తెలంగాణ

telangana

గాంధీజీ, ఠాగూర్​ల మధ్య చిచ్చుపెట్టిన చరఖా!

By

Published : May 7, 2022, 5:45 AM IST

Updated : May 7, 2022, 6:30 AM IST

azadi ka amrith mahostsav
azadi ka amrith mahostsav ()

ఆయన 'మహాత్మా' అని పిలిస్తే.. ఈయనేమో 'గురుదేవ్‌' అంటూ బదులిచ్చేవారు! ఇలా ఒకరినొకరు ఎంతో గౌరవించుకునే, ఆత్మీయంగా అభిమానించుకునే ఆ ఇద్దరు..జాతీయోద్యమంలో అత్యంత కీలకమైన కొన్ని అంశాలపై తీవ్రంగా విభేదించుకున్నారు! వారే రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, మహాత్మాగాంధీ! ఒకరిపై ఒకరు బహిరంగంగానే వ్యాసాలు రాసుకున్నారు. వారిద్దరి మధ్య చిచ్చుకు కారణమైనవాటిలో ప్రధానమైంది చరఖా!

Azadi Ka Amrith Mahostsav Gandhi Charaka: జాతీయోద్యమ సారథ్య బాధ్యతలు చేపట్టి విదేశీ వస్త్రాల బహిష్కరణకు పిలుపునిచ్చిన గాంధీజీ చరఖాను ఆంగ్లేయ సామ్రాజ్యవాదంపై బలమైన భారతీయ అస్త్రంగా ఎంచుకున్నారు. బ్రిటిష్‌ యంత్రాలకు పోటీగా స్వదేశీ స్వావలంబన చిహ్నంగా దీన్ని భావించారు. అంతేగాకుండా.. చరఖాను స్వదేశీ మంత్రంగా, ఆర్థిక విప్లవ బీజంగా, గ్రామాల్లో పేదరిక నిర్మూలన సాధనంగా, వేడి నీళ్లకు చన్నీళ్ల తోడులాంటి ఆదాయంగా.. అన్నింటికీ మించి ఆత్మగౌరవ పతాకంగా చూశారాయన! దోపిడి లేని, ఒకరినొకరు గౌరవించుకునే స్వాభిమాన, స్వావలంబిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తీసుకురావటంలో చరఖా ప్రధాన పాత్ర పోషిస్తుందని గాంధీజీ నమ్మారు. అంతేగాకుండా.. నానాటికీ యంత్రాలకు బానిసలమైపోతున్న మనుషులను ఇది తట్టిలేపుతుందని భావించారు.

"చరఖాపై వడుకుతూనే ఊపిరి ఆగాలనేది నా కోరిక. నా దృష్టిలో ఇది స్వయం సహాయక సాధనం. శ్రమకు గౌరవం. మానవీయ విలువలకు దర్పణం. అమూర్తమైన అహింస భావనకు ఇది ప్రతిరూపం" అని నిర్వచించిన గాంధీజీ చరఖాపై తాను వడికిన ప్రతి పోగులోనూ దేవుడిని చూశారు. నిజానికి భారత్‌కు తిరిగి వచ్చేదాకా ఆయనకు చరఖాతో పరిచయం లేదు. 1917లో తొలిసారిగా సబర్మతి ఆశ్రమంలో గంగా బెన్‌ మజుందార్‌ అనే సామాజిక కార్యకర్త ఆయనకు చరఖాను పరిచయం చేశారు. మగన్‌లాల్‌ గాంధీ ద్వారా చరఖా తిప్పటం నేర్చుకున్న గాంధీజీ క్రమక్రమంగా అందులో నైపుణ్యం సాధించారు. ఎంతగా అంటే చరఖా చక్రంలో మార్పులు చేసి.. ఆశ్రమంలోనే దాన్ని తయారు చేయించేంతగా! అలా సబర్మతి ఆశ్రమంలో చరఖాను రోజువారీ విధుల్లో తప్పనిసరి చేశారు. ఎక్కడ ప్రసంగించినా చరఖా ప్రస్తావన తప్పకుండా ఉండేది. అందరినీ చరఖాపై నూలు వడికేందుకు ప్రోత్సహించేవారు. దీంతో దేశంలో ఎక్కడ చూసినా చరఖా మాటే వినిపించేది. కనిపించేది. జాతీయ కాంగ్రెస్‌ జెండా, స్వరాజ్య జెండాల్లోనూ చరఖాకు చోటు కల్పించారు.

ఇది విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌కు చికాకు తెప్పించింది. స్వరాజ్య సాధనకు అవసరమైన ఇతర కార్యక్రమాలు, చేపట్టాల్సిన ఉద్యమాల కంటే చరఖా ఆరాధన శ్రుతి మించుతోందని పించింది. దీనిపై ఆయన కలకత్తాకు చెందిన మాడర్న్‌ రివ్యూ పత్రికలో వ్యాసాలు రాశారు. 'అన్నీ పక్కకు పోయి.. చరఖాకు ఎక్కడలేని ప్రాధాన్యం ఇస్తున్నట్లు అనిపిస్తోంది. నిజంగా చరఖా అంత శక్తిమంతమైందా? కోట్ల మంది భారతీయులను భక్తులుగా మార్చగల దైవశక్తిగలదా? నూలు ఉండలోని దారమంతా పూర్తయినా విష్ణువు వరమివ్వడు.. ఆయన భార్య లక్ష్మి మనల్ని కరుణించదు. ఒకప్పుడు అందరినీ సంపన్నులుగా చేసిన ఈ చరఖా చప్పుడు.. ఇప్పుడు అభివృద్ధి దిశగా నడిపించబోదు. స్వరాజ్య ఉద్యమం నడవాలంటే బయటి చక్రాలు, చరఖాలు కాదు.. అంతర్‌ చరఖాలు తిరగాలి. మనసులు కలిసి కదలాలి. నా మనసైతే ఎందుకో ఈ చరఖాతో కదలటం లేదు' అంటూ గాంధీ పద్ధతిని ఠాగూర్‌ ప్రశ్నించారు. అసలు పనికంటే చిహ్నానికి ప్రాధాన్యం పెరుగుతోందన్నది ఆయన ఆవేదన.

చరఖా తిప్పడమంటే.. కొద్ది నెలల తర్వాత 1925 నవంబరులో గాంధీజీ తన పత్రిక యంగ్‌ ఇండియాలో ఠాగూర్‌కు బదులిచ్చారు. "కవులు తమదైన ఊహాలోకంలో విహరిస్తుంటారు. వారి మాటలను యథాతథంగా తీసుకుంటే వారికే కాదు, మనకు మనం కూడా హాని చేసుకున్నవారమవుతాం. కవి (ఠాగూర్‌) రాసిన వ్యాసంలో నేను మార్చుకోవాల్సినవి ఏమీ కనిపించలేదు. చరఖా గురించి ఎద్దేవా చేస్తూ ఆయన రాసిన మాటలేవీ నేనెన్నడూ అనలేదు. ప్రతి ఒక్కరూ చరఖా తిప్పండన్న నా పిలుపు బహుశా.. ప్రజలంతా తాము చేసే వృత్తులు, పనులు విడిచి పెట్టుకొని 24 గంటలూ చరఖానే తిప్పుతూ కూర్చోండని అన్నట్లుగా ఆయనకు అర్థమై ఉంటుంది. కానీ నేనెప్పుడూ అలా చెప్పలేదు. రోజులో ఓ అరగంట సేపు దేశం కోసం చరఖా తిప్పుతూ త్యాగం చేయమన్నానంతే! చరఖా తిప్పడమంటే మన పనిని గౌరవించు కుంటున్నామని అర్థం" అని గాంధీజీ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:జపాన్​ను చూసి గజగజలాడిన ఆంగ్లేయులు.. మద్రాసు పట్టణం ఖాళీ

Last Updated :May 7, 2022, 6:30 AM IST

ABOUT THE AUTHOR

...view details