ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CPI RK 'అర్జీ లేదు... ప్రెస్​మీట్ లేదు... అఖిలపక్ష భేటీల్లేవు.. ఇలాంటి సీఎంను ఎక్కడా చూడలేదు'

By

Published : Apr 30, 2023, 4:23 PM IST

CPI State Secretary Ramakrishna : బెయిల్ మీద ఉన్న జగన్ భవిష్యత్ ఆయనకే తెలియదు కానీ.. జగనన్న మా నమ్మకం అని ఇంటింటికీ స్టిక్కర్లు వేయడమేంటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు, విభజన హామీలపై.. ఈ రోజు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినా రావడానికి తాము సిద్ధం అని తెలిపారు. స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం మే 3 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహిస్తున్నామని మీడియా సమావేశంలో వెల్లడించారు.

Cpi Ramakrishna
Cpi Ramakrishna

CPI State Secretary Ramakrishna : స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం మే 3 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. విశాఖలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉక్కు పరిరక్షణ పోరాటం నేటికి 808 రోజుకు చేరుకుందని వెల్లడించారు. ప్రైవేటు ఉక్కు పరిశ్రమలకు ఐరన్ ఓర్ మైన్స్ కేటాయిస్తున్నపుడు.. ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వడానికి అడ్డంకులు ఏమిటని రామకృష్ణ ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు వర్కింగ్ కేపిటల్, కేపిటివ్ మైన్స్ ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని అన్నారు. స్టీల్ ప్లాంట్ ఇప్పటి వరకూ 50 వేల కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో ప్రభుత్వానికి చెల్లించిందని తెలిపారు. 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన స్టీల్ ప్లాంట్.. ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఇంటికి రాను.. ఆఫీసుకు పోను అన్నట్లుగా... మే 9 నుంచి "జగనన్న కు చెపుదాం" అనే కొత్త కార్యక్రమాన్ని పెట్టబోతున్నారని, ప్రజలను ఇంటికి రానివ్వను, తాను ఆఫీస్ కు పోను అనే ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని రామకృష్ణ విమర్శించారు. ఇప్పటి వరకూ ఒక అర్జీ తీసుకున్నది లేదు... మీడియా సమావేశం పెట్టలేదు... అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసిన దాఖలాల్లేవని అన్నారు. చెప్పడానికి అవకాశమే ఇవ్వకపోతే ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. జగనన్న మా నమ్మకం అని స్టిక్కర్లు అంటిస్తున్నారని, నీ భవిష్యత్తు ఏంటో నీకే తెలీదు.‌.. బెయిల్ మీద వున్నావు... అది రద్దయితే ఏ క్షణంలో ఎక్కడ వుంటావో తెలీదని ముఖ్యమంత్రిని ఉద్దేశించి విమర్శించారు.

సమావేశానికి సిద్ధం... విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు, విభజన హామీలపై.. ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినా తాము వస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు. మోదీ క్లారిటీతో ఉన్నారని, ఉక్కు ఫ్యాక్టరీ, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తామన్నారని చెప్పారని తెలిపారు. చంద్రబాబు నాయుడు మోదీ విధానాలని వ్యతిరేకించక తప్పదని రామకృష్ణ పేర్కొన్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి పాలైతే రాజకీయాల్లో మార్పులు తథ్యం అని చెప్పారు. అదానీ డేటా సెంటర్ కు చంద్రబాబు ఒక సారి శంకుస్థాపన చేశాక మళ్లీ నాలుగేళ్ల తర్వాత జగన్ శంకుస్థాపన చేయడం ఎన్నికల ఎత్తుగడ అని విమర్శించారు.

శంకుస్థాపనలు కాదు.. ప్రారంభోత్సవాలు చేయాలి... కడప స్టీల్ ప్లాంట్ కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకసారి, చంద్రబాబు ఒక సారి, జగన్ రెండుసార్లు శంకుస్థాపన చేశారని.. శంకుస్థాపనలు చేయడం కాదు.. ప్రారంభోత్సవాలు చేయాలని సూచించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం కాదని ఎద్దేవా చేశారు. విశాఖ ‌నుంచి జగన్ పాలన సాగిస్తానంటే ప్రజలు అంగీకరించడం లేదని, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీని చిత్తుగా ఓడించారని చెప్పారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details