ETV Bharat / state

అవినీతికి దూరంగా ఉండండి.. మంత్రులకు సీఎం ఆదేశాలు..

author img

By

Published : Dec 14, 2022, 8:34 AM IST

Cm Meeting With Ministers : మంత్రులెవరూ అవినీతికి పాల్పడొద్దని ముఖ్యమంత్రి జగన్ హెచ్చరించినట్టు తెలిసింది. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం కొద్దిసేపు మంత్రులతో మాట్లాడిన సీఎం ప్రస్తుతం మీడియా కళ్లన్నీ వైసీపీ ప్రభుత్వంపైనే ఉన్నాయని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరో 16నెలల్లో ఎన్నికలు రానున్న దృష్ట్యా.. జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. ఐతే అందరినీ ఒకేగాటగట్టడంపై కొందరు అమాత్యులు అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం.

Cm Meeting With Ministers
సీఎం మంత్రులతో సమావేశం

అవినీతి ఆరోపణల్లో చిక్కుకోకండని మంత్రులకు సూచించిన సీఎం జగన్​

Cm Meeting With Ministers : సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత అమాత్యులతో కొద్దిసేపు సీఎం మాట్లాడారు. అవినీతికి ఎవరూ పాల్పడొద్దని మంత్రులకు సీఎం జగన్‌ స్పష్టంగా హెచ్చరికలు చేసినట్లు సమాచారం. ఎన్నికలకు ఇంకా 16 నెలలు మాత్రమే ఉన్నందున.. అందరి దృష్టి వైసీపీ ప్రభుత్వంపైనే ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి మీడియా కళ్లన్నీ ప్రభుత్వంపై ఉన్నాయని.. గమనించాలని సూచించినట్టు సమాచారం. ఏ చిన్న పొరపాటు చేసినా మీడియాదానిపైనే దృష్టిపెట్టి కథనాలు ప్రచురిస్తుందని జగన్‌ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వార్తల ప్రభావం ఎన్నికలపై ఎక్కువ ఉంటుందని పేర్కొన్నట్టు సమాచారం. ఇప్పటి వరకూ బటన్ నొక్కి అవినీతికి తావులేకుండా పథకాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎట్టిపరిస్థితుల్లోనూ అవినీతి ఆరోపణల్లో ఇరుక్కోవద్దని జగన్ సూచించినట్టు సమాచారం. మంత్రులు ఇంఛార్జ్‌లుగా ఉన్న జిల్లాల్లోనూ గడగడపకూ కార్యక్రమాన్ని సమన్వయం చేసుకోవాలని.. పార్టీ నేతల మధ్య విభేదాలను సరిదిద్దాలని సూచించారు.

ఈ నెల 21న 8వ తరగతి విద్యార్ధులకు ఇచ్చేట్యాబ్‌లను మంత్రులు కూడా పంపిణీ చేయాలని ఆదేశించారు. మంత్రుల చేతుల ద్వారానే అన్ని సంక్షేమ పథకాలూ.. అందేలా ప్రణాళికలు చేస్తున్నట్టు సీఎం వివరించినట్టు సమాచారం. ఇప్పటి వరకూ.. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అందుతున్నపథకాలు ఇకపై మంత్రులు, ప్రజాప్రతినిధుల ద్వారా అందించేలా చూస్తామని సమావేశంలో చెప్పినట్టు తెలుస్తోంది.

మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత.. బయటకు వచ్చిన కొందరు మంత్రులు వారిలో వారు మాట్లాడుకుంటూ అవినీతిపై అందరినీ ఒకేగాటనకట్టడం సరికాదని అభిప్రాయపడినట్లు సమాచారం. ఎవరైనా మంత్రి అవినీతికి పాల్పడితే లెక్కలతో సహా సీఎం వద్దకు నిఘా సంస్థల ద్వారా వివరాలు వెళతాయి. ఆ నివేదికల ఆధారంగా ఆయా మంత్రులను పిలిచి మందలించడమో హెచ్చరించడమో చేయొచ్చుకదా అని అభిప్రాయపడినట్లు తెలిసింది. అందర్నీ ఒకే గాటన కట్టేసి అవినీతికి దూరంగా ఉండండి అంటే.. అందరిలో ఆత్మన్యూనత భావం తలెత్తే ప్రమాదం ఉంటుందని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. "కొత్తగా వచ్చిన మంత్రులు జాతిరత్నాలు”. "ఆలస్యంగా వచ్చాం. సమయం లేదు మిత్రమా" అన్నట్లు వ్యవహరిస్తున్నారు అని మరో మంత్రి వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.