Gandha Mahotsavam Celebrations in bara saheed dargah: నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగలో.. ప్రధాన ఘట్టమైన గంధమహోత్సవం ఈ రోజు వేడుకగా సాగింది. గంధ మహోత్సవాన్ని తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు పోటెత్తారు. నగరంలోని అన్నీ రోడ్లు కిలోమీటర్ల మేరకు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఐదు రోజులపాటు జరిగే రొట్టెల పండుగలో ఈ రోజు ప్రధానమైనది కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. నగరంలోని కోటమిట్ట అమీనియా మసీదు నుంచి 12 బిందెలలో గంధాన్ని బారాషహీద్ దర్గా వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. కడప పీఠాధిపతి ఆరీఫుల్లా హుసేని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి.. గంధాన్ని బారాషహీద్ సమాధులకు లేపనం చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన భక్తులు గంధాన్ని అందుకునేందుకు పోటీ పడ్డారు. ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.