పులివెందుల హైవే పనుల టెండర్లు.. టెక్నికల్‌ బిడ్లు తెరవకముందే చక్రం తిప్పిన ముఖ్య నేత సంస్థ!

author img

By

Published : Jan 21, 2023, 9:07 AM IST

PULIVENDULA ROAD TENDERS

PULIVENDULA HIGHWAY TENDER WORKS: పులివెందుల హైవే పనుల టెండర్ల కోసం కీలక మంత్రి, సీఎం బంధువు మంత్రాంగం నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఎవరూ పోటీకి రాకుండా... రెండు ఉత్తరాది సంస్థలు వైదొలగేలా మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. టెక్నికల్‌ బిడ్లు తెరవకముందే చక్రం తిప్పిన ముఖ్యనేత సంస్థ.. 200 కోట్ల అంచనాలు పెంచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేంద్రానికి అందిన ఫిర్యాదులతో విచారణ చేపట్టింది.

PULIVENDULA HIGHWAY TENDER WORKS : వైఎస్సార్​ జిల్లా ముద్దనూరు నుంచి పులివెందుల మీదుగా బి.కొత్తపల్లి వరకు.. 891.44 కోట్ల అంచనా వ్యయంతో ఎన్​హెచ్​-716Gని 56 కిలో మీటర్ల మేర విస్తరించేందుకు గతేడాది జులైలో "కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వశాఖ- మోర్త్‌" టెండర్లు పిలిచింది. సెప్టెంబర్ 23 వరకు టెండర్లు స్వీకరించారు.

ఈ పనులను సీఎంకు బంధువైన ఓ నేత, రాయలసీమలోని పెద్దాయన సంస్థ కలిసి సొంతం చేసుకోవాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే టెండరులో 200 కోట్ల రూపాయల అంచనాలు పెంచేశారని, అర్హ్హత ఉన్న సంస్థలు బిడ్లు వేయకుండా ఒత్తిడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై మోర్త్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో... ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అయినా ఈ నేతలు టెండరు సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

పులివెందుల హైవే పనుల టెండర్లు.. టెక్నికల్‌ బిడ్లు తెరవకముందే చక్రం తిప్పిన ముఖ్య నేత సంస్థ!

సాంకేతికంగా తెరవని బిడ్లు: అయితే... ఈ పనికి ఇంకా సాంకేతిక బిడ్లు తెరవలేదు. కానీ బిడ్లు వేసిన సంస్థలు బ్యాంకు గ్యారంటీలను మోర్త్‌ కార్యాలయంలో అందజేస్తాయి. ముందుగానే ఆ వివరాలు సేకరించిన పెద్దాయన సంస్థ... పోటీ సంస్థలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఉత్తరాదికి చెందిన ఓ కీలక గుత్తేదారు సంస్థతో ఇటీవలే చర్చించినట్లు తెలిసింది. ఆ సంస్థ ఇప్పటికే మన రాష్ట్రంలో పలు కీలక ప్రాజెక్టులు చేస్తోంది. అందువల్ల పులివెందుల హైవే టెండరు నుంచి వైదొలగాలని కోరుతున్నట్లు సమాచారం. రాజస్థాన్‌కు చెందిన మరో పెద్ద సంస్థ కూడా పోటీలో ఉండటంతో... వారితోనూ మంతనాలు ప్రారంభించారని తెలిసింది.

N.H. ప్రాజెక్టుల్లో ఏదైనా బిడ్‌ దాఖలుచేశాక.. ఆయా గుత్తేదారు సంస్థల బిడ్‌ వ్యాలిడిటీ 120 రోజులు ఉంటుంది. అప్పటికీ టెండర్లు ఖరారు కాకపోతే.. బిడ్లు వేసిన సంస్థలు బరిలో ఉంటాయా, లేదా అనేది తెలపాలని మోర్త్‌ కోరుతుంది. పొడిగించుకోబోమని చెప్పి గుత్తేదారులు టెండరు ఉపసంహరించుకునే వీలుంది. పులివెందుల హైవే టెండర్ల దాఖలు గడువు సెప్టెంబరు 23తో ముగియడంతో.. ఇందులో టెండర్లు వేసిన గుత్తేదారు సంస్థల బిడ్‌ వ్యాలిడిటీ రెండు రోజుల్లో ముగియనుంది. అవి తమ బిడ్‌ వ్యాలిడిటీని పొడిగించుకోకుండా ముఖ్యనేత సంస్థ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. ఇవి సఫలీకృతమయ్యేలా ఉన్నాయని తెలుస్తోంది.

ముద్దనూరు-పులివెందుల-బి.కొత్తపల్లి N.H ప్యాకేజీకి ఇరువైపులా ఉన్న రెండు పనుల్లో పెద్దఎత్తున పోటీ ఉంది. తాడిపత్రి-ముద్దనూరు మధ్య 51 కిలోమీటర్ల విస్తరణకు 594 కోట్లతో టెండర్లు పిలిస్తే... అంచనా కంటే 28.55 శాతం తక్కువకు కోట్‌ చేసి రిత్విక్‌ కన్‌స్ట్రక్షన్స్‌ బిడ్‌ దక్కించుకుంది. బి.కొత్తపల్లి - గోరంట్ల మధ్య 57 కిలోమీటర్ల విస్తరణకు 650 కోట్లతో టెండర్లు పిలవగా... ఏడు సంస్థలు పోటీ పడుతున్నాయి.

ఈ ప్యాకేజీలోనూ అంచనా కంటే 25 – 30 శాతం తక్కువకు టెండరు ఖరారయ్యే వీలుందని తెలుస్తోంది. ముద్దనూరు-పులివెందుల-బి.కొత్తపల్లి ప్యాకేజీలో మాత్రం పోటీ లేకుండా చూడటం ద్వారా... అంచనా కంటే కేవలం 2 నుంచి 3 శాతమే తక్కువకు పని దక్కించుకోవాలనే వ్యూహంతో తెరవెనుక కథ నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.