ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గడప గడపకు మన ప్రభుత్వం .. రెండో రోజూ సేమ్ సీన్ రిపీట్

By

Published : May 13, 2022, 4:47 AM IST

గడప గడపకూ

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో రెండో రోజైన గురువారం మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు పలు చోట్ల పాల్గొన్నారు.ఎక్కడికక్కడ ప్రజలు సమస్యలను ఏకరవుపెట్టారు. పథకాలు తమకు అందడం లేదంటూ ప్రజాప్రతినిధులను నిలదీశారు.

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో రెండో రోజైన గురువారం మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలను పలుచోట్ల ప్రజలు నిలదీశారు. మురుగు కాలువలు నిర్మించడం లేదని, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని, ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని, ఇంటి నిర్మాణ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక తమకు జరిగిన అన్యాయంపై సూళ్లూరుపేటలో గట్టిగా నిలదీసిన మహిళల కుటుంబాలకు అందుతున్న సంక్షేమ పథకాలను రద్దు చేయాలని స్థానిక ఎమ్మెల్యే ఆదేశించడం చర్చనీయాంశమైంది. అధికార పార్టీ వారికీ పథకాలు సరిగా అందడం లేదని, ఇలాగైతే తాము ప్రజల వద్దకు ఎలా వెళ్లగలమంటూ పల్నాడు, శ్రీకాకుళం జిల్లాల్లో వైకాపా కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన మాజీ మంత్రి వెలంపల్లికి పశ్చిమ విజయవాడలో వాలంటీర్లే తమ కష్టాలను వివరించారు.

‘అయ్యా..! ఏదో చిన్నపాటి ఉద్యోగంతో కుటుంబాన్ని పోషించుకొనేవాళ్లం. మీ ప్రభుత్వం వచ్చింది. మీరు ఎమ్మెల్యే అయ్యారు. మా ఉద్యోగాన్ని ఊడగొట్టారు. ఇప్పుడు కూలి పనులకు వెళ్తున్నాం. మాకు రావాల్సిన బకాయిలనూ చెల్లించలేదు’ అంటూ తిరుపతి జిల్లా వెంకటరెడ్డిపాలెంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను మహిళ నిలదీసింది.

తృప్తిగా తినలేకపోతున్నాం

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం పాత మినుములూరులో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మిని వివిధ సమస్యలపై ప్రజలు నిలదీశారు. తమ వీధిలో బావి పాడైనట్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని మండిపడ్డారు. తమ సొంత డబ్బులతో ఇళ్లు నిర్మించుకుంటున్నామని, మూడేళ్లు గడిచినా ఒక్క పైసా విడుదల కాలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా ఓజిలి మండలం వెంకటరెడ్డిపాలెం, వాకాటివారి కండ్రిగ, రాజుపాలెం గ్రామాల్లో గురువారం సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య పర్యటించారు. వెంకటరెడ్డిపాలెంలో ముస్లూరు నాగమ్మ అనే మహిళ మాట్లాడుతూ... ‘ప్రభుత్వ పాఠశాలలో ఆయాగా పనిచేసేదాన్ని. ఏ కారణంతో నా జీవనోపాధి ఊడగొట్టారు? ఈ విషయంపై గతంలో ఒకసారి కలవగా వాకాటి వరికండ్రిగ పాఠశాలలో బాత్‌రూమ్‌లు కడిగే పని ఇప్పిస్తాలే అని అవమానించారు. ఇప్పటివరకు రూ.30వేల బకాయిలకు దిక్కులేదు’ అని మండిపడ్డారు. అనంతరం ఆమె చేయి పట్టుకుని ‘నీకు జగనన్న చేదోడు వస్తుంది కదా’ అని ఎమ్మెల్యే సముదాయించబోగా ‘ముందు నాచేయి వదులు.. నేనేమీ మీ కల్లబొల్లి మాటలకు మోసపోను. నేనేమైనా మీ ప్రభుత్వ పథకాలతోనే బతుకుతున్నానా..’ అని గద్దించడంతో ఎమ్మెల్యే వెనుదిరగాల్సి వచ్చింది. అనంతరం అదే గ్రామంలో సుబ్రహ్మణ్యం ఇంటికి ఎమ్మెల్యే వెళ్లగా అక్కడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇంటి ఇల్లాలిని ‘అమ్మా మీకు అమ్మఒడి వచ్చిందా’ అని వాకబు చేయగా... జనవరిలో వేయాల్సిన అమ్మఒడి ఇప్పటికీ వేయలేదేమని నిలదీశారు. గతంలో తన భర్త చెత్త సంపద కేంద్రంలో పనిచేసే వారని, ఈ ప్రభుత్వం వచ్చాక తనని ఎలాంటి కారణం లేకుండానే తొలగించారని, ఏడాది పని చేస్తే నెల జీతమే ఇచ్చారని ఆరోపించారు. వారి మాటలతో ఖిన్నుడైన ఎమ్మెల్యే సంజీవయ్య... ‘తక్షణం వీరికి వస్తున్న ప్రభుత్వ పథకాలను రద్దు చేయండి’ అంటూ అక్కడి నుంచి వెనుదిరగడం గమనార్హం.

వ్యాధులతో అల్లాడుతున్నామని ఆందోళన

మురుగు కాలువలు సరిగా లేకపోవడంతోనే దోమలు ప్రబలి... తమ కుటుంబంలో ఒకరికి డెంగీ సోకిందని కర్నూలు గడ్డావీధిలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను సర్ఫరాజ్‌ అనే స్థానికుడు నిలదీశారు.

* తనకు మూడేళ్లుగా రైతు భరోసా రావడం లేదని ఓర్వకల్లు మండలం కొమరోలులో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఎదుట రైతు ఖాజాహుస్సేన్‌ వాపోయారు. మైనారిటీ కాలనీలో సామూహిక మరుగుదొడ్డి లేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు మొరపెట్టుకున్నారు. తనకు రెండేళ్లుగా ఇంటి బిల్లులు ఇవ్వటం లేదని లబ్ధిదారుడు బుడ్డన్న వాపోయారు.

* విజయవాడ భవానీపురం 40వ డివిజన్‌లో గురువారం పర్యటించిన మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుకు పలువురు వాలంటీర్లు జీతాలు ఇప్పించాలని మొరపెట్టుకున్నారు.

సీఎం సహాయ నిధి దరఖాస్తుల తిరస్కరణపై ఆగ్రహం

పల్నాడు జిల్లా అమరావతి మండలం పెదమద్దూరులో గురువారం పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావును సమస్యలపై స్థానికులు నిలదీశారు. రెండేళ్ల క్రితం అప్పు తెచ్చి రూ.5 లక్షలతో శస్త్ర చికిత్స చేయించుకున్నానని, సీఎం సహాయనిధికి పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా తిరస్కరిస్తున్నారని గ్రామస్థుడు మేకల వెంకట్రావు వాపోయారు. సొంత పార్టీ వారికే న్యాయం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు సరిగా లేవని, తాగునీరు రావడం లేదని, ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని మహిళలు మండిపడ్డారు.

* శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పిట్టలసరియాలో పాల్గొన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు సమస్యల సెగ తగిలింది. సొంత పార్టీ నాయకులే మాట్లాడుతూ... తమ పార్టీవారు కట్టుకున్న ఇళ్లకూ బిల్లులు రాలేదని, తమకు ఇబ్బందిగా ఉందన్నారు. జలుమూరు మండలం తిలారు ఆర్‌ఎస్‌, యాళ్లపేటలకు నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ వెళ్లగా తమకు ఇళ్లు, ఇంటి స్థలాలు, రేషన్‌ కార్డులు, పింఛన్లు రాలేదని తెలిపారు.

ఫిరంగిపురంలో ‘న్యూస్‌టుడే’ ప్రతినిధిపై ఆంక్షలు

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో మీడియా ప్రతినిధిపై అధికార పార్టీ నాయకులు ఆంక్షలు విధించారు. ఫిరంగిపురం క్రీస్తునగర్‌లో గురువారం మధ్యాహ్నం లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల గురించి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివరిస్తున్నారు. విధుల్లో భాగంగా ఈ కార్యక్రమం చిత్రీకరించేందుకు మీడియా ప్రతినిధులు కొందరు అక్కడే ఉన్నారు. వైకాపా స్థానిక నాయకులు ఇద్దరు అక్కడకు వచ్చి... కార్యక్రమం చిత్రీకరించే అవసరం లేదని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని ‘న్యూస్‌టుడే’ ప్రతినిధిని హెచ్చరించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ... చేతులు పట్టుకుని బయటికి పంపించారు.

ఇదీ చదవండి:విశాఖలో 'గడప గడపకు ప్రభుత్వం'.. మాజీ మంత్రి అవంతి నిలదీత!

ABOUT THE AUTHOR

...view details