ఆంధ్రప్రదేశ్

andhra pradesh

స్టడీ మెటీరియలా.. వైసీపీ కరపత్రమా..!

By

Published : Jan 19, 2023, 5:57 PM IST

Updated : Jan 19, 2023, 8:23 PM IST

School books have a political color

YSRCP publicity on School Books: రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ప్రచారానికి అన్ని వనరులనూ వాడుకుంటోంది. ఇప్పటికే ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, ఇళ్లు, స్థలాలను వాడుకున్న వైకాపా.. తాజాగా స్కూల్ పిల్లలకు పంపిణీ చేసిన పుస్తకాలకూ రాజకీయ రంగులు అద్దింది. ఇంటింటి ప్రచారానికి సరైన మార్గమని భావించిందేమో.. స్టడీ మెటీరీయల్ కవర్ పేజీపై పథకాల పేరిట ఆ పార్టీ నాయకుల చిత్రాలనూ ముద్రించింది. నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు అధికారులు విధేయతను ఇలా చాటుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బడి పిల్లల పుస్తకాలకూ వైసీపీ రాజకీయ రంగు

School Children's Books Political Color : ప్రభుత్వ భవనాలకు రాజకీయ రంగులు అద్దడం సరికాదని న్యాయస్థానం ఆక్షేపించినా.. అధికారులు, వారిని ప్రభావితం చేసే నాయకులు ఏమాత్రం తగ్గడంలేదు.. అవకాశం వచ్చినప్పుడల్లా తమదైన ముద్ర వేస్తూ వినయ విధేయత చాటుకుంటున్నారు. ఇప్పటికే పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల, స్థల పట్టాలు, భూ హక్కు పత్రాలు -అన్నింటిపైనా అధికార పార్టీ రంగులు అద్దిన సంగతి తెలిసిందే. అంతకుమించి.. అన్నట్లు పరీక్షలు దగ్గర పడుతున్న వేళ పదోతరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన స్టడీ మెటీరియల్ పుస్తకాలపైనా వైకాపా రంగులద్ది.. ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్నాల పథకాల ప్రచారంతోపాటు.. ముఖ్యమంత్రితో సహా ఇతర నాయకుల చిత్రాలు ముద్రించి పిల్లలకు పంచిపెడుతూ ఇంటింటి ప్రచారానికి తెరలేపింది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్తు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న పదోతరగతి స్టడీ మెటీరియల్ (20 22-23) తాజాగా వివాదాస్పదమైంది. పూర్వ తూగోలో ఉండే ప్రస్తుత కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని 480 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం రూ.1.20 కోట్లు వెచ్చించి 49వేల తెలుగు- ఆంగ్ల మాధ్యమ స్టడీ మెటీరియల్ పుస్తకాలు జడ్పీ నిధులతో ముద్రించారు. ఆయా పుస్తకాలను జడ్పీ
చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, కాకినాడ ఎంపీ వంగా గీత, కాకినాడ, కోనసీమ కలెక్టర్లు ఇతర ముఖ్యుల చేతుల మీదుగా బుధవారం పంపిణీ ప్రారంభించారు.

'జగనన్న విద్యా 'భారతి' :'జగనన్న విద్యా 'భారతి' పేరుతో ముద్రించిన ఈ స్టడీ మెటీరియల్ పుస్తకం కవర్ పేజీపై వైకాపా రంగుల మధ్య ముఖ్యమంత్రి జగన్ సహా మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, పినిపే విశ్వరూప్, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణు, జడ్పీ చైర్మన్, సీఈవోల చిత్రాలు ముద్రించారు. రెండో పేజీలో ముఖ్యమంత్రి విద్యార్థులతో ఉన్న విద్యా కానుక, నాడు-నేడు కార్యక్రమాల చిత్రాలు ముద్రించారు.

రాష్ట్ర ప్రభుత్వ నాయకుల ఫొటోలను పుస్తకాలపై ముద్రించడం సరికాదు. ముఖ్యమంత్రి మొదలుకుని కిందిస్థాయి నాయకులు మాట్లాడే భాషను ప్రతి ఒక్కరం గమనిస్తున్నాం. అలాంటపుడు స్కూలు పిల్లలు ఏం నేర్చుకుంటారు. ఈ నాయకులు మాట్లాడే భాషను వాళ్లు నేర్చుకోవాలా..? ఈ అభద్రతా భావం తల్లి్దండ్రుల్లో ఉంది. - పావని, టీడీపీ నాయకురాలు

ముఖ్యమంత్రి దంపతులను స్మరిస్తున్నట్లు ప్రచార చిత్రం.. :పుస్తకం వెనుక భాగంలో నవరత్నాల్లో భాగంగా అమలుచేస్తున్న తొమ్మిది పథకాలతో కూడిన ప్రచార చిత్రం.. ఆ కిందనే నాలుగు జిల్లాల కలెక్టర్ల చిత్రాలు ముద్రించారు. మరో పేజీలో అన్ని మండలాల జడ్పీటీసీ సభ్యుల చిత్రాలు ముద్రించారు. విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాలపై ఈ ప్రచారాలు గోలేంటనే విమర్శలు వినిపిస్తుంటే.. ఈ పుస్తకానికి పెట్టిన పేరు 'జగనన్న విద్యా భారతి' సైతం ముఖ్యమంత్రి దంపతులను స్మరిస్తున్నట్లు ఉందనే వ్యాఖ్యలు పించాయి.

పాఠ్య పుస్తకాలపై స్వతంత్ర పోరాట యోధులు, సంఘ సంస్కర్తలు, క్రీడాకారులు లేదా శాస్ర్తవేత్తల ఫొటోలు ముద్రించడం చూశాం. కనీవినీ ఎరుగని విధంగా ప్రభుత్వ భవనాలకు కూడా పార్టీ రంగులు వేశారు. కోర్టు మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వం మారలేదు. విద్యార్థులకు రాజకీయరంగు ఎందుకు పులుముతున్నారు. - సత్య, జనసేన నాయకుడు

జడ్పీ సర్వసభ్య సమావేశం ప్రారంభంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ప్రతి మండలంలో జడ్పీటీసీ సభ్యుల సమక్షంలో విద్యార్థులకు ఈ పుస్తకాల పంపిణీ చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించడం గమనార్హం.

ఇవీ చదవండి :

Last Updated :Jan 19, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details