ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ysrcp leader murder case: ఆధిపత్యం కోసమే శ్రీనివాసుల రెడ్డి హత్య.. వైఎస్సార్సీపీ నేతల ప్రమేయం?

By

Published : Jun 25, 2023, 9:40 PM IST

ysrcp leader murder case: కడపలో వైఎస్సార్సీపీ నాయకుడు శ్రీనివాసుల రెడ్డి హత్య కేసులో నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. శ్రీనివాసులు రెడ్డిని హత్య చేసిన వారిలో అనుమానం ఉన్న ఐదుగురు వ్యక్తులపై ఆయన భార్య మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు ప్రతాపరెడ్డి తో సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరికొందరి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు.

ysrcp leader murder case in kadapa
హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

ysrcp leader murder case: ఈ నెల 23న కడపలో వైఎస్సార్సీపీ నాయకుడు శ్రీనివాసుల రెడ్డి హత్య కేసులో నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రధాన నిందితుడు ప్రతాపరెడ్డి తో సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరికొందరి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. కడపలో పట్టపగలు శ్రీనివాసులు రెడ్డిని హత్య చేయడం వెనక స్థానికంగా ఉన్న కొందరు వైఎస్సార్సీపీ నాయకుల ప్రమేయంపై పోలీసుల ఆరా తీస్తున్నారు. 15 రోజుల నుంచి శ్రీనివాసులు రెడ్డి హత్యకు ఓ పెట్రోల్ బంకులో ప్రణాళిక రచించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. భూ దందాలు సెటిల్మెంట్లు చేస్తున్న శ్రీనివాసులు రెడ్డిని ఆధిపత్యం కోసం అంతమొందించారనే ప్రచారం సాగుతుంది. ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి హత్య కేసులో పెట్రోల్ బంక్ యజమాని వైఎస్సార్సీపీ నాయకుడు రామ్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అతని విచారించడానికి వెళ్లిన పోలీసులకు ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడి రావడంతో వెనుతిరిగినట్లు తెలుస్తోంది.

అనుమానితులపై శ్రీనివాస్ రెడ్డి భార్య ఫిర్యాదు..శ్రీనివాసులు రెడ్డిని హత్య చేసిన వారిలో అనుమానం ఉన్న ఐదుగురు వ్యక్తులపై ఆయన భార్య మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాలంపల్లె సుబ్బారెడ్డి, ప్రతాపరెడ్డి విశ్వనాథరెడ్డి, జమీల్, నాగేంద్ర అనే వ్యక్తులు హత్య చేసి ఉండొచ్చని మౌనిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో కుట్ర పన్నిన వైఎస్సార్సీపీ నాయకుడు రామ్మోహన్ రెడ్డి పై పోలీసులు కీలక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్య జరిగిన తర్వాత రిమ్స్ పోస్టుమార్టం ప్రాంతానికి కూడా రామ్మోహన్ రెడ్డి వచ్చాడు. ఆయన కదలికలపై దృష్టి పెట్టిన పోలీసులు అతని పాత్ర పైన కూడా ఆరాతీస్తున్నట్లు సమాచారం. రేపు నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

బుర్ఖా ధరించి... కడపలో ఈ నెల 23న జిమ్ చేసుకొని ఇంటికి వెళ్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్త శ్రీనివాస్ రెడ్డిపై గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. బుర్ఖా ధరించి వచ్చిన నిందితులు కత్తులతో దాడి చేయడంతో శ్రీనివాస్ రెడ్డి అక్కిడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు హూటహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామం వల్లూరు మండలం చిన్న నాగిరెడ్డిపల్లె. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డికి అదే పార్టీకి చెందిన మరో వర్గంతో విభేదాలున్నాయి. భూ తగాదాలు మనసులో పెట్టుకున్న ప్రత్యర్థి వర్గం.. శ్రీనివాస్ రెడ్డిని అంతమొందించడానికి ఎదురు చూసింది. ఈ నెల 23న ఉదయం కడప సంధ్య కూడలి వద్ద వ్యాయామం ముగించుకుని వెళ్తున్న క్రమంలో వ్యక్తులు బుర్ఖా ధరించి, కత్తులతో అతడిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడు ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి ప్రధాన అనుచరుడు. దీంతో ఆయన ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details