తెలంగాణ

telangana

అనాథలకు అండగా అబ్దుల్​.. 500 మృతదేహాలకు అంత్యక్రియలు!.. సమాజానికి ఏదైనా చేయాలని..

By

Published : May 25, 2023, 12:12 PM IST

Abdul Qader

ప్రస్తుత సమాజంలో మానవత్వ విలువలు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. తోటి వారికి సహాయం చేయాలనేది మాటలకే పరిమితమైన ఈ రోజుల్లో.. ఎలాంటి సంబంధం లేని ఓ వ్యక్తి సామాజిక స్పృహతో తన మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ప్రమాదాల్లో గాయపడిన వ్యక్తులను ఆస్పత్రిలో చేర్పించడం.. వారి ఆర్థికంగా అండగా నిలబడుతున్నారు. అలాగే అనాథ మృతదేహాలకు అంత్యక్రియలను సైతం నిర్వహిస్తున్నారు. మరి ఆ వ్యక్తి ఎవరంటే..

ప్రస్తుత సాంకేతిక యుగంలో మనుషుల మధ్య సత్సంబంధాలు కనుమరుగవుతున్నాయి. సమాజం గురించి అటుంచితే.. ఇరుగు పొరుగు వారి ఆపద వచ్చినా కూడా స్పందించని ఈ ఆధునిక యుగంలో.. కర్ణాటకలోని హవేరికి చెందిన అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి ఎలాంటి లాభాపేక్షలేకుండా నిస్వార్థంగా సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. తన చుట్టు పక్కల ఎలాంటి ప్రమాదాలు జరిగినా వెంటనే స్పందించి క్షతగాత్రులకు తగిన సహకారాన్ని అందిస్తున్నారు.

రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి.. మృతదేహాలను మార్చురీకి తరలిస్తారు అబ్దుల్​ ఖాదర్. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేస్తారు. మృతదేహాలను వారి ఇళ్లకు చేర్చటమే కాకుండా.. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం హుబ్బళ్లిలోని దావణెగెరె ఆసుపత్రికి తీసుకెళ్తారు అబ్దుల్. ఈ క్రమంలో తన దృష్టికి వచ్చిన అనేక అనాథ మృతదేహాలను పోలీసు శాఖ సహాయంతో స్వయంగా అంత్యక్రియలు చేశారు అబ్జుల్​. గత తొమ్మిదేళ్ల కాలంలో అబ్దుల్ దాదాపు 500 మృతదేహాలకు స్వయంగా దహన సంస్కారాలు నిర్వహించారు.

ఆసుపత్రిలో రోగులతో ముచ్చటిస్తున్న అబ్దుల్ ఖాదర్

'అనారోగ్యం కారణంగా కొన్నాళ్ల క్రితం మా నాన్న గారిని హుబ్బళ్లిలోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించాం. సరైన వైద్యం అందక ఆయన మరణించారు. ఆ సమయంలో నేను చాలా బాధపడ్డా. అప్పటి నుంచి అనాథలకు, సమాజంలో తోటి వారికి వీలైనంత సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలో స్థానిక బస్​స్టాప్, రైల్వే స్టేషన్​ లాంటి బహిరంగ ప్రదేశాల్లో కనిపించిన మృతదేహాలను వారి ఇళ్లకు చేర్చినప్పుడు.. ఆయా కుటుంబ సభ్యులు చూపించే ప్రేమ వెలకట్టలేనిది'

--అబ్దుల్ ఖాదర్​

ఆర్థికంగా చేయూత:హవేరి జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులను అబ్దుల్ ఖాదర్ ఆర్థికంగా అండగా నిలబడతారు. ఎవరూ లేని వారికి తానున్నానంటూ ఆప్యాయంగా పలకరిస్తారు. ఆసుపత్రిలో చేరిన రోగుల పట్ల బంధువుగా నిలబడి.. వారికి ఆర్థిక సాయం చేయటంలో అబ్దుల్​ ముందుంటారు. ఆసుపత్రిలో చేరిన వారి పట్ల ఓ సోదరుడిలా రోజు అనాథ రోగుల వద్దకు వెళ్లి వారి ఆరోగ్యంపై ఆరా తీస్తారు. కరోనా మహమ్మారి సమయంలోనూ అబ్దుల్ తన సేవలను నిలిపివేయలేదు. మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వారి కుటుంబ సభ్యులు సైతం ముందుకు రాని అనేక సందర్భాల్లో ఆబ్దుల్ స్వయంగా దహన సంస్కారాలు నిర్వహించారు.

ఆసుపత్రిలో రోగులతో ముచ్చటిస్తున్న అబ్దుల్ ఖాదర్

కుల, మతాలకు అతీతంగా అబ్దుల్ ఖాదర్ చేస్తున్న సేవలను పలు స్వచ్ఛంద సంస్థలు గుర్తించి అవార్డులు ఇచ్చాయి. ఆబ్దుల్ తన రోజువారి కార్యక్రమాల్లో సేవలు అందించేందుకు కొంత సమయాన్ని కేటాయిస్తారు. జిల్లా ఆసుపత్రిలో ప్రతి రోజు రోగులకు సేవలందిస్తూ అబ్దుల్, పలువురి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details