ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఈ నెలాఖరులోగా తెలంగాణకు కొత్త పోలీస్​బాస్​ వచ్చేనా??

By

Published : Dec 14, 2022, 10:23 AM IST

NEXT DGP IN TELANGANA: నెలాఖరులోగా తెలంగాణకి కొత్త పోలీస్‌ బాస్‌ వస్తారా అన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుత డీజీపీ మహేందర్‌ రెడ్డి నెలాఖరుతో పదవీ విరమణ చేయనుండగా.. కొత్త వారి ఎంపిక ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభంకాలేదు. ఎంపిక పూర్తి కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మొదట ఇంఛార్జ్‌ డీజీపీని నియమించి.. ఆ తర్వాత పూర్తి స్థాయిలో నియమించే అవకాశం ఉంది.

NEXT DGP IN TELANGANA
NEXT DGP IN TELANGANA

NEXT DGP IN TELANGANA: తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ - డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహేందర్ రెడ్డి పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ మేరకు గతంలోనే.. సాధారణ పరిపాలనా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2018 ఏప్రిల్ నుంచి నాలుగేళ్లకు పైగా.. మహేందర్‌రెడ్డి డీజీపీగా బాధ్యతల్లో ఉన్నారు. నెలాఖరున పదవీ విరమణ చేయనున్న తరుణంలో తదుపరి పోలీస్ బాస్ ఎవరన్నది చర్చనీయాంశమైంది. ఐపీఎస్​గా కనీసం 30 ఏళ్లు సర్వీసు ఉన్న డైరెక్టర్‌ జనరల్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న వారికి డీజీపీలుగా అవకాశం ఉంటుంది.

ఈ నెలాఖరులోగా తెలంగాణకు కొత్త పోలీస్​బాస్​ వచ్చేనా??

మూడు పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు: వారి జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పంపితే.. అన్ని అంశాలను పరిశీలించి అందులో మూడు పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు. ముగ్గురిలో ఒకరిని డీజీపీగా నియమించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్రంలో డీజీపీ పోస్టుకు.. ప్రస్తుతం ఆరుగురు అధికారులు అర్హులుగా ఉన్నారు. 1989 బ్యాచ్ కు చెందిన ఉమేష్‌షరాఫ్, 1990 బ్యాచ్ కు చెందిన రవిగుప్తా, అంజనీకుమార్ డీజీ హోదాలో ఉన్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్, రాజీవ్‌రతన్.. 1992 బ్యాచ్ కు చెందిన జితేందర్ అదనపు డీజీ హోదాలో ఉన్నారు.

కొత్త డీజీపీ ఎంపికకు తొలుత రాష్ట్రప్రభుత్వం నుంచి ప్యానల్ జాబితా యూపీఎస్సీకి వెళ్లాల్సి ఉంది. సంప్రదాయం ప్రకారం చూస్తే ఆ ప్రక్రియ గడువుకు మూడ్నాలుగు నెలల ముందు నుంచే.. ప్రారంభం అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి యూపీఎస్సీకి ప్రతిపాదనలు వెళ్లలేదు. ముఖ్యమంత్రి ఆదేశాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

నెలాఖరులోగా పూర్తవుతుందా అన్న అంశంపై భిన్నవాదనలు: సీఎం ఆదేశిస్తే ఆ తర్వాత సదరు అధికారుల బయోడేటా, వివరాలు క్రోడీకరించి యూపీఎస్సీకి పంపాల్సి ఉంటుంది. కమిషన్ వాటిని క్షుణ్నంగా పరిశీలించి ముగ్గురిపేర్లను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది. అవసరమైతే అదనపు సమాచారం, వివరాలను అడిగే అవకాశం ఉంటుంది. యూపీఎస్సీ నుంచి వచ్చిన మూడుపేర్లలో ఒకరిని డీజీపీగా రాష్ట్రప్రభుత్వం నియమిస్తుంది. ఆ కసరత్తు పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉండగా ఆ ప్రక్రియ నెలాఖరులోగా పూర్తవుతుందా అన్న అంశంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

ఈసారి అదే విధానంలో జరుగుతుందా:గడువులోగా కొత్త డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి కాకపోతే.. ఇంఛార్జ్ డీజీపీని రాష్ట్ర ప్రభుత్వం నియమించుకోవచ్చు. ఆ తర్వాత పూర్తి స్థాయి డీజీపీ నియామక ప్రక్రియ చేపట్టవచ్చు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి డీజీపీగా పనిచేసిన అనురాగ్‌శర్మతోపాటు.. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డిని తొలుత అదే పద్ధతిలో ఇంఛార్జ్ డీజీపీగా.. పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో నియమించారు. ఆ తర్వాత పూర్తి స్థాయి డీజీపీగా నియమించారు. ఈసారి అదే విధానంలో జరుగుతుందా అనే అంశంపై చర్చసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆసక్తి ఉంటే ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలాన్ని గరిష్ఠంగా 6నెలల వరకు పొడగించుకోవచ్చు. అయితే ఆ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వాల్సి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details