తెలంగాణ

telangana

చిన్న కేసులో 9 నెలల గర్భిణి జైలుకు.. విడుదల కాగానే ప్రసవం.. పండంటి బిడ్డకు జన్మనిచ్చి మరణం

By

Published : Jan 13, 2023, 3:09 PM IST

Updated : Jan 13, 2023, 3:26 PM IST

pregnant dead in odisha
గర్భిణీ మృతి

జైలు నుంచి విడుదలైన వెంటనే ఓ గర్భిణీకి పురిటినొప్పులు వచ్చాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అనంతరం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి మహిళ మరణించింది. ఈ హృదయవిదారక ఘటన ఒడిశాలో వెలుగుచూసింది.

ఒడిశా రాయగడలో దారుణం జరిగింది. జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే ఓ గర్భిణీ మరణించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే..
రాయగడకు చెందిన బైద్య నాయక్​, సులబతి నాయక్(30) భార్యభర్తలు. వీరికి 10 ఏళ్ల కుమార్తె ఉంది. బైద్య నాయక్​ వృత్తిరీత్యా రోజువారి కూలీ. సులబతి నాయక్​.. తొమ్మిది నెలల గర్భిణీ. గతేడాది డిసెంబరు 26న ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ జరిగిన నిరసనల్లో ఆమె పాల్గొంది. ఈ ఘటనలో పోలీసులు మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. అందులో సులబతి ఒకరు.

సులబతి నాయక్​ను రాయగడలోని జైలుకు తరలించారు పోలీసులు. 16 రోజుల శిక్ష అనంతరం బెయిల్​పై మంగళవారం విడుదలైంది. జైలు నుంచి విడుదలవ్వగానే సులబతికి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను హుటాహుటిన రాయగడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. బుధవారం రాత్రి ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం సులబతి ఆరోగ్యం విషమించడం వల్ల వైద్యులు.. ఆమెను కోరాపుట్​లోని ఎల్​ఎల్​ఎన్ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే గురువారం వేకువజామున సలబతి మరణించింది. ఆమెకు జన్మించిన శిశువు రాయగడలోని ప్రభుత్వాస్పత్రిలో శిశు సంరక్షణ యూనిట్​లో ఉన్నాడు.

'గతేడాది డిసెంబరు 26న నా భార్య ఒక కేసులో అరెస్ట్ అయ్యింది. జనవరి 2 బెయిల్​కు దరఖాస్తు చేశాం. అయితే రెండు వేర్వేరు పాత కేసుల్లో పోలీసులు ఆమెను రిమాండ్‌లో ఉంచారు. అందుకే బెయిల్ ఆలస్యమైంది. ఎట్టకేలకు జనవరి 10(మంగళవారం) బెయిల్ మంజూరైంది.'

--బైద్య నాయక్​ మృతురాలి భర్త

ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరాపుట్ కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి శంకర్​ ఉలక డిమాండ్ చేశారు. గర్భధారణ దశలో ఉన్న మహిళను.. హత్యా నేరం కింద పోలీసులు ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. గర్భిణీ జైలులో ఉన్న సమయంలో ఆమెకు సరైన వైద్యం అందలేదని ఆరోపించారు. మృతురాలి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ జోక్యం కోరుతామని ఎంపీ సప్తగిరి అన్నారు.

Last Updated :Jan 13, 2023, 3:26 PM IST

ABOUT THE AUTHOR

...view details