తెలంగాణ

telangana

మతం మారమని ఒత్తిడి.. 4వ అంతస్తు నుంచి పడి యువతి మృతి

By

Published : Nov 16, 2022, 1:16 PM IST

tired-of-molesting-teen-girl-committed-suicide-in-lucknow
tired-of-molesting-teen-girl-committed-suicide-in-lucknow

మతం మారమని తీవ్ర ఒత్తిడి చేసిన యువకుడి ఇంటికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ యవతి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. మరోవైపు వరకట్న వేధింపులతో ఓ మహిళను హింసించిన భర్త ఆమెకు ట్రిపుల్​ తలాక్​ ఇచ్చాడు.

క్లాస్​లోని ఓ యువకుడు తనను అల్లరి పెడుతూ, మతం మారాలంటూ వేధించగా.. తీవ్ర ఒత్తిడికి లోనైన ఓ యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలోని దుబగ్గాలో జరిగింది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గాయపడ్డ యువతిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. తన కూతుర్ని యువకుడి కుటుంబసభ్యులు చంపారని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. యువకుడి తండ్రి మాత్రం ఆమె నాలుగో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిందని చెప్పాడు.

పోలీసుల వివరాల ప్రకారం..లఖ్​నవూలోని ఓ స్కూల్​కు చెందిన సూఫియాన్​ అనే యువకుడు అదే పాఠశాలకు చెందిన ఓ యువతిని తరచూ అల్లరి పెట్టి వేధిస్తుండేవాడు. స్కూల్​లోనే కాకుండా బయట కూడా ఇదే తరహాలో చేసేవాడు. మతపరమైన విషయాలు చెబుతూ తనను వారి మతంలోకి మారమని ఒత్తిడి చేసేవాడు. ఇవన్నీ తట్టుకోలేని ఆ యువతి అతడిపై ఫిర్యాదు చేసేందుకు కుటుంబసభ్యులతో పాటు యువకుడి ఇంటికి చేరుకుంది. ఇరు కుటుంబాల మధ్య పరస్పర వాగ్వాదం జరుగుతున్న సమయంలో యువతి నాల్గవ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిందని యువకుడి తండ్రి చెప్పాడు. యువతి కుటుంబ సభ్యులు మాత్రం సూఫియాన్​తో పాటు అతడి తండ్రి కలిసి ఆమెను అక్కడి నుంచి నెట్టేశారని ఆరోపిస్తున్నారు.

లెటర్​ ద్వారా తలాక్​ చెప్పిన భర్త..
ఉత్తరాఖండ్​ దెహ్రాదూన్​లోని క్లెమెన్​టౌన్​ పరిధిలో ఓ త్రిపుల్​ తలాక్​ కేసు వెలుగులోకి వచ్చింది. పెళ్లయినప్పటి నుంచి ఆమెను తన భర్త వేధిస్తున్నాడని వాపోయిన బాధితురాలు అతడిపై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్తతో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. 2017 మార్చి 13న సదరు మహిళకు హిమాచల్​ ప్రదేశ్​లోని సిర్మోర్​ జిల్లా పవంటలో నివాసముంటున్న మహబూబ్​ అలీ అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఇవ్వాల్సిన కానుకలన్నింటినీ వధువు కుటుంబసభ్యులు అందించారు. అయితే కొంత కాలానికే ఆమెపై అత్తింటి వారి వరకట్న వేధింపులు మొదలయ్యాయని.. తరచూ భర్తతో పాటు అతని కుటుంబసభ్యులు కొట్టి వేధించేవారని బాధితురాలు ఫిర్యాదు చేసింది.

గర్భవతిగా ఉన్నప్పుడు భర్తతో పాటు అతని అన్నదమ్ములు బాధితురాలిని కొట్టగా.. ఆమెకు గర్భస్రావం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. అంతే కాకుండా కొద్ది రోజుల పాటు ఆమెకు ఆహారం కూడా ఇవ్వకుండా ఓ గదిలో నిర్బంధించారని తెలిపింది. 2022 ఫిబ్రవరి 8న ఇంటి నుంచి బయటకు పంపించిన భర్త మే 12న ఆమెకు ఓ ఉత్తరం ద్వారా ముమ్మారు​ తలాక్​ తెలిపాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనైన మహిళ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమ్రగ దర్యాప్తు చేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details