ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైఎస్సార్​సీపీ హయాంలో ముస్లింలకు అన్యాయం జరిగింది: లోకేశ్‌

By

Published : Feb 21, 2023, 2:05 PM IST

NARA LOKESH YUVAGALAM : వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చాక.. మైనారిటీ కార్పొరేషన్‌లను తీసేశారని, ఇస్లామిక్ బ్యాంకులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ​మండిపడ్డారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 23వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభించారు.

NARA LOKESH YUVAGALAM
NARA LOKESH YUVAGALAM

వైసీపీ హయాంలో ముస్లింలకు అన్యాయం జరిగింది

NARA LOKESH YUVAGALAM : వైఎస్సార్సీపీ హయాంలో ముస్లింలకు అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‍ ఆరోపించారు. నందమూరి తారకరత్న మరణించిన నేపథ్యంలో పాదయాత్రకు విరామం ప్రకటించిన లోకేశ్​.. రెండు రోజుల తర్వాత శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 23వ రోజు యువగళం పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా మైనారిటీ నాయకులతో లోకేశ్​ ముఖాముఖి నిర్వహించారు. మైనారిటీల్లో పేదరికాన్ని గుర్తించిన ఎన్టీఆర్.. మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.

జగన్‍ మోహన్​ రెడ్డి అధికారంలోకి వచ్చాక మైనారిటీ కార్పొరేషన్ తీసేశారని ఆరోపించారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే తిరుపతి పార్లమెంట్​లో మహిళలకు రెసిడెన్షియల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని విమర్శించిన లోకేశ్​.. ముస్లింల కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు. టీడీపీ హయాంలో మైనారిటీలకు అందించిన సాయాన్ని వివరించారు.

"స్వర్గీయ నందమూరి తారకరామారావు రాష్ట్రంలో మైనార్టీల కార్పొరేషన్​ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2019 వరకూ ఎన్ని ప్రభుత్వాలు మారినా కార్పొరేషన్ల ద్వారా మైనార్టీలను ఆదుకున్నారు. కానీ వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు అన్యాయం చేశారు. జగన్​ పాదయాత్ర సమయంలో ఇస్లామిక్​ బ్యాంక్​ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకూ దానిని అమలుచేయలేదు"-నారా లోకేశ్​

తమ పార్టీ ఆలోచన ఒక్కటేనని.. మైనారిటీ సోదరులకు ఏపీఐఐసీ ఇండస్ట్రీయల్‍ క్లస్టర్​లో స్థానం కల్పించి.. మైనారిటీలే ఉద్యోగాలు కల్పించేలా విధానాలు రూపొందిస్తామన్నారు. వైఎస్సార్సీపీ హయంలో ముస్లింలపై దాడులు పెరిగాయని.. భయంతో బతకాల్సిన పరిస్ధితి ఏర్పడిందన్నారు. ముస్లింల రిజర్వేషన్ల కోసం అధికార పార్టీ పోరాడకుంటే సొంత నిధులు ఖర్చు పెట్టి తాము పోరాడుతున్నామని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే ముస్లింలకు ఇచ్చిన హామీలు మూడేళ్లలోపే అమలు చేస్తామని ప్రకటించారు.

నారా లోకేశ్​ యువగళం పాదయాత్ర @ 300 కిలో మీటర్లు: నారా లోకేశ్​ యువగళం పాదయాత్ర.. 300 కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొండమనాడులో 300 కిలోమీటర్ల పాదయాత్రను లోకేశ్​ పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శిలాఫలకాన్ని లోకేశ్​ ఆవిష్కరించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 6 నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర సాగింది. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో వంద కిలోమీటర్లు పూర్తి కాగా.. గంగాధర నెల్లూరు నియోజకవర్గం కత్రిపల్లెలో 200 కి.మీటర్లు పూర్తి చేసిన లోకేశ్‌.. తాజాగా తొండమనాడులో 300 కిలో మీటర్లు పూర్తి చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details