తెలంగాణ

telangana

Government is threatening CBI officials : అవినాష్ అరెస్టుకు అడుగేస్తే..! సీబీఐకి చుక్కలు చూపుతున్న సర్కారు

By

Published : May 23, 2023, 7:09 AM IST

Etv Bharat

Government is threatening CBI officials : వివేకా హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయటానికి వచ్చిన సీబీఐ అధికారులను ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోంది. సీబీఐ అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే.. ఎంతకైనా తెగిస్తామంటూ తన చర్యల ద్వారా హెచ్చరిస్తోంది. దేశవ్యాప్తంగా నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సీబీఐ... రాష్ట్ర పోలీసులు, ఏపీ ప్రభుత్వ అరాచక చర్యలతో ఏపీలో బిక్కచచ్చిపోయింది.

సీబీఐని ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం

Government is threatening CBI officials : ప్రభుత్వ వైఫల్యాలపై ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో చిన్న పోస్టు పెట్టినా సరే.. ఆగమేఘాలపై వారింట్లో పోలీసులు ప్రత్యక్షమైపోతారు. ఎక్కడికి, ఎందుకు తీసుకెళ్తున్నారనే కనీస సమాచారం ఇవ్వకుండా బలవంతంగా ఎత్తుకెళ్లిపోతారు. అసలు వారు నిజంగా పోలీసులేనా? ఎవరైనా కిడ్నాప్‌ చేశారా అన్నంత అరాచకంగా వ్యవహరిస్తారు. సీఎం జగన్‌, ఆయన ప్రభుత్వ వైఫల్యాల్ని తూర్పారపడుతూ పోరాడే ప్రతిపక్ష నాయకులు, సామాజిక కార్యకర్తలపై కేసులు బనాయించి అర్ధ రాత్రీ, అపరాత్రీ అని చూడకుండా వారిపై దండయాత్రకు వెళ్తారు. ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసినట్లుగా వందల మంది పోలీసులను మోహరించి.. వారి ఇంటిని దిగ్బంధిస్తారు. గోడలు దూకుతారు, ఇళ్లల్లోకి చొరబడతారు. తలుపులు విరగ్గొట్టి మరీ అదుపులోకి తీసుకుని.. ఘోరమైన నేరానికి పాల్పడ్డ వారిలా క్షణాల్లో అరెస్టు చేసి తీసుకెళ్లిపోతారు. గత నాలుగేళ్లుగా జగన్‌ కనుసన్నలతో ఏపీ పోలీసులు చేస్తున్న నిర్వాకమిది.

అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని... ఇప్పటివరకూ సామాన్యులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, పౌర హక్కుల సంఘాల ప్రతినిధుల్ని టార్గెట్‌ చేసి వేధించిన పోలీసులు... ఇప్పుడు సీబీఐనే ముప్పుతిప్పలు పెడుతున్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఒక్కో చిక్కు ముడినీ విప్పుతూ.. తీగ లాగుతూ సీబీఐ పలువుర్ని అరెస్టు చేసింది. చివరకు ఈ కేసులో నిందితుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేస్తామని కోర్టుకు నివేదించింది. ఈ తరుణంలో సీబీఐని జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వ పెద్దలు ముప్పుతిప్పలు పెడుతున్నారు.

తాజాగా అవినాష్‌ను అరెస్టు చేయటానికి కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రి వద్దకు వెళ్లేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నించగా వారిని దరిదాపుల్లోకి కూడా రానీయకుండా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, వందల మంది మోహరించి.. దౌర్జన్యానికి తెగబడి, వీరంగం సృష్టించారు. అల్లరి మూకల్ని తరిమికొట్టాల్సిన రాష్ట్ర పోలీసులే వారికి వత్తాసు పలుకుతున్నారు.

రఘురామ రాజును వదలని వైనం.. ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకే సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజును హింసించిన జగన్‌ ప్రభుత్వం.. హత్య కేసులో నిందితుడిగా నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్‌ రెడ్డికి మాత్రం కొమ్ముకాస్తోంది. కావాల్సిన వారు ఎన్ని తప్పులు చేసినా వారిని కాపాడటానికి ఎంతకు తెగించడానికైనా వెనుకాడబోనన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

వ్యతిరేకంగా మాట్లాడితే.. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే లేనిపోని కేసులు బనాయించి... అరెస్టులు పేరిట వేధించే ప్రభుత్వం.. హత్య కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్నా అరెస్టు చేయకుండా అడ్డుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా వ్యవహరించే జగన్‌ ప్రభుత్వానిది చట్టబద్ధ పాలన ఎలా అవుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details