ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నకిలీ ధ్రువపత్రాలతో 15 నల్లకోట్లు.. పోలీసులకు బార్ కౌన్సిల్ ఫిర్యాదు..

By

Published : Jan 21, 2023, 10:54 AM IST

Fake lawyers

Fake lawyers: ఏపీ బార్ కౌన్సిల్​లో.. నకిలీ ధ్రువపత్రాలతో న్యాయవాదులుగా పేరు నమోదు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై బార్ కౌన్సిల్ తీవ్రంగా మండిపడింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బార్‌ కౌన్సిల్‌ కార్యదర్శి బి.పద్మలత తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Fake lawyers: గుంటూరు జిల్లాలో పలువురు నకిలీ ధ్రువపత్రాలతో న్యాయవాదులుగా పేరు నమోదు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీన్ని ఏపీ హైకోర్టు బార్‌ కౌన్సిల్‌ తీవ్రంగా పరిగణించింది. నకిలీ ధ్రువపత్రాలతో న్యాయవాదులుగా పేరు నమోదు చేసుకొని.. పదకొండేళ్లకు పైగా దిగువ కోర్టులో ప్రాక్టీసు చేస్తున్నవారు ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొత్తం 15 మంది నకిలీ నాయవాదులను బార్‌ కౌన్సిల్‌ గుర్తించింది. అందులో ఎనిమిది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి న్యాయవాదిగా పేరును ఉపసంహరించుకున్నారు. మిగిలిన ఏడుగురిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరుతూ.. బార్‌ కౌన్సిల్‌ కార్యదర్శి బి.పద్మలత ఈనెల 11న తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై కేసులు నమోదు అయ్యాయి.

క్రైం నంబరు 7/2023లో ఐపీసీ సెక్షన్లు 420, 467, 468, 471, 120(బి), రెడ్‌విత్‌ 34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చింతకాయల సీఎస్‌ఎన్‌ మూర్తి (తుని), డి.చాముండేశ్వరి(తెనాలి), సీడీ పురుషోత్తం(అనంతపురం), శ్రీమతి డి.రత్నకుమార్‌(ఏపీ హైకోర్టు ప్రాక్టీసు) నిక్కి నాగేశ్వరరావు(సత్తెనపల్లి), మాచర్ల వెంకటేశ్వరరావు(సత్తెనపల్లి), కొత్తూరి శ్రీనివాస్‌వరప్రసాద్‌(కాకినాడ)లను నిందితులుగా పేర్కొన్నారు.

ధ్రువపత్రాల పరిశీలనలో భాగంగా వీరి విద్యార్హత ధ్రువపత్రాలు సరైనవా కాదా? అని నిర్ధారించాలని సంబంధిత కళాశాలలు, యూనివర్సిటీలకు పంపగా.. వీరు సమర్పించిన ధ్రువపత్రాలు తప్పుడు, ఫోర్జరీ చేసినవనిగా తేలాయని బార్‌ కౌన్సిల్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఇదే తరహా వ్యవహారంపై క్రైం నంబరు 8/2023 పోలీసులు నమోదు చేశారు.

నకిలీ న్యాయవాదుల కేసు విచారణ ముమ్మరం

ఈ ఉదంతంపై తుళ్లూరు పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. స్టడీ సర్టిఫికెట్లను ఆయా విశ్వవిద్యాలయాలకు పంపి వాటిని నిర్ధారించాలని లేఖలు రాశారు. న్యాయవాదిగా పేరు నమోదు సందర్భంగా.. ఆంధ్రా విశ్వవిద్యాలయం, బీహార్‌లోని బోధ్‌గయా విశ్వవిద్యాలయం, అస్సాంలోని జిబ్రుగడ్డ వర్సిటీ, యూపీలోని నెమోలీపాల్‌ విశ్వవిద్యాలయాల్లో ఎల్‌ఎల్‌ఎం తదితర కోర్సులు చదివినట్లు వీరు ధ్రువపత్రాలను బార్‌ కౌన్సిల్‌కు అందజేశారు.

సంబంధిత వ్యక్తులు సమర్పించిన ధ్రువపత్రాలను ఇప్పటికే ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఆయా విశ్వవిద్యాలయాలకు పంపగా వారెవరూ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందలేదని, చదవలేదని ఏపీ బార్‌ కౌన్సిల్‌కు రాతపూర్వకంగా తెలియజేశారు.

మరోవైపు తుళ్లూరు పోలీసులు సైతం ఆయా విశ్వవిద్యాలయాలకు సర్టిఫికెట్లను .. అధికారిక మెయిల్‌ ద్వారా పంపి వాటిని నిర్ధారించాలని వారం క్రితమే కోరారు. యూనివర్సిటీ యాజమాన్యం వారెవరూ వర్సిటీల్లో చదివింది లేనిది అధికారికంగా తెలియజేయాలని ఆయా విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లకు లేఖలు రాశామని తుళ్లూరు డీఎస్పీ పోతురాజు తెలిపారు.

గత కొద్ది రోజుల క్రితమే తమకు ఫిర్యాదు అందిందని డీఎస్పీ అన్నారు. కేసు నమోదు చేసి కొందరిని విచారించామని తెలిపారు. బాధ్యులను త్వరలోనే అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఈ కేసులో కఠినమైన సెక్షన్లు జోడించడంతో బాధ్యులు జైలుకు వెళతారు అని డీఎస్పీ పోతురాజు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details