ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బ్యాంకునే బురిడీ కొట్టించిన గోల్డ్ అప్రైజర్- నాణ్యతలేని బంగారంతో 3 కోట్ల స్కాం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2023, 12:41 PM IST

fraud_in_sbi_bank

Fraud in SBI Bank in the Name of Gold Loan:వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఎస్బీఐ బ్యాంకులో ఘరానా మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఖాతాదారులతో కుమ్మకై తాను పనిచేస్తున్న ఎస్బీఐ బ్యాంకునే గోల్డ్ అప్రెజర్ చంద్రమోహన్ బురిడీ కొట్టించాడు. 39 మంది ఖాతాదారులతో బంగారు ఆభరణాలను ఎస్బీఐలో తనఖా పెట్టించి 3 కోట్ల 17లక్షల రూపాయలు రుణాలు ఇప్పించాడు. అవి నాణ్యతలేని బంగారం ఆభరణాలని తేలడంతో కడప ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ప్రొద్దుటూరు పోలీసులకు పిర్యాదు చేశారు. ప్రొద్దుటూరు పట్టణం ఆర్ట్స్ కాలేజీ రోడ్డుకు చెందిన చంద్రమోహన్ స్థానిక ఆరవేటి థియేటర్ సమీపంలోని ఎస్బీఐ బ్యాంకులో గోల్డ్ అప్రైజరుగా పనిచేస్తున్నాడు. ఖాతాదారులు రుణాల కోసం బ్యాంకులో తనఖా పెట్టే బంగారం ఆభరణాల నాణ్యతను అతను నిర్ధారించిన తరువాత అధికారులు రుణాలు మంజూరు చేస్తారు. 

ఈ క్రమంలోనే కొంతకాలం క్రితం 39 మంది ఖాతాదారులు బంగారం ఆభరణాలు తనఖా పెట్టి రూ.3.17 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ ఆభరణాలను చంద్రమోహన్ స్వయంగా పరిశీలించారు. కొన్నిరోజుల తరువాత లాకర్లో ఉన్న ఆభరణాలను పరీక్షించిన బ్యాంకు అధికారులు అవి నాణ్యత లేనివని గుర్తించారు. కొన్ని ఆభరాణాలకు బంగారం పూత పూసి వాటితో రుణం తీసుకున్నట్లు కనుకొన్నారు. బ్యాంకు గోల్డ్ అప్రైజర్ చంద్రమోహన్​కు తెలిసే ఈ వ్యవహారం జరిగిందని నిర్ధారించుకున్న బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గోల్డ్ అప్రైజర్ చంద్రమోహన్​తో పాటు 39 మంది ఖాతాదారులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు చంద్రమోహన్ పరారీలో ఉన్నాడు.

ABOUT THE AUTHOR

...view details