Ministers committee meeting with Employees Unions : మంత్రుల కమిటీ సభ్యులు బొత్స సత్యనారాయణ, సలహాదారు సజ్జలతో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. అనంతరం ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి... సమావేశానికి సంబంధించి పలు విషయాలను మీడియాకు వెల్లడించారు. వాటిలో ప్రధానంగా పదేళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగుల రెగ్యులర్ అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం.. 13 వేల మందిని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిందని, పెండింగ్ డీఏల చెల్లింపు, సీపీఎస్పై ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల బదిలీలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
హామీలు ప్రకటించిన కమిటీ..: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో 94 ఆర్థిక, ఆర్ధికేతర అంశాలను ప్రభుత్వానికి ఇచ్చామని.., వాటిలో 24 మాత్రమే పరిష్కృతం అయ్యాయని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి తెలిపారు. మంత్రుల కమిటీ సభ్యులు బొత్స సత్యనారాయణ, సలహాదారు సజ్జలతో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. 10 ఏళ్ల సర్వీసు దాటిన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని వెల్లడించారు. 13 వేల మందిని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు.
ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత..: రెండు డీఏలు పెండింగ్లో ఉన్నాయని.. ఎన్నికల కోడ్ ముగిశాక ఒక డీఏ ఇస్తామని కమిటీ తెలిపిందని తెలిపారు. సీపీఎస్పై కూడా త్వరలోనే నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. సీపీఎస్ ఉద్యోగులపై నమోదు చేసిన 1,600 కేసులను కూడా మాఫీ చేసేందుకు కమిటీ అంగీకారం తెలిపిందని చెప్పారు. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల బదిలీలపైనా అంగీకారం తెలియజేశారన్నారు. వారికి సర్వీస్ రూల్స్, జాబ్ ఛార్ట్ సిద్ధం చేస్తామని హామీనిచ్చారన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరామని వివరించారు. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని.. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం భూ కేటాయింపులు చేస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు.