ETV Bharat / state

సీఎం రాకతోనైనా.. వారి నరకయాతనకు అడ్డుపడేనా? వంతెన కల తీరేనా..?

author img

By

Published : Jul 26, 2022, 4:16 AM IST

Pedapudi Bridge
Pedapudi Bridge

గంటి పెదపూడి పంచాయతీ..! ఏటా జులై, ఆగస్టు వచ్చిందంటే..ఈ పంచాయతీ పరిధిలోని గ్రామాల ప్రజలు గోదావరి వరదలో చిక్కుకుపోతారు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి..నరకయాతన అనుభవిస్తారు. దశాబ్దాలుగా వెంటాడుతున్న ఈ సమస్యకు... ఓ వంతెన నిర్మిస్తే కొంతమేర పరిష్కారం చూపొచ్చు. అనేక కారణాల వల్ల వారి కల నెరవేరడం లేదు. ముఖ్యమంత్రి జగన్‌ నేడు ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్భంగా... సమస్య చెప్పుకోవాలని అక్కడి ప్రజలు వేయికళ్లతో వేచిచూస్తున్నారు. వంతెన నిర్మాణంపై స్పష్టమైన హామీ వస్తుందని ఆశిస్తున్నారు.

Pedapudi Bridge: కోనసీమ జిల్లాలోని గంటి పెదపూడి పంచాయతీ పరిధిలో గ్రామాలతో పాటు... చుట్టుపక్కల ఊళ్లను దశాబ్దాలుగా వరద కష్టాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా.. గంటి పెదపూడి పంచాయతీ పరిధిలోని అరిగెలవారిపేట, జి.పెదపూడిలంక, బూరుగులంకతో పాటు.. ఉడిముడి పంచాయతీలోని ఉడిముడిలంక గ్రామాలు.. జులై, ఆగస్టు నెలల్లో జలదిగ్బంధమైపోతాయి. గోదావరి నది పాయ చుట్టూ ఉండే ఈ గ్రామాలకు... వరద మిగిల్చే కష్టాలు అన్నీఇన్నీకావు. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి.. కనీస అవసరాలకూ నానా అవస్థలు పడుతుంటారు.

గోదావరి ఉగ్రరూపానికి.. జులైలో గోదావరి ఉగ్ర రూపానికి గంటిపెదపూడి పంచాయతీ పరిధిలోని గ్రామాలన్నీ అతలాకుతలమైపోయాయి. ఏ చిన్న అవసరమొచ్చినా ఇక్కడి ప్రజలు నావలపై ప్రమాదకర ప్రయాణాలు చేస్తూ బతుకీడుస్తున్నారు. గోదావరి పాయపై వంతెన నిర్మిస్తే తమ కష్టాలన్నీ తొలగిపోతాయని.. ఏళ్లుగా పాలకులు, అధికారులను కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

ఎదురుచూస్తున్న ప్రజలు.. ఇటీవలి గోదావరి వరదల కారణంగా భారీ నష్టం సంభవించిన గంటి పెదపూడి పంచాయతీతో పాటు.. చుట్టుపక్క ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్‌ నేడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తమ సమస్యను ముఖ్యమంత్రికి విన్నవించుకోవాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. తమకు వంతెన నిర్మిస్తే చాలని... ఇంకేమీ అక్కర్లేదని చెబుతున్నారు.

'త్వరలోనే పూర్తి చేస్తాం'.. త్వరలోనే టెండర్ల ప్రక్రియను మళ్లీ చేపట్టి.. వంతెన నిర్మాణాన్ని పూర్తిచేస్తామని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. వచ్చే ఎన్నికలలోపే.. వంతెనను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

50 కోట్లు మంజూరు అయినా..? 2018లో వంతెన నిర్మాణం కోసం..50 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. 2020-21లో రెండుసార్లు వంతెన నిర్మాణం కోసం టెండర్లు పిలిచారు కానీ గుత్తేదార్లు ముందుకురాలేదు. ఇలా వివిధ కారణాలతో వంతెన నిర్మాణం జాప్యమవుతూ వస్తోంది. ఈసారి ముఖ్యమంత్రి పర్యటన వేళ తమ వంతెన కల సాకారం అవుతుందని స్థానికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్ర రాబడిని మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.