CHANDRABABU FIRES ON CM JAGAN : ప్రకాశం జిల్లాలో శ్మశాన స్థలంపై వైకాపా పిశాచాలు పడ్డాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. స్థానిక వైసీపీ నేతలు సమాధులను తవ్వేసి స్మశానాన్ని కబ్జా చేస్తే.. అధికారులంతా ఏం చేస్తున్నారని నిలదీశారు. వ్యవస్థలు సమాధి అయిన చోట వచ్చే ఫలితాలు ఇలాగే ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఉన్నతాధికారులైనా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలన్నారు. "ఇదేం ఖర్మ" మన రాష్ట్రానికి అని ఆక్షేపించారు.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. రివర్స్ రెడ్డి: మొక్కలు నాటడం నేర్పాల్సిన పాలకులు.. చెట్లు నరికెయ్యమని సందేశం పంపుతున్నారా అని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రివర్స్ పాలన అంటే ఇదేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. రివర్స్ రెడ్డిలా మారరని దుయ్యబట్టారు. ప్రజాప్రతినిధులు పర్యటనల్లో మొక్కలు నాటడం ఇన్నాళ్లూ చూశామన్న చంద్రబాబు.. సీఎం వస్తున్నారని భారీ వృక్షాలను.. అందునా ఏ మాత్రం అడ్డుగాలేని చెట్లను నరికి వేయడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పశ్చిమగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా నర్సాపురం ప్రాంతీయ ఆస్పత్రి ముందు ఉన్న చెట్లను నరికివేయడం పై స్పందించిన చంద్రబాబు.. 'ఇదేమి ఖర్మ- రాష్ట్రానికి' అంటూ ఆక్షేపించారు.
సీమద్రోహులు ఎవరూ: పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఎలా ఉంటాయో మన రాష్ట్రమే ఉదాహరణ అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాయలసీమలో నాడు మేము తెచ్చిన పరిశ్రమలు నేడు ఎందుకు వెళ్లిపోయాయని ప్రశ్నించారు. పెట్టుబడులను తరిమేసింది ఎవరు? సీమ ద్రోహులు ఎవరు? సీమకు పరిశ్రమలు తెచ్చిన మేమా.. లేక కాసులకు కక్కుర్తి పడి కంపెనీలను వెళ్లగొట్టిన మీరా? అని నిలదీశారు.
నడిరోడ్డుపై మహిళ ప్రసవం గుండెను కలచివేసింది: తిరుపతి ఘటనతో హృదయం చలించిపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నడిరోడ్డుపై మహిళ ప్రసవం గుండెను కలచివేసిందన్నారు. తోడుగా సహాయకులు లేరని పురిటి నొప్పులతో వచ్చిన మహిళలను ప్రసూతి ఆసుపత్రి సిబ్బంది చేర్చుకోకపోవడం దారుణం అని మండిపడ్డారు. స్థానికులు దుప్పట్లు అడ్డుపెట్టి ప్రసవం చేయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు.
జగన్ ప్రజారోగ్య ప్రచారంపై మండిపడ్డ నారా లోకేశ్: జగన్ రెడ్డి ప్రచారమేమో ప్రజారోగ్య దేవుడు అంటుంటే వాస్తవమేమో ప్రజల పాలిట యముడు అన్నట్లు ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఆపదలో వచ్చిన వారిని సూదీ, దూది లేని ఆస్పత్రులు వెక్కిరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. నిన్న తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో గర్భిణిని చేర్చుకోకపోవడంతో నడిరోడ్డుపై ప్రసవించిందన్నారు. నేడు కుప్పంలో బాలింత, కవలలో ఒకరు వైద్యం అందక చనిపోయారని మండిపడ్డారు. సాక్షి పత్రిక ఫస్ట్ పేజీలో కోటి రూపాయల ప్రకటనలో కనిపించిన ప్రజారోగ్య దేవుడు.. ఎక్కడా కనిపించడేమని ప్రశ్నించారు. ఇలా అయితే ప్రజల ప్రాణాలకు భరోసా ఎలా అని నిలదీశారు.
ఇవీ చదవండి: