తెలంగాణ

telangana

సాయం చేసేవారిపై మృత్యువు పంజా.. ఆటో డ్రైవర్​ను రక్షిస్తూ ఇద్దరు దుర్మరణం

By

Published : Oct 2, 2022, 1:19 PM IST

Two truck drivers dead near ambur while trying to save a auto driver
Two truck drivers dead near ambur while trying to save a auto driver ()

ఆటో డ్రైవర్​ను రక్షించే క్రమంలో వేగంగా దూసుకొస్తున్న లారీ ఢీకొనడం వల్ల ఇద్దరు ట్రక్కు డ్రైవర్లు అక్కడికక్కడే మరణించిన ఘటన తమిళనాడులో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లారీ డ్రైవర్​ కోసం గాలిస్తున్నారు. మరోవైపు, ఝార్ఖండ్​, ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో పది మంది మరణించగా.. 40 మందికి పైగా గాయపడ్డారు.

తమిళనాడులోని తిరుపత్తారు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆటో డ్రైవర్​ను రక్షించే క్రమంలో వేగంగా దూసుకొస్తున్న లారీ ఢీకొనడం వల్ల ఇద్దరు ట్రక్కు డ్రైవర్లు అక్కడికక్కడే మరణించారు.
పోలీసుల వివరాల ప్రకారం..జిల్లాలోని అంబూర్​ సమీపంలో ఉదయరాజపాళ్యం ప్రాంతంలో చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. అయితే ఈ మార్గంలోనే వెళ్తున్న ఇద్దరు ట్రక్కు డ్రైవర్లు.. ఆటో చోదకుడ్ని రక్షించేందుకు వెళ్లారు.

అదే సమయంలో వేలూరు నుంచి కృష్ణగిరి వైపు వెళ్తున్న లారీ.. ఇద్దరు ట్రక్కు డ్రైవర్లను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఇద్దరూ మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులను కృష్ణన్​, శ్రీనివాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. డ్రైవర్ల మృతికి కారణమైన లారీ చోదకుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

బస్సు-లారీ ఢీ.. నలుగురు మృతి.. 30 మందికి గాయాలు..
ఝార్ఖండ్​లో ఘోర ప్రమాదం జరిగింది. మలుపు దగ్గర అదుపు తప్పి ఎదురెదురుగా వస్తున్న లారీ, బస్సు ఢీకొని బోల్తా పడ్డాయి. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా.. మరో 30 మందికి పైగా గాయపడ్డారు.

పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని కటకంసాండీలో శనివారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. గయా నుంచి ఒడిశా వెళ్తున్న బస్సు, ఓ లారీ.. టర్నింగ్​ వద్ద ఎదురెదురుగా ఢీకొని బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికుల సహాయంలో బస్సులోంచి మృతదేహాలను బయటకు తీసి శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్​లో చేర్పించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఆగి ఉన్న వ్యాన్​ను ట్రక్కు ఢీ.. ఐదుగురు మృతి..
ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పుర్​లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న మినీ వ్యాన్​ను వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

అహిర్వాన్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. మినీవ్యాన్‌లో ఉన్నవారు వింధ్యాచల్ ధామ్‌లో జరగనున్న ఓ వేడుక కోసం బయలుదేరినట్లు చెప్పారు. మినీ వ్యాన్​ టైర్​ పంక్చర్​ అయిందని, అందుకు రోడ్డు పక్కన ఆపి మరమ్మతులు చేస్తున్న సమయంలో ట్రక్కు ఢీకొట్టిందని వివరించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించామని, కేసు నమోదు చేసుకుని ట్రక్కు డ్రైవర్​ కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details