ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రైల్వే జోన్‌పై కేంద్రం దాటవేత.. గడువు చెప్పలేమంటూ ప్రకటన

By

Published : Jul 26, 2022, 8:38 AM IST

railway zone
railway zone

RAILWAY ZONE: రైల్వే జోన్‌ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం దాటవేత ధోరణిని అవలంబిస్తోంది. ఒకవైపు దక్షిణ కోస్తా రైల్వేజోన్‌, రాయగడ డివిజన్‌ల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని చెబుతూనే పార్లమెంటు వేదికగా ఈ రెండింటిపై ఇచ్చిన హామీలను పక్కనపెట్టాలని అస్యూరెన్సెస్‌ కమిటీని కోరడం కొత్త అనుమానాలకు తావిస్తోంది.

RAILWAY ZONE: రైల్వే జోన్‌ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం దాటవేత ధోరణిని అవలంబిస్తోంది. ఒకవైపు దక్షిణ కోస్తా రైల్వేజోన్‌, రాయగడ డివిజన్‌ల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని చెబుతూనే పార్లమెంటు వేదికగా ఈ రెండింటిపై ఇచ్చిన హామీలను పక్కనపెట్టాలని అస్యూరెన్సెస్‌ కమిటీని కోరడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుపై 2020 మార్చి 18న లోక్‌సభలో తెదేపా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, వైకాపా ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, 2021 మార్చి 24న తెదేపా ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నలకు అప్పటి రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ సమాధానమిస్తూ... ‘విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌, రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ఓఎస్‌డీ, తూర్పుకోస్తా రైల్వేలు సమర్పించాయి.

ప్రస్తుతం అవి రైల్వేబోర్డు కార్యాలయ పరిశీలనలో ఉన్నాయి. ఈ రెండింటి ఏర్పాటు అంశాన్ని రూ.170 కోట్ల అంచనాతో 2020-21 బడ్జెట్‌లో చేర్చాం’ అని పేర్కొన్నారు. కొత్త జోన్ల ఏర్పాటువల్ల రైల్వే కార్యకలాపాల నిర్వహణ, సామర్థ్యం ప్రభావితం అవుతుంది కాబట్టి అదనపు వనరులు అవసరమని, అందువల్ల డీపీఆర్‌ను పరిశీలిస్తున్నామని చెప్పారు. వాస్తవానికి సభాముఖంగా ఇచ్చిన హామీలను ఆయా మంత్రిత్వశాఖలు 3 నెలల్లోపు అమలు చేయాలి. ఇందులో ఉన్న సంక్లిష్టతలవల్ల అది సాధ్యం కాలేదు కాబట్టి ఆ హామీని పక్కనపెట్టాలని రైల్వేశాఖ కోరింది.

‘దక్షిణకోస్తా రైల్వే, రాయగడ డివిజన్‌ ఏర్పాటులో ముందుకే వెళ్లాలన్న ఉద్దేశంతో ఉన్నాం. కొత్త రైల్వేజోన్‌ ఏర్పాటు ప్రక్రియకు సుదీర్ఘకాలం పడుతుంది. వందలాది మంది సిబ్బంది, అధికారుల బదిలీలు దీనితో ముడిపడి ఉన్నాయి. కరోనా పరిస్థితుల్లో మరింత ఆలస్యం అవుతుంది. గతంలో జోన్‌ల పునర్విభజన ప్రకటించిన నాటినుంచి తుది నోటిఫికేషన్‌ జారీకి ఆరేళ్లు పట్టింది. దీనిని బట్టి కొత్త జోన్‌లు, డివిజన్ల ఏర్పాటు ప్రక్రియకు సమయం పడుతుంది. రైల్వే పనితీరుపై ప్రభావం చూపే వివిధ అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. జోన్‌, డివిజన్‌ ఏర్పాటుకు నిర్దిష్ట గడువును నిర్దేశించలేం. ఈ నేపథ్యంలో మంత్రి సభాముఖంగా ఇచ్చిన మూడు హామీలను పక్కనపెట్టండి’ అని విజ్ఞప్తి చేసింది. రైల్వేశాఖ విజ్ఞప్తిని పరిశీలించిన అస్యూరెన్సెస్‌ కమిటీ ఆ హామీలను పక్కనపెట్టడానికి నిరాకరిస్తున్నట్లు తాజాగా పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details