెలంగాణ

telangana

8 జిల్లాల పోలీసుల ప్లాన్.. 100 కార్లతో ఛేజ్.. అసలెవరీ అమృత్​పాల్?

By

Published : Mar 18, 2023, 5:28 PM IST

WHO IS AMRITPAL SINGH punjab police
WHO IS AMRITPAL SINGH punjab police ()

ఏడాది క్రితం వరకు అమృత్​పాల్​ అంటే ఎవరికీ తెలియదు. కానీ తక్కువ సమయంలోనే దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాడు. అసలు ఎవరీ అమృత్​పాల్​? అంతడికెందుకు అంత మంది మద్దతుదారులు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఖలిస్థానీ అనుకూల సంస్థ 'వారీస్​ పంజాబ్​ దే' అధినేత అమృత్​పాల్​ సింగ్​. ప్రస్తుతం దేశం మొత్తం ఇతడి పేరు మారుమోగిపోతోంది. ఇటీవల పంజాబ్​లోని ఓ పోలీస్​ స్టేషన్​లో విధ్వంసం సృష్టించిన కేసులో.. సినీ ఫక్కీలో ​పోలీసులు అమృత్​పాల్​ను అరెస్టు చేశారు. ఏకంగా 100 కార్లతో అతడిని వెంబడించారు. అతడిని అరెస్ట్ చేసేందుకు ఎనిమిది జిల్లాల పోలీసులు కలిసి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అతడి కోసం పోలీసు యంత్రాంగం మొత్తం రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఎవరు ఈ అమృత్​పాల్​ సింగ్? ఇప్పటివరకు ఎవరికీ తెలియని వ్యక్తి.. ఒక్కసారిగా ఎలా ఎదిగాడు? అతడికి భారీగా మద్దతుదారులు ఎందుకున్నారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు అమృత్​పాల్​ ఎవరంటే..

ఏడాది క్రితం వరకు ఎవరికీ తెలియదు..
గతేడాది ఫిబ్రవరి వరకు అమృత్‌పాల్‌ ఎవరికీ తెలియని ఓ సాధారణ వ్యక్తి. 30 ఏళ్ల అమృత్​పాల్​ మోడ్రన్​ లైఫ్​స్టైల్​ను అనుసరిస్తూ కనీసం తలపాగా కూడా ధరించేవాడు కాదు. తన బంధువుల రవాణా వ్యాపారంలో మద్దతుగా ఉండేందుకు దుబాయి వెళ్లాడు. అందరు యువకులలాగే సోషల్‌ మీడియాలో ఎక్కువ సమయం గడిపేవాడు. కానీ, 'వారిస్‌ పంజాబ్‌ దే' సంస్థ వ్యవస్థాపకుడు, యాక్టర్‌ దీప్‌సిద్ధూ మరణంతో అమృత్‌పాల్‌ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. దీప్​సిద్ధూ అనుచరులకు మార్గదర్శకాలు చేసేవారు కరవైపోయారు. ఈ పరిస్థితిని అమృత్‌పాల్‌ తెలివిగా వాడుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత 'వారిస్‌ పంజాబ్‌ దే'కు తానే లీడర్​నని ప్రకటించుకున్నాడు. అయితే మొదట్లో అమృత్​పాల్​ కుటుంబ సభ్యులు ఇందుకు అంగీకరించలేదు. కానీ, అమృత్‌పాల్ తక్కువ సమయంలోనే పాపులర్‌ అయ్యాడు.

పాపులారిటీకి కారణం ఇదే!
సాధారణంగా చాలా మంది ఖలిస్థానీ మద్దుతుదారులు విదేశాల్లో ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహిస్తారు. గురుపత్వంత్​ పన్నూ లాంటి వాళ్లు కూడా ఇలాగే చేస్తారు. కానీ అమృత్​పాల్​ ఏకంగా పంజాబ్​నే స్థావరంగా చేసుకున్నాడు. ఈ కారణంగానే ఎక్కువ మంది సానుభూతిపరులను ఆకర్షించ గలిగాడు అమృత్​పాల్.

​అతడి ఎజెండా అదే!
భారత్​ను వ్యతిరేకించడం, యువతలో ఖలిస్థానీ భావజాలం నింపడం లాంటి అజెండాలే పరమావధిగా అమృత్​పాల్​ పని చేశాడు. అలా తన సంస్థను వేగంగా విస్తరించాడు. సిక్కులందరూ ప్రమాదంలో ఉన్నారని.. బానిసలని ప్రచారం చేసి మతవిద్వేషాలను రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు. అయితే, చాలా మంది అతడు మతప్రచారం చేస్తున్నాడని అనుకుంటారు. కానీ పలువురు సిక్కు వేధావులు మాత్రం అమృత్‌పాల్‌ కారణంగా మతానికి చెడ్డపేరు వస్తోందని.. పాక్‌ ఐఎస్‌ఐ అజెండాను అమృత్​పాల్​ అనుసరిస్తున్నాడని వాపోతున్నారు. ఈ మధ్య కాలంలో పలువురు సిక్కు గురువులు, నాయకులు సైతం అతడిని విమర్శించారు. చాలా మత సంస్థలు అమృత్​పాల్​ కార్యకలాపాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఇక, కరుడుగట్టిన ఖలిస్థానీ వేర్పాటువాది జర్నైల్‌ సింగ్‌ భింద్రాన్‌వాలా తరహాలోనే అమృత్‌పాల్‌ కూడా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు అతడిపై ఉన్నాయి. కాగా, అమృత్​పాల్​ వస్త్రధారణ కూడా భింద్రాన్‌వాలాను తలపిస్తుంది.

గత నెల పంజాబ్​లో జరిగిన ఓ సంఘటన ద్వారా అమృత్​పాల్​ ఒక్కసారిగా సంచలనంగా మారాడు. తన అనుచరుడైన లవ్​ప్రీత్ సింగ్​ను అరెస్ట్ చేసిన పోలీసులపైకి తన బలగాన్ని మొత్తం పంపించాడు. అతడి పిలుపుతో వందలాది మంది.. అజ్నాలా పోలీస్ స్టేషన్​పై దాడికి దిగారు. చివరకు పోలీసులు లవ్​ప్రీత్​ను విడుదల చేశారు. అమృత్​పాల్​ ఇప్పటికే ప్రధాని, హోం మంత్రి వంటి వారిని బెదిరిస్తూ ప్రకటనలు కూడా చేశాడు. దీంతో భద్రతా సంస్థలు అతడి కార్యకలాపాలపై నిఘా ఉంచాయి. ఈ నేపథ్యమే అమృత్​పాల్​ అరెస్టుకు దారి తీసింది.

ABOUT THE AUTHOR

...view details