Missing Woman Found Dead In Jonnawada: కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన మహిళ శవమై తేలింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ సమీపంలో జరిగింది. పెనుబల్లి గ్రామానికి చెందిన ప్రతిమ అనే ఓ మహిళ గత నెల 26 నుంచి కనపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జొన్నవాడ పెన్నా నది సమీపంలో మృతదేహం పూడ్చిన ఆనవాళ్లు ఉండటం గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మార్వో సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. సంఘటన స్థలంలో లభించిన చున్నీ ఆధారంగా.. దొరికిన మృతదేహం కనిపించకుండా పోయిన ప్రతిమదేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు ప్రతిమను హత్య చేసి మృతదేహాన్ని పూడ్చివేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. మొదట మహిళ మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. ఇప్పుడు హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు.